పార్ట్ టైమ్ పాలిటిక్స్.. తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్ మీట్స్!
posted on: Mar 13, 2026 4:36PM

జగన్ పై నెటిజనుల ట్రోలింగ్ మామూలుగా లేదుగా?
జగన్ ప్రెస్ మీట్ అంటే మీమర్లకు పండగే పండగ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ వంటి నేత నభూతో న భవిష్యత్ అంటారు నెటిజనులు. ఎందుకంటే.. ట్రోల్ చేయడానికి జగన్ ఇచ్చే మెటీరియల్ అలాంటిది మరి. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంటే 2014 నుంచి 2019 వరకూ ఆయన ఒక రెబల్ లీడర్ అన్న గుర్తింపు ఉండేది. ఆయన ఓదార్పు యాత్రలనో, పరామర్శ యాత్రలనో, పాదయాత్ర అనో నిత్యం జనంలో ఉండేవారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే జగన్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఆరంభమైంది.
ఐదేళ్ల కాలంలో అయనంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న మరో నాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు. అధికారం ఉన్నది ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకే అన్నట్లుగా వ్యవహరించేవారు. తన విధానాలపై విమర్శలు చేసే వారిని ఆగర్భ శత్రువుగా పరిగణించి కేసులు, అరెస్టులు దాడులతో అణిచివేడమే అధికారానికి పరమార్ధం అని ఆయన భావించేవారా అన్నట్లుగా ఆ ఐదేళ్ల పాలనా సాగింది. సరే అంత వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ సహజంగానే 2024 ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయారు. ప్రజా తీర్పు ఆయనకు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా పక్కన పడేసింది. సరే అధికారం కోల్పోయిన తరువాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆయన ఏపీకి చుట్టపు చూపుగా వచ్చి.. రాష్ట్రంలో పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారు. వారంలో ఓ సారి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా ఆయన చేసిన ఈ రొజుకునన్ను వదిలేయండి అంటూ చేసిన వ్యాఖ్యపై నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఆ మీడియా సమావేశంలో జగన్ వివిధ రాజకీయ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాల గురించి ఆయన బోలెడు విషయాలు చెప్పారు. చివరిగా ఆయనను అప్పటి వరకూ చెప్పిన అంశాలను ఇంగ్లీష్ లో బ్రీఫ్ చేయమన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకు నన్ను వదిలేయండి అంటూ సమావేశాన్ని ముగించేశారు. దీంతో నెటిజనులు బ్రీఫ్ చేయమంటే సమావేశాన్నే ముగించేశారంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. పనిలో పనిగా ఆయన గతంలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అది చాలా పెద్ద ప్రశ్న అంటూ చేసిన వ్యాక్యను ఇప్పుడు మళ్లీ ప్రస్తావిస్తూ అప్పటి వీడియోను షేర్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా అధికారంలో ఉండగా ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే ధైర్యం చేయలేని జగన్ ఇప్పుడు అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి అభాసుపాలౌతుండటంపై నెటిజనులు తెగ సైటైర్లు వేస్తున్నారు.






