పొలిటికల్ హీట్.. వేసవి ఎండలను మించి!

posted on: May 1, 2026 1:23PM

తెలంగాణలో రాజకీయ వాతావరణం   వేడెక్కుతోంది.  వెసవి ఎండలను తలదన్నేలా.. పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.  అటు బీఆర్ఎస్ వరుస భేటీల‌తో కేడర్‌లో జోష్ నింపుతుంటే, ఇటు ప్రధాని మోడీ పర్యటనతో బీజేపీ సైతం భారీ ఏర్పాట్లతో ఉత్సాహం చూపుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ వరుసగా పార్టీ మీటింగ్ లు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ తన రైతు డిక్లరేషన్  హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ.. వరంగల్‌లో బీఆర్ఎస్ ఈనెల 6న  భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 

ఇటీవ‌వ‌ల‌ జరిగిన జిల్లా నాయకుల సమావేశంలో  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో  కరెంటు కోతలు పెరిగాయనీ, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందనీ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యాయని, దీనిపై పోరాడాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు  తెలంగాణను కాపాడుకుందాం  అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. 

ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 8 వేల‌ కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు   శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈసందర్భంగా జనాగ్రహ సభను భారీ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది.  క్షేత్రస్థాయిలో ఆందోళనలు నిర్వ‌హించ‌డంలో భాగంగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద‌గ్గ‌ర‌ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఇప్పటికే రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న  రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి  తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది. మాములుగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి రాజ‌కీయ సంద‌డి క‌నిపిస్తుంది.. కానీ అంత‌క‌న్నా ఒక‌డుగు ముందే ఇక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన‌ట్టు క‌నిపిస్తోంది.  ఒక ప‌క్క బీఆర్ఎస్ కి, టీఆర్ఎస్ అనే క‌విత పార్టీ రాక‌డ‌తో.. తన ఉనికిని చాటుకోవడానికి, మరోవైపు బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో మే నెల  ఎండ‌ల‌ను మించిన రాజ‌కీయ హీట్ పెరిగినట్లు కనిపిస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...