సోనియా కరీంనగర్ సభ ఫెయిలయిందా?

posted on: Apr 17, 2014 2:19PM

 

 

 

కరీంనగర్‌లో సోనియాగాంధీ చేత సభను నిర్వహించాలని టీ కాంగ్రెస్ నేతలు ఎన్నో తంటాలు పడి ఆమెను కరీంనగర్‌కి పిలిపించారు. ఈ సభ నిర్వహణకు, జనం తరలింపుకి అయిన ఖర్చంతా తమ జేబుల్లోంచే వేసుకుని సోనియమ్మని పిలిపించారు. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం కరీంనగర్ సభలోనే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది.

 

ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది కాబట్టి మళ్ళీ కరీంగనగర్‌లోనే సోనియా సభ పెడితే తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌తో తడిచిపోయి కాంగ్రెస్‌కి ఓటేస్తారన్నది టీ కాంగ్రెస్ నేతల  ప్లాన్. ఈ ప్లాన్‌లో భాగంగా సోనియా రావడం, కరీంనగర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించడం, తెలంగాణ ఇచ్చిన ఘనత తమదేనని మిగతా ఏ పార్టీకి సంబంధం లేదని ప్రకటించేసింది. అయితే సోనియా సభ సూపర్‌గా జరిగిందని టీ కాంగ్రెస్ నాయకులు మీడియా మైకుల ముందు సంతోషంతో మెలికలు తిరిగిపోతూ చెబుతున్నప్పటికీ, వారి మనసులలో సభ జరిగిన తీరు సంతోషాన్ని కలిగించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.


సోనియా వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిందే తప్ప సభలో వున్న జనాన్ని ఆమె ప్రసంగం అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ చెప్పే అరిగిపోయే రికార్డు డైలాగులే తప్ప కొత్త డైలాగులు సోనియా చెప్పలేదు. అది కూడా అర్థం కాని హిందీలో చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమె ఏం మాట్లాడిందో ఏమీ అర్థం కాలేదని సభలో పాల్గొన్న మహిళలు అనుకున్నట్టు సమాచారం. అలాగే సోనియా మాట్లాడుతున్నంతసేపూ సభలో వున్న జనం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఏదో మాట్లాడుతోంది కాబట్టి వింటున్నాం అన్నట్టుగా సభ సాగింది. మరి ఇలా చప్పగా జరిగిన సభ తమకు ఎంతమాత్రం ఓట్లు రాలుస్తుందన్న అనుమానం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వుంది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...