కాంగ్రెస్ కు కేసీఆర్ సరెండర్?
posted on Jun 27, 2022 5:55PM
రాష్ట్రపతి ఎన్నికలు తెరాస నిజ రూపాన్ని బయట పెట్టాయా? ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యారా? అంటే అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్, అదే విధంగా ఇతర మంత్రులు, తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా , జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నిఅంగీకరించేది లేదని, స్వయంగా కేసీఆర్, కేటీఅర్ అనేక సందర్భాలలో సప్ష్టమైన ప్రకటనలు చేసారు. కాంగ్రెస్ పార్టీని పనికిమాలిన పార్టీ, దిక్కుమాలిన నాయకత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేతకాని తనం వల్లనే, దేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగిందని తండ్రీ కొడుకులు తిట్టని రోజు లేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే అంతల కస్సుమనే కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువుగా ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన ఉమ్మడి అభ్యర్ధి, యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు.
కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, మంత్రి కేటీఅర్ తో పాటుగా అరడజను మంది వరకూ పార్టీ ఎంపీలు, సిన్హా నామినేషన్ పత్రాలపై సంతాకాలు చేసారు. నామినేషన్ కార్యక్రమలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో చెట్టపట్టాలేసుకుని కనిపించారు.ఇవన్నీ , చూస్తుంటే, అదే అన్జిపిస్తోందని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆలోచనకు స్వస్తి చెప్పి, కాంగ్రెస్ కు సరెండర్ అయిపోయారని, అంటున్నారు.
నిజానికి కేసీఆర్, ఇంచు మించుగా సంవత్సర కాలంగా, జాతీయ రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్ వేర్పాటు చేసేందుకు, చాలా చాలా ప్రయత్నాలు చేశారు. దేశమంతా తిరిగి, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసి చర్చలు జరిపారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోవడంతో కావచ్చును, కొత్తగా జాతీయ పార్టీ తెర మీదకు తెచ్చారు. ఆ దిశగా, కొంత కసరత్తు కూడా చేశారు. ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెపుతున్నారు.
అయితే అది కూడా ముడిపడే అవకాశం లేదని తేలడంతో ... పక్షం రోజుల క్రితం కాంగ్రెస్ ఉన్న కూటమితో చేతులు కలిపేది లేదని ప్రకటించిన కేసీఆర్, అదే కూటమితో చేతులు కలిపారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమలో కేటీఆర్ పాల్గొన్నారు. దీంతో తెరాస, కాంగ్రెస్ సంబంధాలపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటాల యుద్ధం జరుగుతుంటే.. ఇంకోవైపు ఆ రెండు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కలిసిపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి, చాలా కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెరాస, బీజేపీ అవిభక్త కవలలని ఆరోపిస్తున్నారు .
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను తెరాస సమర్ధించిన విషయాన్నీ గుర్తు చేస్తూ, తెరాస, బీజేపీ షాడో ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మరో వంక బీజేపీ నాయకులు కాంగ్రెస్, తెరాస జోడీ పై అవే ఆరోపణలు చేస్తున్నారు. బయటకు తిట్టుకున్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ నేతలు అరిపిస్తున్నారు. అదే విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. పైగా.. కాంగ్రెస్ నేతలకు ఓట్లేస్తే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉండరని, ఇందుకు సంబంధించి కళ్ళముందున్న అనుభవాల ఆధారంగా ఆలోచించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. గత ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది తెరాసలో చేరారని గుర్తు చేస్తున్నారు.
నిజానికి, రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ఎన్నికల రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీనే, అయినా, ఇంతవరకు కేసేఆర్ ఎప్పడూ కూడా కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రత్యర్ధిగా భావించలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినా, హస్తం పార్టీ ఎమ్మెల్యేలు పిలవకుండానే తెరాసలో చేరతారనే విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీని ఒక ఫ్రెండ్లీ పార్టీగానే చూస్తు వచ్చారు. కానీ, ఇప్పడు, థర్డ్ ఫోర్సుగా బీజేపీ తెర మీదకు రావడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టడంతో, కేసీఆర్వ్యూ హం మార్చుకుంటున్నారని అంటున్నారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తో ప్రత్యక్ష పొత్తుకు కూడా వెనకాడక పోవచ్చని అంటున్నారు.