Latest News

టీకాంగ్రెస్‌కు డేంజర్‌ బెల్స్‌... భయపెడుతోన్న వలసల సునామీ

posted on: May 16, 2017 10:32AM


 

తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్‌ను... ఆ తర్వాత వ‌రుస ఓట‌ములు మ‌రింత కుదిపేశాయి. ఆ నిరాశతోనే పలువురు నేత‌లు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌‌లోకి క్యూ క‌ట్టారు. ఆ వలసల భయం నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న కాంగ్రెస్‌ను మ‌రోసారి వ‌ల‌స‌ల భయం వెంటాడుతోంది. తాజాగా పార్టీ నుంచి భారీ వ‌స‌ల‌స‌లు ఉంటాయ‌నే చ‌ర్చ బ‌లంగా వినిపిస్తోంది. పార్టీలో ఏ ఇద్దరు నేత‌లు క‌లిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. వ‌ల‌సల జాబితాలో ప‌లువురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తుండ‌టంతో ఆ పార్టీకి మింగుడు ప‌డ‌టం లేదు.

 

అయితే ఈసారి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోకి కాకుండా... జాతీయ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హస్తం పార్టీ నుంచి  దాదాపుగా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్‌‌లో ఉన్నారనే వాదన బ‌లంగా వినిపిస్తోంది. వీరితోపాటు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. మొత్తం 30మంది నేతలు కమలం పార్టీలోకి జంప్ అయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నార‌నే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌... హైదరాబాద్‌ బ్రదర్స్‌గా పేరొందిన మాజీ మంత్రులిద్దరు... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఈ నేతలు... త్వరలోనే కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు.

 

అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం త‌మ పార్టీ నుంచి వ‌ల‌స‌లు ఉండవంటున్నారు. పైగా  ఇత‌ర పార్టీల‌కు చెందిన చాలా మంది నేత‌లు తమకు ట‌చ్ లో ఉన్నార‌ని చెబుతున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వారంతా కాంగ్రెస్‌లోకి వస్తారంటున్నారు. తమతో టచ్‌లో ఉన్న నేతల్లో అధికార టీఆర్‌ఎస్‌ నేత‌లు కూడా ఉన్నార‌ని ఉత్తమ్ చెబుతున్నారు. అయితే ఉత్తమ్‌ కామెంట్స్‌ను లైట్‌ తీస్కుంటున్న టీకాంగ్రెస్‌ సీనియర్లు.... నేతలు చేజార‌కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. లేదంటే వలసల సునామీ కాంగ్రెస్ ను ముంచేయ‌డం ఖాయ‌మ‌ంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...