జగన్ సర్కార్ అప్పులు ఏ రేంజ్ లో ఉన్నాయో! ఏ బ్యాంక్ ను వదల్లే.. 

ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో .. గండం నుంచి గట్టెక్కడానికి ఎక్కడ దొరికితే అక్కడ రుణం తీసుకుంటొంది జగన్ సర్కార్. బ్యాంకులతో పాటు కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకుంది. గత రెండేండ్లలో  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లుగా కేంద్రం లెక్క తేల్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఏ ఏ బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నది కూడా వివరించారు. 

కేంద్రమంత్రి చెప్పిన వివరాల ప్రకారం పది జాతీయ బ్యాంకుల నుంచి జగవ్ ప్రభుత్వం రుణాలు తీసుకుంది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019 నుంచి 2021 నవంబరు మధ్య తీసుకుంది.ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయి. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రంస్పష్టం చేసింది. అత్యధికంగా ఎస్‌బీఐ నుంచి రూ.11,937 కోట్లు రుణాన్ని 9 సంస్థలు పొందాయి. బీవోబీ నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్ల అప్పు తీసుకున్నాయి.

అమిత్ షాను వైసీపీ ఎంపీలు ఎందుకు కలిశారో?

బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు సంస్థలకు రూ.7 వేల కోట్ల రుణం లభించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2970 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ. 1,750కోట్ల రుణం తీసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. ఏపీలో ఎక్కడా పెద్దగా కనిపించని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లు ఖాతా పెట్టారు. 

జగన్ ప్రభుత్వం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారని వాటిని బడ్దెట్ పద్దుల్లో చూపించడం లేదన్న విమర్శలు విపక్షాల నుంచి వచ్చాయి. ఇంకా పెద్ద ఎత్తున రహస్యంగా ఉంచిన అప్పుల వివరాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒక్క స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతోనే పాతిక వేల కోట్లు తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. బ్యాంకులు కూడా కొన్ని వివరాలు రహస్యంగా ఉంచుతున్నాయని త్వరలో అన్నీ బయటకు రాక తప్పదంటున్నారు.