పయ్యావుల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీరో
posted on: Mar 7, 2026 5:10PM

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటు శాసనసభ, ఇటు శాసన మండలిలో ఆర్థిక శాఖ,శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ సర్వం తానై అదరగొట్టారని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్ని హితుల్లోఒకరైన పయ్యావుల వాగ్దాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూటిగా సుత్తి లేకుండా సబ్జెక్ట్ బేస్డ్గా మాట్లాడటంలో కేశవ్ పరిణితి చెందారు. పరుషపదజాలం లేకుండా ప్రత్యర్ధులను టార్గెట్ చేయడంలోనూ ఆయన స్టైలే వేరుగా ఉంటుంది.
ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా ఏడు సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచిన పయ్యావుల కేశవ్ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి వాయిస్ వినిపించే సీనియర్ నేతల్లో ముందువరుసలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో విజయం సాధించే వరకు ఆయన సీనియార్టీకి తగిన గుర్తింపు దక్కలేదు, పయ్యావుల బ్యాడ్ టైమో లేకపోతే పార్టీ బ్యాడ్ టైమో కాని ఆయన ఉరవకొండలో గెలిస్తే టీడీపీ అధికారంలోకి రాదన్న ముద్ర ఉండేది. దానికి తగ్గట్లే 1999, 2014 ఎన్నికల్లో టీడీపీ పవర్ లోకి వస్తే దురదృష్టవశాత్తు కేశవ్ ఓడిపోయారు. అయితే ఆ నెగిటివ్ సెంటిమెంట్కు బ్రేక్ వేస్తూ 2024లో గెలుపొందిన ఉరవకొండ ఫైర్ బ్రాండ్ తన కెరీర్లో తొలిసారి మంత్రయ్యారు.
ఆర్థిక ,ప్రణాళిక, వాణిజ్య పన్నులు,అసెంబ్లీ వ్యవహారాలు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తాజా బడ్జెట్ సమావేశాల్లో తానేంటో నిరూపించుకున్నారు. పయ్యావుల మాట్లాడే శైలి సాధారణంగా డేటా బేస్డ్గా, చేస్తున్న ఆరోపణలకు ప్రత్యక్ష ఉదాహరణలతో సాగుతూ, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకే సభలో ఆయన స్పీచ్ ఎప్పటికప్పడు హైలెట్ అవుతుంటుంది. ఆ వాగ్దాటితోనే తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో అటు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ఇటు శాసనమండలిలో వైసీపీ సభ్యులకు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆయన 'ఊపేశారు" అని పార్టీల కతీతంగా నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్ని టార్గెట్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. వైసీపీ సభ్యుల తరహాలో అసభ్యతకు తావివ్వకుండా ఆయన వేసిన సెటైర్లు హైలెట్ అవుతున్నాయి. మాజీ సీఎం జగన్ని పులివెందుల ఎమ్మెల్యే అంటూ.. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లాల వారీ సమీక్షల్లో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. పులివెందుల సమస్యలను గత పాలకులు గాలికి వదిలేస్తే.. కూటమి ప్రభుత్వం పరిష్కారానికి ప్రయత్నిస్తోందని చెప్పారు.
ఆ క్రమంలో రాష్ట్రానికి వైసీపీ హానికరమనే వార్నింగ్ ఇస్తూ.. ‘వైసీపీ నెవర్ ఎగైన్.. కూటమి వన్స్ ఎగైన్ ’ అని పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లకు నినాదంగా మారుతున్నాయి.ఇక శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నా, మంత్రి నారా లోకేష్తో కలిసి కేశవ్ వారి నోళ్లు మూయించిన తీరుపై కూటమి శ్రేణులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యానారాయణ వంటి సీనియర్ పయ్యావుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబాటుకు గురయ్యారు. విద్యావంతుడైన పయ్యావుల సభలో సీనియర్ ల పట్ల చూపిన వినయం వారిని మంత్రముగ్ధులను చేశాయి.
జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం స్వయంగా కేశవ్ పై ప్రశంసలు కురిపించారు. పయ్యావుల కేశవ్ లాంటి వారు తోడుంటే చంద్రబాబుకి ఏదైనా సాధ్యమే అని జనసేనాని స్వయంగా అన్నారంటే సభలో కేశవ్ వ్యవహార శైలి ఎలా ఉందో అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఉన్న సీనియర్లకు ప్రయార్టీ ఇస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నిరూపించారు పయ్యావుల. భవిష్యత్ అవసరాలు, యువతకి ప్రాధాన్యత అంటూ పార్టీకి ముందు నుంచి అండగా ఉంటూ, చంద్రబాబు వ్యక్తిగత సైన్యం లాంటి వారికి సముచిత ప్రాధాన్యత ఇస్తేనే పార్టీకి తిరుగుండదని సూచిస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలు.. 'పయ్యావుల నామ సమావేశాలు" గా మిగిలిపోతాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


.webp)



