Latest News

విభజన వాదం వినిపించిన పవన్... కౌంటరిచ్చిన టీడీపీ..!

posted on: May 9, 2017 11:00AM

 

టీటీడీ ఈవో నియామక వివాదం మరింత ముదురుతోంది. తెలుగు చదవడం, మాట్లాడటం రాదు, అలాంటి అధికారిని టీటీడీ ఈవోగా ప్రభుత్వం ఎలా నియమించిందని ప్రశ్నించిన శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద...ఇది ఆగమానికి సంబంధించి సమస్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవోగా వ్యవహరించిన సాంబశివరావును బదిలీ చేయడాన్ని కూడా తప్పుబట్టారు. పైగా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సైతం సవాలు చేస్తామని స్వరూపానంద చెప్పారు.

 

స్వామీజీ విమర్శల వేడి చల్లారక ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాది అధికారిని టీటీడీ ఈవోగా నియమించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాది ఐఏఎస్‌ అధికారులకు తాను వ్యతిరేకం కాదన్న పవన్...అమర్‌నాథ్‌, వారణాసి, మధుర లాంటి ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్‌ ప్రశ్నించారు.

 

అయితే పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను టీడీపీ నేత వర్ల రామయ్య తప్పు పట్టారు. ఉత్తరాది, దక్షిణాది అని విడదీయడం మంచి పద్ధతి కాదన్నారు. మీడియాలో ప్రచారం కోసమే మాట్లాడటం సరికాదని అన్నారు. దక్షిణాది అధికారులకే టీటీడీ ఈవో పదవని ఏ చట్టంలోనూ రాసిలేదని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్‌ చేశారు కదా అని ఏది బడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. మొత్తానికి టీటీడీ ఈవో విషయంలో ప్రభుత్వ నిర్ణయం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...