Latest News
టీటీడీఈవో వివాదం… జనసేన, సెల్ఫ్ గోల్ తో సెల్ఫ్ డిఫన్స్ లో పడిందా?
posted on: May 11, 2017 10:37AM

టీటీడీ ఈవో వివాదం ఇంచుమించూ చల్లారినట్టే! కానీ, ఈ మొత్తం వ్యవహారంలో డిఫెన్స్ లో పడ్డది మాత్రం జనసేనలాగే కనిపిస్తోంది! తాజాగా ఆ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఎప్పుడూ పవన్ తప్ప మరో నేత పేరు వినిపించని జనసేనలో.. ఈసారి ఉపాధ్యక్షుడుగా మహేంద్ర రెడ్డి పేరున ఓ వివరణ బయటకొచ్చింది. దాని సారాంశం ప్రకారం… జనసేన ఉద్దేశం ఐఏఎస్ లను తక్కువ చేసి మాట్లాడటం కాదనీ ఆయన అన్నారు. ఉత్తరాదిలోని ఆలయాలకు దక్షిణాది వారు ఈవోలుగా వుండనప్పుడు దక్షిణంలో మాత్రం ఉత్తరాది వారు ఎందుకని మాత్రమే పవన్ ప్రశ్నించారని అన్నారు! అయితే, ఇలా ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి రావటం జనసేనకు కాస్త ఇబ్బందనే చెప్పుకోవాలి!
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఉత్తరాది ఐఏఎస్ ను చంద్రబాబు టీటీడీ ఈవోగా నియమించారు. అయితే, ఆయన ఏపీ క్యాడర్ అధికారే కాబట్టి టెక్నికల్ గా అందులో తప్పు లేదు. కాని, అది సంప్రదాయం మాత్రం కాదు. ఈ విషయాన్ని హైలైట్ చేయాల్సిన పవర్ స్టార్ ఉత్తర, దక్షిణ పదాలు వాడి తప్పుడు సంకేతాలు పంపినట్లు అయింది. నిజానికి పవన్ కంటే ముందు అభ్యంతరం చెప్పిన స్వామీ స్వరూపానందేంద్ర అనిల్ సింఘాల్ తెలుగు వారు కాదని మాత్రమే అన్నారు. దానికి నార్త్, సౌత్ నినాదం జోడించిన పవన్ కళ్యాణ్ పెద్ద చర్చకు కారకుడయ్యారు. కాని, అదే సమయంలో అఖిల భారత ఐఏఎస్ ల సంఘం ఖండనకు కూడా ఆయన కారణమయ్యారు! దేశంలోని అన్ని చోట్లా పని చేసే సివిల్ సర్వెంట్స్ కి కులం, మతం, ప్రాంతం అంకట్టవద్దని ఐఏఎస్ లు అంటున్నారు. కేవలం ఐఏఎస్ లే కాదు మిగతా చాలా వర్గాల నుంచీ కూడా టీటీడీ ఈవో నియమకంపై గొడవ అనవసరం అన్న అభిప్రాయం వెల్లడైంది. ఇక మోహన్ బాబు లాంటి వారు అనీల్ కుమార్ సింఘాల్ కి తమ మద్దతు కూడా ప్రకటించారు! ఇలాంటి పరిణామాలతో, జనసేన, దేశ సమగ్రత విషయంలో తమకు ఎవరు సాటిరారని చెప్పుకోవాల్సి వచ్చింది!
పవన్ కామెంట్స్ కు బదులుగా ఐఏఎస్ లు స్పందించటం, పవన్ తో పొసగదని పేరున్న మోహన్ బాబు తన అభిప్రాయం వెలిబుచ్చటం, అశోక్ గజపతి రాజు కళ్యాణ్ ఎవరో తనకు తెలియదనటం… అన్నీ చూస్తుంటే… కదపాల్సిన వారు తెర వెనుక వుంటూ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది! ముందు ముందు జనసేన అధినేత ఏ మాట మాట్లాడినా ప్రతి వ్యూహం అమలయ్యేలా కనిపిస్తోంది. చూడాలి మరి…పవర్ స్టార్ తన పవర్ ఫుల్ పంథా కొనసాగిస్తారా? లేక ఆచితూచి కామెంట్స్ చేస్తారా?


.jpg)
.jpg)


