నియంతృత్వానికి నిలువెత్తు రూపం.. ముషార్రఫ్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చ.  ఈ నెల 5న దుబాయ్‌లో కన్నుమూసిన ముషరఫ్‌ కొన్నేళ్ల పాటు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా సర్వాధికారాలూ చెలాయించారు.  అయితే  చివరికి దుబాయ్‌లో ప్రవాసంలో ఒక సాధారణ వ్యక్తిలా కన్నుమూశారు.

పాక్ సైన్యాధ్యక్షుడిగా 1999 అక్టోబర్‌లో అధికార పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్లారు. తనకు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఉద్వాసన చెప్పబోతోందని అక్కడ ఉండగా తెలుసుకున్న ముషార్రఫ్ వెంటనే  కరాచీకి బయలుదేరి వచ్చేశారు. సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని దించేశారు.

వాస్తవానికి ముషార్రష్ ను  సైనిక దళాల ప్రధానాధికారిగా నియమించింది నవాజ్‌ షరీఫే. ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులను పక్కన పెట్టి మరీ ముషరఫ్ ను షరీఫ్ సర్వసైన్యాధికారిని చేశారు.  అదే నవాజ్ ఫరీష్ తప్పిదమని ముషార్రఫ్ ఆయననే పదవి నుంచి దించేయడం ద్వారా రుజువు చేశాడు. సైన్యాధ్యక్షుడిగా తనకు అవకాశంఇచ్చాడన్న కృతజ్ణతా భావమో ఏమో ముషార్రఫ్ ఆయనను ప్రాణాలతో ఉండనిచ్చారని పాక్ చరిత్ర తెలిసిన వారు చెబుతుంటారు. 

పాక్‌ అధ్యక్షుడుగా అధికారం చేపట్టిన తర్వాత ముషార్రఫ్‌ ఒక నియంతలా  వ్యవహరించారు. అందరి కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలన్న తపనతో పాటు, భారత్‌ మించిపోవాలన్న తపన కూడా ఆయనకు చాలా ఎక్కువ. భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య మొదటిసారిగా 1965లో యుద్ధం జరిగినప్పుడు ముఫార్రఫ్ ఒక యువ సైన్యాధికారి. 1971లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయన ఒక కమాండోగా ఉన్నారు. అయితే  ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధానికి కూడా రూపకర్త ఆయనే.

ఓ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం మామూలే. అయితే, ఈ దేశాలు అణ్యస్త్రాలను కూడా కలిగి ఉన్నప్పుడు కయ్యానికి కాలు దువ్వడం ఒక విధంగా సాహసమే అవుతుంది. నిజానికి దాదాపు ఆ సమయంలోనే అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్ పేయి భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. తాను స్వయంగా బస్సులో లాహోర్‌కు ప్రయాణించి వచ్చారు. లాహోర్‌ ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ సౌహార్ద్రం ముషరఫ్‌కు ఏమాత్రం పట్టలేదు. ఒప్పందం మీద సంతకాలు పూర్తయ్యాయో లేదో ఆయన యుద్ధానికి పథక రచన చేశారు. ఈ దాడిని భారత్‌ తిప్పికొట్టడం, అమెరికా అందుకు సహాయం కూడా చేయడం ఆయనను అన్ని విధాలా దెబ్బతీసింది.

 2001 జూలైలో ఆగ్రాలో శిఖరాగ్ర చర్చలు జరిగాయి. అయితే, ఈసారి కూడా శాంతి చర్చలు, పర్యవసనాలు కాగితాలకే పరిమితం అయ్యాయి.  2001 డిసెంబర్లో పార్లమెంట్‌ మీద లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపారు. వారికి పాకిస్థాన్‌ ప్రభుత్వ అండదండలున్నాయన్న సంగతి ప్రపంచానికి వెల్లడైంది.

 పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తీకర్‌ మహమ్మద్‌ చౌధురి రాజీనామాను డిమాండ్‌ చేయడం ద్వారా ముషార్రఫ్ తన పతనాన్ని తానే రాసుకున్నాడు.  ఇక పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోకు తగినంత భద్రతను కల్పించనందువల్లే ఆమె హత్యకు గురయ్యారనీ, దీనితో ముషర్రఫ్‌కు సంబంధం ఉందని తేలడంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు.  దుబాయ్ లో తలదాచుకున్నాడు.  అక్కడ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశమే లేకపోయింది.