Latest News

మోడీ ప్రభుత్వం చేత కంట తడిపెట్టిస్తున్న ఉల్లి

posted on: Jul 5, 2014 4:26PM

 

వర్షాభావ పరిస్థితుల వలననో లేక బ్లాక్ మార్కెట్ వ్యాపారుల కారణంగానో మొత్తం మీద మళ్ళీ ఉల్లి ధరలు సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోయాయి. ఉల్లి ధరల అదుపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎగుమతి ధరను టన్నుకి 300 డాలర్ల నుండి ఒకేసారు 500 డాలర్లకు పెంచింది. ఉల్లిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చింది. హోల్ సేల్ వ్యాపారులు ఉల్లిని నిర్దిష్ట పరిమితికి మించి గోదాములలో నిలువచేయరాదని, చేస్తే కటిన చర్యలు తీసుకొంటామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బ్లాక్ మార్కెటర్లపై కటిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా కూడా ఈ చర్యలేవీ ఆశించిన ఫలితాలు ఈయలేదు. అందువల్ల బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కటినచర్యలు తీసుకొనేందుకు వీలుగా నిత్యావసర సరుకుల చట్టానికి మరింత పదునుపెడుతూ, ఉల్లిని అక్రమంగా గోదాములలలో నిలువచేసిన వారిని నాన్ బెయిలబుల్ కేసుల క్రింద బుక్ చేయాలని నిశ్చయించింది. త్వరలో జరుగబోయే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో దీని కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

 

ప్రతీ ఏట ఎదురయ్యే ఈ ఉల్లి మరియు ఇతర కూరగాయల ధరల పెరుగుదలను స్థిరీకరించేందుకు, శాశ్వితప్రాతిపాదికన ‘ధరల స్థిరీకరణ నిధి’ ని కూడా ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది. కూరలు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నపుడు, ఈ నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమయిన మేరకు డబ్బు వాడుకొని ధరలను స్థిరీకరించవలసి ఉంటుంది. త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం ఇందుకు అవసరమయిన సొమ్మును కేటాయిస్తుంది. నిన్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో డిల్లీలో జరిగిన 26రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు.

 

అయితే కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఎన్ని చర్యలు చెప్పట్టినా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేనంతవరకు దాని వలన ఎటువంటి ఫలితమూ ఉండదు. అంతేకాక వివిధ రాష్ట్రాలలో ఉల్లి, దుంపలు ఇతర నిత్యావసర సరుకుల మార్కెట్లను బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నియంత్రిస్తున్నారు. అటువంటివారిని గుర్తించి వారిపై కటిన చర్యలు చేప్పట్టనంత కాలం ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం సాధ్యం కాదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...