వార్ ఎఫెక్ట్ – సామాన్యుల ఇళ్లల్లో సంక్షోభం
posted on: Mar 13, 2026 4:15PM

మిడిల్ ఈస్ట్లో రాజుకున్న ఉద్రిక్తత ఇప్పుడు ప్రపంచాన్ని తాకుతోంది. అక్కడి యుద్ధ సెగ అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తోంది. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో బాంబులు పడితే… దాని ప్రభావం మన ఇళ్లలోని వంటగదుల వరకు చేరుతోంది. కిచెన్, కిరాణా బడ్జెట్లు తలకిందులవుతున్నాయి.సంక్షోభం వచ్చినప్పుడే నిత్యవసర వస్తువుల అసలు విలువ తెలుస్తుంది. సమస్యలు తలెత్తినప్పుడే సామాన్యులు పడే ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమవుతుంది. ఈ భూగోళంలో ఎక్కడ ఏమి జరిగినా… చివరకు దాని భారం పడేది సాధారణ ప్రజలపైనే. ఎందుకంటే ఎక్కడైనా సంక్షోభం వస్తే… ముందుగా పెరిగేది నిత్యవసర వస్తువుల ధరలే.
ప్రస్తుతం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అదే పరిస్థితి కనిపిస్తోంది. వంట గ్యాస్ కొరత మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు మళ్లీ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా కట్టెలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఇండక్షన్ స్టవ్లకు ఆర్డర్లు పెరుగుతున్నాయి.కొన్ని చోట్ల హోటల్స్ మూతపడగా… ఇంకొన్ని హోటల్స్ పరిమిత మెనూతోనే నడుస్తున్నాయి. ఎక్కువసేపు ఉడికించాల్సిన వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి హోటల్ టైమింగ్స్ కూడా మార్చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తంగా చూస్తే… పాత రోజులు మళ్లీ వచ్చేశాయేమో అనిపించే పరిస్థితి ఏర్పడింది.
పశ్చిమాసియాలో పేలుతున్న బాంబుల ప్రతిధ్వని… ఇప్పుడు మన వంటగదుల్లో వినిపిస్తోంది. అక్కడ యుద్ధం జరుగుతుంటే… ఇక్కడ మిడిల్ క్లాస్ జీవితం దెబ్బతింటోంది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు… అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్గా మారుతోంది.భారత్ దశాబ్దాలుగా ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థ దెబ్బతింటే… న్యాచురల్ గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. సీఎన్జీ కొరత కూడా కనిపిస్తోంది. దీని ప్రభావం రవాణా రంగంపైనా పడే అవకాశం ఉంది.
ప్రధానంగా హోటల్ పరిశ్రమపై దీని ప్రభావం ఎక్కువగా పడుతోంది. వంట గ్యాస్ ఖర్చులు భరించలేక, కమర్షియల్ సిలిండర్లు దొరకక చాలా చోట్ల హోటల్స్ మూతపడ్డాయి. ఇంకొన్ని హోటల్స్ మెనూను తగ్గించాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఒకప్పుడు ఆధునికత వైపు అడుగులు వేసిన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు మాయమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం, సరఫరాలో ఆలస్యం రావడంతో… ప్రజలు మళ్లీ పాత విధానాలవైపు మళ్లుతున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యిపై వంట చేయడం ఒక ఎంపిక కాదు… అవసరంగా మారుతోంది.
యుద్ధం ప్రభావం భారత్తో పాటు అనేక దేశాలపై పడుతోంది. మనం వినియోగించే ఎల్పీజీ గ్యాస్లో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అందుకే అక్కడి ఉద్రిక్తతలు ఇక్కడి బడ్జెట్లను దెబ్బతీస్తున్నాయి.ఒక్క సిలిండర్ కొరతకే పరిస్థితి ఇలా ఉంటే… యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ ప్రభావం మాత్రమే కనిపిస్తోంది. కానీ తర్వాత పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటివరకు భారత్లో ఇంధన ధరలు కొంతవరకు స్థిరంగా ఉన్నా… పక్కనున్న పాకిస్థాన్లో ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. బంగ్లాదేశ్లో ధరలు పెంచకపోయినా, ప్రభుత్వం పరిమితులు విధించడంతో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి.సరఫరా వ్యవస్థ దెబ్బతింటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటింది. హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా నిలిచిపోతే బ్యారెల్ ధర 150 డాలర్లకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయి.
అలా జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగి… చివరకు సామాన్యుడిపైనే భారం పడుతుంది.భారత్లో వినియోగించే వంట నూనెలలో కూడా పెద్ద భాగం దిగుమతులే. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. యుద్ధ పరిస్థితుల్లో సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడంతో వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇక ఎరువుల సరఫరాపైనా యుద్ధం ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్కు దిగుమతి అయ్యే యూరియా, అమ్మోనియా వంటి ఎరువుల రవాణా కూడా హర్మూజ్ జలసంధి గుండా జరుగుతుంది. అక్కడ సమస్యలు తలెత్తితే ఎరువుల ధరలు పెరిగి… వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఫలితంగా బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.
యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ మాత్రం మన చేతుల్లోనే ఉంది. యుద్ధ కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి అనవసర ఖర్చులను తగ్గించి, అత్యవసర నిధిని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే భయంతో నిత్యవసర వస్తువులను ఎక్కువగా నిల్వ చేయడం కూడా సరైంది కాదు. అలా చేస్తే మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే… యుద్ధం ఎక్కడ జరిగినా… దాని ప్రభావం చివరకు సామాన్యుడి జీవితంపైనే పడుతుందనే వాస్తవాన్ని ఈ పరిస్థితులు మరోసారి గుర్తుచేస్తున్నాయి.


.webp)



