Latest News

లాలూతో తెగదెంపులు? బీహార్‌లో కొత్త సమీకరణాలు.!

posted on: May 9, 2017 11:30AM


 

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాణా కుంభకోణం కేసుల్లో లాలూపై విచారణ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత ధర్మాసనం.... లాలూపై అభియోగాలను కొట్టివేస్తూ జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టింది. దాణా కుంభకోణంలో లాలూ విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది.

 

లాలూ బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 1996లో దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పశుగ్రాసం పేరుతో 900 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ లాలూపై 4 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో దోషిగా తేలడంతో 2013 అక్టోబర్‌లో కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే అదే ఏడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయగా, మిగతా 3 కేసుల్లో లాలూపై దాఖలైన అభియోగాలను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సీబీఐ సవాల్‌ చేయడంతో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. మిగతా మూడు కేసులతోపాటు, క్రిమినల్‌ కేసును కూడా పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది.

 

దాణా స్కామ్‌లో లాలూపై మళ్లీ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో బీహార్‌లో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. అవినీతిపరుడైన లాలూతో తెగదెంపులు చేసుకుని.... బీజేపీ మద్దతు తీసుకోవాలంటూ నితీష్‌ కుమార్‌కి బీహార్‌ బీజేపీ చీఫ్‌ సుశీల్‌కుమార్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు. మొన్న షాబుద్దీన్‌-లాలూ ఆడియో టేప్‌ బయటికి రావడం, ఇప్పుడు దాణా కేసుల్లో విచారణ జరగనుండటంతో బీహార్‌లో రాజకీయంగా అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...