రేవంత్ మౌనం దేనికి సంకేతం?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుకు పెట్టింది పేరు. ఏ విషయంలోనైనా సరే ఆయన మాటలు తూటాల్లా పేలతాయి. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన దిట్ట. ఏదైనా వివాదం ఉత్పన్నమైతే మొట్టమొదట స్పందించేది రేవంత్ రెడ్డే. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టినది కూడా రేవంత్ లోని ఆయన దూకుడే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. అంతకు ముందు పదేళ్ల పాటు, అంటే రాష్ట్ర ఆవిర్భావం నుంచీ కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలింది. అధికారం చేజిక్కించుకుంటున్నద ఆశ ఆ పార్టీ రాష్ట్ర నేతల్లోనూ, హై కమాండ్ లోనూ లేశ మాత్రమైనా కనిపించేది కాదు. అటువంటిది రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేశారు రేవంత్. ఇందుకు ఆయన వాగ్దాటి, విషయంపై ఉన్న స్పష్టమైన అవగాహన, ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పిగొట్టగలిగే సామర్ధ్యమే కారణం. అయితే   మంత్రి కొండా సురేఖ‌ వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి మౌనం పరిశీలకులను సైతం విస్మ య పరుస్తోంది. కొండా సురేఖ సమంత, కొందరు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలియనిదికి కాదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను  విమర్శిస్తున్నానంటూ ఆమె సినిమా హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. అన్ని వైపుల నుంచీ, అన్ని వర్గాల నుంచీ, చివరాఖరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం క్షమాపణలతో సరిపెట్టేసే తప్పు కాదు కొండా సురేఖది అంటున్నారు.  పెద్దగా మీడియా ముందుకు రాని మహేష్ బాబు వంటి వారు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బంధువులపై విమర్శల దాడి జరిగినప్పుడు కూడా కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఘాటైన పదజాలంతో ఖబడ్డార్ అన్నట్లుగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.   ఇలా అన్ని వైపుల నుంచీ కొండా సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం పరువు కూడా మసకబారిందని కాంగ్రెస్ వర్గాలే కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. మంత్రి హోదాలో సురేఖ చచేసిన వ్యాఖ్యల ప్రభావం నిస్సందేహంగా రేవంత్ సర్కార్ పై కూడా పడుతుంది. పడుతుంది ఏమిటి పడింది కూడా.  ఇక్కడే పరిశీలకులు ఇదేదో తుపాను ముందు ప్రశాంతతలా ఉందంటూ కాంగ్రెస్ వర్గాలలో అయితే మంత్రి సురేఖను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. లేదా ఆమెనే  మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే అవకాశాలున్నాయంటున్నారు.  కేసీఆర్ మౌనం సంకేతమిదేనని అంటున్నారు. 
Publish Date: Oct 5, 2024 9:46AM

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలతో పాటు వారంతం కూడా కావడంతో రానున్న రోజులలో భక్తులు తిరుమలకు పోటెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం ( అక్టోబర్ 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో క్యూ కాంప్లెక్స్ దాటి భక్తుల క్యైలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 54 వేల 866 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 657 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60 లక్షల రూపాయలు వచ్చింది. 
Publish Date: Oct 5, 2024 7:20AM

ఎన్‌కౌంటర్... 40 మంది మావోయిస్టులు మృతి!

చత్తీస్‌గఢ్‌ అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్‌, దంతెవాడ సరిహద్దు నెందూర్‌, తులతులి అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసు బలగాలకు ఇంటెలిజెన్స్‌ సమాచారం అందిన నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మొత్తం 12 వందల మంది పోలీసు బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సహజంగానే పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడం, పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపడం.. ఆ కాల్పుల్లో మావోయిస్టులు మాత్రమే మరణించడం.. ఇలాంటి కథనాలు చాలాసార్లు చదివే వుంటారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది.    తమ పార్టీ 20 ఏళ్ల వార్షికోత్సవాలను సెప్టెంబరు 21 నుంచి నెల రోజుల పాటు మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో 20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవరోధాలను చర్చించాలన్నది మావోయిస్టుల అజెండా. ఈ సమావేశాల నేపథ్యంలోనే ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.
Publish Date: Oct 5, 2024 7:00AM

దర్యాప్తు చకచక.. వైసీపీ నేతలు గజగజ!

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌చందంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీయుల గొంతులో క‌ల్తీల‌డ్డూ ప‌డి వారి పరిస్థితి కక్కాలేక మింగా లేక అన్నట్లుగా తయారైంది. ఒక‌ప‌క్క కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ,  వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స్వతంత్ర సిట్ ఎర్పాటు కాగానే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు చకచక సాగుతుందన్న భయంతో వైసీపీయులు గజగజ వణికిపోతున్నారు. కోర్టు తీర్పు త‌రువాత మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా స‌మావేశం చూసిన ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది.    సుప్రీంకోర్టు తీర్పుకే వక్రభాష్యాలు చెప్పుకుని అసలు లడ్డూలో కల్తీనే జరగలేదని జ‌గ‌న్‌ తేల్చేశారు. ఇక ప్రత్యేక సిట్ కూడా అవసరం లేదనేశారు. . సుప్రీం కోర్టు సిట్ కూడా అవసరం లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు.  దీంతో వైసీపీ వర్గాల్లోనే విస్మయం, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తిరుప‌తిలో అనేక అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. అందులో తిరుప‌తి ల‌డ్డూ వివాదం ఒక‌టి. అయితే, తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం చాలా చిన్న‌ద‌ని.. అంత‌కంటే పెద్దెత్తున అవినీతికి వైసీపీ నేత‌లు పాల్ప‌డ్డార‌ని వారాహి స‌భ‌లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ల‌డ్డూ క‌ల్తీ విష‌యంలో అడ్డంగా దొర‌క‌డంతో పాటు,  కొండ‌పై ఐదేళ్లు సాగించిన  అవినీతి అక్ర‌మాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లను వెంటాడుతోంది.  వైసీపీ నేత‌,  టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, పొన్నంవోలు సుధాక‌ర్ రెడ్డి, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి త‌దిత‌రులు తిరుప‌తిలో క‌ల్తీ ల‌డ్డు వివాదం విష‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేశారు,  భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకున్నారు,  రాష్ర ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ కాకుండా,  సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాలి, సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ క‌మిటి విచార‌ణ చేయాల‌ని కోర్టును కోరారు. మొద‌టి రోజు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకొని వైసీపీ నేత‌లు వీరంగం చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయింది. ఆధారం లేకుండా చంద్ర‌బాబు ల‌డ్డూ విష‌యంపై ఎలా మాట్లాడాడ‌ని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింద‌ని, చంద్ర‌బాబు దొరికిపోయారు,  శ్రీ‌వారి భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. మేము స‌త్యహ‌రిశ్చంద్రులం అన్న‌ట్లుగా త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వ్య‌తిరేకించ‌లేక, పూర్తి స్థాయిలో కోర్టు తీర్పును స్వాగ‌తించ‌లేక వైసీపీ నేత‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. అంబ‌టి రాంబాబు వంటి నేత‌లు   సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం.. కానీ, విచార‌ణ బృందంలో చంద్ర‌బాబు నాయుడు మ‌నుషులు ఉండొద్ద‌ని అంటున్నారు. అంటే, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రు విచార‌ణ బృందంలో ఉన్నా వారు చంద్ర‌బాబు మ‌నుషులే అని ముద్ర‌వేయ‌డంతో పాటు,  కేంద్రం తరఫునుంచి అంటే సీబీఐ నుంచి నుంచి విచార‌ణ బృందంలో ఉన్న‌వారిని కూడా చంద్ర‌బాబు మేనేజ్ చేస్తారు అనే త‌ప్పుడు వాద‌న‌ను ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా వైసీపీ నేత‌ల వ్యూహం ఉందన్న విషయం అంబటి మాటలతో తేటతెల్లమైపోయింది. తిరుమల శ్రీవారి లడ్డూ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పును ఓసారి ప‌రిశీలిస్తే.  ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలి. ఇందులో  సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలి.  సరే కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయితే, తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విచార‌ణ‌పై మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు అని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిష‌న్ దారుడు కోరిన‌ట్లు కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. అయితే, వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అయితే, వైసీపీ నేత‌లు మాత్రం ఈ వ్యాఖ్య‌ల‌న్నీ చంద్ర‌బాబును ఉద్దేశించిన‌వి అంటూ సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చంద్ర‌బాబుకు చివాట్లు పెట్టింద‌ని పోస్టులు పెడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ప్ర‌య‌త్నిస్తున్నారు.  తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌నేది వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు వైసీపీ నేత‌ల‌కు కూడా తెలుసు. కానీ, త‌ప్పును ఒప్పుకోకుండా..  తాము త‌ప్పు చేయ‌లేదు, చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల శ్రీ‌వారిని కూడా రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నారు,  భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. సిట్ విచార‌ణ చేసినా.. స్వ‌తంత్ర ద‌ర్యాప్తు బృందం ద్వారా విచార‌ణ చేయించినా త‌ప్పు చేశాం కాబ‌ట్టి త‌మ‌కు వ్య‌తిరేకంగానే ఫ‌లితం వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ముందే ఫిక్స్ అయిపోయారనీ, అందుకే ఈ ఎదురుదాడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు‌. విచార‌ణ‌లో క‌ల్తీ నెయ్యి వాడార‌ని తేలినా.. ఆ విచార‌ణ అంతా త‌ప్పుడు విచార‌ణ అని, చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే విచార‌ణ జ‌రిగింద‌ని చెప్పుకోవడానికి వీలుగా  వైసీపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ప‌దేప‌దే సోష‌ల్ మీడియా, త‌మ‌కు అనుకూల మీడియా ద్వారా మేము త‌ప్పుచేయ‌లేదు.. చంద్రబాబు ప్రోద్బ‌లంతోనే విచార‌ణ బృందం త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చిందంటూ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందే ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ నేత‌లు ఇప్పటి నుంచే మొదలెట్టేశారని అంటున్నారు.  మొత్తానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నా.. విచార‌ణ‌లో తిరుమల లడ్డూ ప్రసాదంలో క‌ల్తీ నెయ్యి క‌లిసింద‌ని తేలినా.. విచార‌ణ రిపోర్టు మొత్తం చంద్ర‌బాబు మాయ అంటూ ఎదురుదాడికి జగన్  ఇప్పటి నుంచే సిద్ధ‌మ‌వుతుండ‌టం ఆయనలోని భయాన్ని, తప్పు చేశామన్న అంగీకారాన్ని తెలియచెప్పుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Oct 5, 2024 6:55AM

రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి

సినీనటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. గాయత్రి శుక్రవారం నాడు కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధివిలాసం ఏమిటంటే, దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు దేశమంతటా అమ్మవారికి ‘గాయత్రి’ అలంకారం చేశారు. ఆరోజే రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి కన్నుమూశారు.
Publish Date: Oct 5, 2024 6:39AM