Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉగ్రముఠాల రవాణా మార్గంగా ఇండియా.. జాతీయ భద్రతకు కొత్త సవాల్!
posted on: Mar 27, 2026 10:26AM

దేశ భద్రతకు సంబంధించి కొత్త సవాల్ ఎదురైందా? భారత్ ఉగ్రవాదుల రవాణా మార్గంగా మారుతోందా? అంటే జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన విషయాలు ఔననే అంటున్నాయి. పర్యాటక వీసాల ముసుగులో దేశంలోకి ప్రవేశించి అంతర్జాతీయ ఉగ్ర కుట్రకు పాల్పడుతున్న ఓ ముఠాను ఇటీవల ఎన్ఐఏ కోల్ కతాలో అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో అమెరికాకు చెందిన మాథ్యూ వాన్డైక్ సహా మరో ఆరుగురు ఉక్రేనియన్లు ఉన్నారు. రష్యా నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈ అరెస్టులు జరిగాయి.
వీరి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలు మయన్మార్ వంటి పొరుగు దేశాల్లోని అస్థిరతను సొమ్ము చేసుకుని ఇక్కడి తిరుగుబాటుదారులకు ఆయుధ సహా అన్ని విధాలుగా శిక్షణ ఇస్తున్నట్లు వెలుగు చూసింది. అంతే కాకుండా ఈ ముఠా అంతర్జాతీయ అస్థిరత సృష్టించేందుకు ఉగ్ర రవాణాకు ఇండియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఐరోపా నుంచి అత్యాధునిక డ్రోన్లను భారత్ మీదుగా మయన్మార్లోని తిరుగుబాటుదారులకు చేరవేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం పరికరాల సరఫరానే కాకుండా, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలు, డ్రోన్ల తయారీ మరియు మరమ్మతులపై అక్కడి ఉగ్రవాద గ్రూపులకు వీరు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మాథ్యూ వాన్డైక్ ముఠా పర్యాటక వీసాలపై భారత్కు వచ్చినట్లు గుర్తించారు. వీరే కాకుండా ఇంకా మరి కొందరు కూడా ఇలాగే పర్యాటక వీసాలతో వచ్చి అసోం, మిజోరం వంటి ప్రాంతాల్లో సంచరించినట్లు వెల్లడైంది. విదేశీయులు ఈ ప్రాంతాల్లో పర్యటించాలంటే రక్షిత ప్రాంత పర్మిట్ తప్పనిసరి. అయితే, అలాంటి ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాంతాలలో సంచరిస్తుండటమే కాకుండా యథేచ్ఛగా సరిహద్దులు దాటి మయన్మార్ చేరుకున్నట్లు కూడా ఎన్ఐఏ దర్యాప్తు తేల్చింది. మయన్మార్ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బృందాలకు వీరు సహకరించడమే కాకుండా, ఈశాన్య తిరుగుబాటు సంస్థలతో కూడా సంబంధాలు ఏర్పరుచున్నట్లు ఎన్ఐఏ ధృవీకరించింది.
అదలా ఉంటే ఎన్ఐఏ కోల్ కతాలో అరెస్టు చేసిన వారిలో ముఖ్యుడైన వాన్డైక్ సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థను నిర్వహిస్తూ.. గతంలో లిబియా, సిరియా వంటి దేశాల్లో జరిగిన అంతర్యు ద్ధాల్లో పాల్గొన్నాడు. యుద్ధాలను ఆసరాగా చేసుకుని.. ఒక దేశం నుంచి మరో దేశానికి కిరాయి ముఠాలను పంపడం వ్యాన్ డైక్ సంస్థ పని. ఇందుకోసం వాన్ డైక్ ఇండియాను సురక్షిత రవాణా మార్గంగా ఎంచుకున్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది. వాన్ డైక్ తదితరులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఉపా కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.






