జగన్ కు రకుల్ కు మధ్య తేడా చెప్పిన జేసీ....

 

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా సరే ముక్కసూటిగా మాట్లాడటంలో ఆయన దిట్ట. ప్రతిపక్షపార్టీ పైనే కాదు.. సొంత పార్టీపైనా ఎలాంటి మొహమాటం లేకుండా... కామెంట్లు విసురుతాడు. ఇక జగన్ పై విమర్శలు చేయమంటే ఇంకా ఎనర్జీ వస్తుంది జేసీ దివాకర్ రెడ్డికి. అందుకే ఆయన కనబడితే చాలు మీడియాకు పండగే. ఇప్పటికే ఎన్నోసార్లు జగన్ పై కామెంట్లు విసిరిన జగన్.. ఈసారి ఏకంగా జగన్ ను ఓ స్టార్ హీరోయిన్ తో పోల్చి కామెంట్లు విసిరారు. దీంతో ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ జగన్ కు... రకుల్ కు లింక్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఏంటంటారా..  జగన్ ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా... ఇక దీనిపై స్పందించిన జేసీ ఒకప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సభలకు జనాలు వస్తున్నారు. రోజా పెట్టినా వస్తారని.. ఆఖరికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన జనాలు ఎగబడతారని అన్నారు. రాజకీయాలు ఇకపై తనకు అనవసరమని, 2019లో రిటైర్ అవుతానని చెప్పారు. జగన్ కూడా రాజకీయాలు వదిలేసి, మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని సూచించారు. ప్రజా సమస్యలను మీడియా ఇప్పటికే ఎత్తిచూపుతోందని, జగన్ కొత్తగా చేసేదేముందని అన్నారు.

 

అంతేకాదు.. జగన్ కారణంగా రెడ్లకు విలువే లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. రెడ్డి కులస్తులంతా జగన్ వెంటే వెళ్తుండటంతో... ఇతర కులాలకు చెందినవారు రెడ్లను గౌరవించడం మానేశారని వ్యాఖ్యానించారు. రెడ్ల తోకలను కరణం బలరాం లాంటి వాళ్లు కోసేశారని ఎద్దేవా చేశారు. వైయస్ గురించి చెప్పుకునే రోజులు పోయాయని జేసీ స్పష్టం చేశారు. మొత్తానికి జేసీ వ్యాఖ్యల్లోని అర్ధం ఏంటో జగన్ కు అర్ధమైందో లేదో...