Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘మూడు’ను పట్టుకు వేళాడుతున్న జగన్ రెడ్డి!
posted on: Apr 2, 2026 2:44PM

వైసీసీ అధినేత జగన్ రెడ్డి ‘మూడు’ పంతం పట్టారా? అంటే అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారమే కాదు, కనీసం విపక్ష నేత గుర్తింపు కూడా లేకుండా పోయినప్పుడూ కడా ఆయన మూడ్ మూడు మీదే ఉంది. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టినప్పుడు గతంలో తాను అమరావతికి అసెంబ్లీ వేదికగా సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి మరీ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు. సరే ఆ ఆటలో ఎంత ఘోరంగా పరాజయం పాలయ్యారో 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తేల్చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తున్న వేళ ఆయన మరో ‘మూడు’ తో ముందుకు వచ్చారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు. అది పక్కన పెడితే అప్పట్లో మూడు రాజధానుల బిల్లును జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం సమర్థవంతంగా అడ్డుకుంది.
దాంతో మూడు రాజధానులకు చట్టబద్ధత విషయాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టం కనుక మూడు రాజధానులు అనే మూడుముక్కలాటతోనే ఐదేళ్లూ గడిపేశారు. 2024లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన చందంగా వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన్ని స్థానాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రాజధాని అమరావతిని పట్టాలెక్కించింది. ఓ వైపు పనుల వేగాన్ని పెంచుతూనే.. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగుల వేగం పెంచింది. అమరావతిని ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం దానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని సాధించింది.
అయితే ఊరంతటిదీ ఒకదారి.. ఉలిపికట్టెదొక దారి అన్న చంద్రంగా పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న సమయయంలోనే జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరో సారి మూడు రాజధానుల మాట ఎత్తారు. అయితే ఈ సారి అమరావతి, కర్నూలు, విశాఖ అని కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా ఏర్పడాలన్నారు.
జగన్ ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ‘మూడు’ను పట్టుకు వేళాడుతున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి అంటే.. దానికి ఆనుకుని ఉన్న మచిలీపట్నం,గుంటూరు, విజయవాడలు వాటంతటవే ఆటోమేటిగ్గా అభివృద్ధి చెందుతాయనడంలో ఇసుమంతైనా అనుమానాలకు ఆస్కారమేలేదు. అయితే జగన్ మాత్రం మూడు మూడంటూనే మచిలీపట్నం, విజయవాడ,గుంటూరుల అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు.






