మారేడుమిల్లి అడవుల్లో కర్రపాము!.. కనిపించిందా?

posted on: Mar 20, 2026 2:55PM

చూట్టానికి కర్రపుల్లలా ఉంటుంది. ముట్టుకుందామంటే కదిలి పారిపోతుంది. ఔను అచ్చం కర్రపుల్లలా కనిపించే పాము ఏపీలోని మారేడుమిల్లి అడవులలో సంచరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతం జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అత్యంత అరుదైన జీవరాశుల మనుగడ, ఉనికి ఇక్కడ కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జాతికి చెందిన అహేతుల్లా లాడంకియా  అనే జాతికి చెందిన సరీసృపం కనిపించింది. ఇది చూడడానికి కర్రలా కనిపించే పాము. ఇది విషపూరితమైన పామే అయినా.. దీని విషం ప్రభావం అత్యంత స్వల్పం.దీని కాటు మనిషి ప్రాణం తీసేంత ప్రమాదకరం కాదు. ఇది మనుషుల కంట్లో అత్యంత అరుదుగా పడుతుంది. మారేడుమిల్లి లోని జంగిల్ స్టార్ నేచర్ క్యాంపు పరిసరాల్లో ఈ కర్రపాము సంచారాన్ని గుర్తించారు. చిన్న కర్రముక్కలా కనిపించే ఈ పాము ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.

 ఇది సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంది. దీని శరీరాకృతి కారణంగా దీని ఉనికిని కనిపెట్టడం కష్ట సాధ్యం. చెట్ల కాండం, ఆకులలో కలిసిపోతుంది. దీని ఆకారం కారణంగా ఇది పాము అని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఎండిన కర్రపుల్లలా ఉండే ఈ పాము తల పోడవుగా మొడకంటే వెడల్పుగా ఉంటుంది. ఇది రాత్రి పూట మాత్రమే సంచరిస్తుంది.

చిన్న చిన్న బల్లులు, కప్పలు, పక్షులు, పక్షుల గుడ్లే ఆహారం.  ఈ జాతిని పరిరక్షించి, సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఇటువంటి అరుదైన, అంత రించిపోతున్న జీవజాలాన్ని పరిరక్షించేందుకు ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...