అమ్మను అవమానించినట్టేనా...
posted on: Feb 26, 2018 12:34PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వతేది 2016 న మరణించిన సంగతి తెలిసిందే కదా. ఇక అప్పటినుండి తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి. సంవత్సరంపాటు ప్రభుత్వమే ఏర్పాటు కాలేదంటే... జయలలిత స్థానం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు జయలలిత మరణానంతరం... ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జయలలిత నిచ్చెలి అయిన శశికళపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక జయలలిత చనిపోయిన తరువాత ఆమె స్థానంలో సీఎం పదవి చేపట్టాలనుకున్న శశికళకు పన్నీర్ సెల్వం చివరి క్షణంలో ఝలక్ ఇవ్వడం... ఆ తరువాత అక్రమాస్తుల కేసులో ఆమెకు జైలుశిక్ష పడటం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
అదేంటంటే...చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జయలలిత విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విగ్రహం కూడా వార్తల్లో నిలిచింది. విచిత్రం ఏంటంటే... అసలు సంగతేంటంటే విగ్రహంలో జయ రూపురేఖలు లేవని అసలు గొడవ. ఆ విగ్రహంలో జయ రూపురేఖలు లేవని... శశికళ, సీఎం పళనిస్వామి భార్య, అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు వలర్మతిల రూపురేఖలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ మాట్లాడుతూ, విగ్రహంలో లోపాలు ఉన్నమాట వాస్తవమేనని... వీలైనంత త్వరగా విగ్రహంలో మార్పులు చేయిస్తామని తెలిపారు. మొత్తానికి జయలలిత చనిపోయిన తరువాత ఇన్ని రోజులకు విగ్రహం పెట్టారు. మరి ఇన్ని రోజుల తరువాత పెట్టిన విగ్రహంలో కూడా లోపాలు. నిజానికి తమిళనాడులో జయలలితను తమ అమ్మలాగే కొలుస్తారు. ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ కూడా చేయలేరు. అలాంటి.. జయలిలత విగ్రహాన్ని ఇంత నిర్లక్ష్యంతో లోపాలతో తయారుచేయడం అంటే ఆమెను అవమానించినట్టే...







