తెలంగాణ డీజీపీ ఫోన్ ట్యాప్! హుజురాబాద్ ఎన్నికల వేళ కలకలం...

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. లేట్ గా ప్రచారానికి వచ్చినా... హుజురాబాద్ లో అదరగొట్టారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం పలు సభల్లో ప్రసంగించిన రేవంత్ .. కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

హుజూరాబాద్ లో అధికార పార్టీ అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్ ను వ్యసనాలకు అడ్డాగా మార్చాయన్నారు. పంపకాల్లో తేడా వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పోలీస్ విభాగం రెండుగా విడిపోయిందని సంచలన ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికలో పోలీసులు నిజాయతీగా వ్యవహరించడం లేదని, టీఆర్ఎస్ నేతలు పోలీసు విధులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డీజీపీ ఫోన్ నూ ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.  డీజీపీపై నర్సింగరావు, తమపై వేణుగోపాలరావు నిఘా పెట్టారని చెప్పారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన పోలీసులను వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడు అని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆయన  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఇతర మంత్రులూ  అనామకులేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని నాన్ లోకల్ అంటున్నారని, మరి, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో పోటీ చేసిన వారెలా స్థానికులవుతారని ప్రశ్నించారు. దళితబంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని విమర్శించారు. సిద్దిపేటలో దళితబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు.

దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ ను నిలదీశారు రేవంత్ రెడ్డి. జనాలను భయపెట్టి ఓట్లేయించుకునేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే టీఆర్ఎస్ లో ముసలం ఖాయమని, కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబంలో ప్రాణ త్యాగాలు ఎవరూ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు.