‘మిథున్‌రెడ్డి గోబ్యాక్’... ప్రతిధ్వనించిన పుంగనూరు!

పుంగనూరులో తండ్రికి జరిగిన సత్కారమే కొడుక్కి కూడా జరిగింది. మొన్నటి ఎన్నికల ఫలితాల వరకు పుంగనూరులో నిరంకుశ రాజ్యాన్ని నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పుంగనూరులో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేక ఎక్కడెక్కడో తల దాచుకుంటున్నారు. ఆయన పుంగనూరులో ఎప్పుడు అడుగు పెట్టాలని ప్రయత్నించినా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దాంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరుగుతున్నారు.  ఇప్పుడు జనం సెగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి కూడా తగిలింది. పుంగనూరుకు మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మిథున్‌రెడ్డి తమ వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి గురువారం నాడు వెళ్ళారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మిథున్‌రెడ్డి తమను వేధింపులకు గురిచేశారంటూ ఎన్డీయే కార్యకర్తలు రెడ్డప్ప ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఎన్డీయే కార్యకర్తల మీద రాళ్ళదాడి చేశారు. ఎన్డీయే కార్యకర్తలు తిరిగి రాళ్ళదాడి చేశారు. ‘మిథున్ రెడ్డి గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఎంపీ మిథున్ రెడ్డిని గృహ నిర్బంధంలో వుంచారు.