కుప్పం ఇక చంద్రబాబు పర్యవేక్షణలోనే.. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కాంచర్ల శ్రీనివాస్ కు ఉద్వాసన

posted on: Jun 10, 2026 2:17PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  కుప్పం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగుదేశం  అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గడ్డ , ఆయన రాజకీయ కోట కుప్పం.  2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో  కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డబ్బు, అంగబలంతో కుప్పం స్థానిక సంస్థలను సైతం కైవసం చేసుకుని, టీడీపీకి గట్టి సవాల్ విసిరారు.

చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి కుప్పంలోనే ముగింపు పలుకుతామంటూ.. వై నాట్ 175 నినాదంతో  ఆ సమయంలో కుప్పం కైవసానికి పడరాని పాట్లు పడింది. అయినా ఫలితం లేకపోయింది. కుప్పం నుంచి చంద్రబాబు 2024 ఎన్నికలలో కూడా విజయం సాధించారు. కుప్పం నుంచి చంద్రబాబు ఇప్పటి వరకూ  వరుసగా 8 సార్లు ఘన విజయం సాధించి పట్టు  నిరూపించుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుప్పం రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి రావడం ఇప్పుడు   హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని..  తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న కాంచర్ల శ్రీకాంత్‌కు చంద్రబాబు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన యువ నేతగా శ్రీకాంత్ కుప్పంలో పార్టీని నడిపిస్తారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల  కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ  సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం  ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.   ఈ ముగ్గురు నేతల మధ్య ఏర్పడిన అదృశ్య గోడలు పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెట్టేశాయి. ఎంతో ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకు పార్టీ కార్యాలయంలో కానీ, బహిరంగ సభల్లో కానీ సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదనే ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలోని టీమ్ తో  ఇటీవల  కుప్పం నియోజకవర్గంలో ఒక రహస్య సర్వేను నిర్వహించారు. దాదాపు   15 రోజుల పాటు సాగిన ఈ సర్వేలో..  రాబిన్ శర్మ బృందం గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. స్థానిక నాయకుల పనితీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయిలు, కార్యకర్తల మనోభావాలను నిశితంగా పరిశీలించి  చంద్రబాబుకు సమగ్ర నివేదిక సమర్పించింది. ఆ నివేదిక అందిన తరువాత.. చంద్రబాబు గత ఆదివారం     కుప్పం నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా కీలక ప్రకటన చేశారు. కుప్పం నియోజకవర్గ బాధ్యతలను ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తాననీ, ప్రతి రెండు నెలలకు ఒకసారి కచ్చితంగా కుప్పంలో పర్యటిస్తానని చెప్పారు. అదే సమయంలో, అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే మరో యువకుడిని కుప్పంలో తన పీఏ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నియోజకవర్గ వ్యవహారాల్లో కార్యకర్తలు, నాయకులు ఈ కొత్త పీఏ సూచనలు, సలహాలు పాటించాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  చంద్రబాబు తీసుకున్న ఈ  నిర్ణయం పట్ల  పార్టీ కేడర్‌ హర్షం వ్యక్తం చేస్తున్నది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...