ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఫైనల్స్ కు చేరింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో  నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో73 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు.  ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 పరుగులు, అలెక్స్ కేరీ 61 పరుగులు చేశారు. దీంతో 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 48.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్స్ కు చేరుకుంది.   ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (29) శుభమన్ గిల్ (8) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమ్ ఇండియాను కింగ్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు గాడిలో పెట్టారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపులేమీ లేకపోయినా గ్యాప్స్ లోకి బంతిని ఆడుతూ సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును కదిలించాడు. కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఈ స్కోరులో కేవలం 5 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. కోహ్లీ 50 సింగిల్స్ తీశాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడారు. హార్డిక్ పాండ్యా మూడు సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. రాహుల్ 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.   బుధవారం లాహోర్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ లో గెలిచిన జట్టుతో టీమ్ ఇండియా ఆదివారం జరిగే ఫైనల్ లో తలపడుతుంది. చాంపియన్స్ ట్రోపీలో ఫైనల్స్ కు చేరడం ఇది ఐదో సారి. గతంలో 2000, 2002, 2013, 2017లలో కూడా భారత్ సెమీస్ కు చేరింది. 
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ Publish Date: Mar 4, 2025 9:51PM

కర్నూల్ త్రీ టౌన్ పోలీసుల అదుపులో పోసాని 

గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణ మరళిపై మరో కేసు నమోదైంది. నరసారావ్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో  పోసాని  ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు.   పిటి వారెంట్ క్రింద కర్నూలు జిల్లా  ఆదోని త్రీ టౌన్  పోలీసులు  పోసానిని అరెస్ట్ చేశారు. 17 పోలీస్ స్టేషన్ లలో ఆయనపై వివిధ  కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  కూటమినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన  కారణంగా ఓబులావారి పల్లి పోలీసులు  పోసానిని గత నెల హైద్రాబాద్ లో అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. అక్కడ్నుంచి నరసారావుపేట  పోలీసులు  పోసానిపై కేసు నమోదు చేసి  గుంటూరు జైలుకు తరలించారు. . .  తాజాగా   కర్నూలు జిల్లా ఆదోని పట్టటణంలోని  ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసానిపై  మరో కేసు నమోదైంది. పోసానిని గుంటూరు నుంచి కర్నూలు తరలించారు. 
కర్నూల్ త్రీ టౌన్ పోలీసుల అదుపులో పోసాని  Publish Date: Mar 4, 2025 4:10PM

పెంపుడు కుక్క కోసం అంబులెన్స్ బుక్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు!

ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించబడన సేవల దుర్వినియోగం ఏ విధంగా చూసినా నేరమే. అపరాధమే. అందులోనూ అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లపై సైరెన్ తో పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్ ను తమ స్వార్థం కోసం ఇష్టారీతిగా ఉపయోగించుకుంటున్న సంఘటనలను ఎవరైనా సరే ఖండించాల్సిందే.  అంబులెన్స్ టోయ్ టోయ్ టోయ్ అంటూ రోడ్ల మీద పరుగులు తీస్తుంటే.. వాహనదారులు తన వాహనాలను పక్కకు తీసి మరీ దారి ఇస్తుంటారు. సిగ్నల్స్ దగ్గర కూడా అంబులెన్స్ కోసం వాహనాలు గ్రీన్ సిగ్నల్ పడినా కదలకుండా ఆగిపోతాయి. అలాంటి అంబులెన్స్ లను తమ జల్సాల కోసం, సరదాల కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఖాళీ అంబులెన్స్ ను సైరెన్తో స్పీడ్ గా నడిపి సిగ్నల్ క్రాస్ చేసి తాపీగా చాయ్ తాగే అంబులెన్స్ డ్రైవర్లను చూశాం. సర్వీస్ ఆటోలా రోడ్డు పక్కన ఆపి.. ప్యాసింజర్లను ఎక్కించుకుని సైరెన్ వేసుకుని సర్వీస్ చేసి డబ్బులు దండుకున్న సంఘటనలూ తెలుసు.   ఓ వ్యక్తి తన కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి ఏకంగా అంబులెన్స్ ను బుక్ చేసుకుని సైరెన్ తో రోడ్ల మీద జనాలకు అదరట్టిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది.  అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేయడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లడంతో పోలీసులు ఇటువంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ డ్రైవ్ లో భాగంగా మంగళవారం నాడు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో సైరన్ తో వేగంగా వెడుతున్న అంబులెన్స్ ను ఆపి చెక్ చేశారు. ఆ తనిఖీలో దిగ్భ్రాంతి గొలిపేలా అంబులెన్స్ లో ఓ కుక్కను తరలిస్తుండటం బయటపడింది. ఆ కుక్కను ఎక్కడికి తీసుకెడుతున్నారన్నది ఆరా తీస్తే.. ఆ కుక్కకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు మదీనగూడలోని ఐవీ హాస్పిటల్ కు తీసుకువెడుతున్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ అంబెలెన్స్ ను సీజ్ చేసి, అంబులెన్స్ ఓనర్ పై కేసు నమోదు చేశారు.  అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని మాత్రమే అంబులెన్స్‌లో సైరన్‌ వేసుకుని తరలించాల్సి ఉంటుందని, ఖాళీగా వెళ్లే సమయంలో కూడా కొంతమంది సైరన్లు వేసుకుని వెళ్తుండడం చట్ట విరుద్దమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అలాగే పెంపుడు జంతువులను తరలించేందుకు అంబులెన్స్ లు వాడటం కూడా చట్టరీత్యానేరమని చెప్పారు. మొత్తం మీద పెంపుడు కుక్కను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  
పెంపుడు కుక్క కోసం అంబులెన్స్ బుక్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు! Publish Date: Mar 4, 2025 3:50PM

ఈ సారి అయినా అద్దంకికి దక్కేనా ?

తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల క్రతువు ఇంకా పూర్తి కాలేదు. రెండు ఉపాధ్యాయ,ఒక పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని(కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,మెదక్)  బీజేపీ కైవసం చేసుకుంది. కమలం పార్టీ బలపరిచిన మల్క కొమురయ్య విజయకేతనం ఎగరేసారు. రెండో స్థానం (నల్గొండ, వరంగల్, ఖమ్మం,) స్థానాన్ని పీఆర్టీయు అభ్యర్ధి శ్రీపాల్ రెడ్డి గెలుచు కున్నారు. పట్టభద్రుల స్థానం ఫలితం ఇంకా  తేలలేదు.  కానీ, ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం, మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. ఈ ఐదు స్థానాలు భ‌ర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం మర్చి 3 నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం అయితే, నాలుగు స్థానాలు కాంగ్రెస్, ఒక స్థానంలో బీఆర్ఎస్’ (ఏకగ్రీవంగా) గెలిచే అవకాశం వుంది. అయితే, చివరకు  ఏమిజరుగుతుతుంది అనేది, ఎవరి వ్యూహం ఏమిటో తెలిసే వరకు  చెప్పలేము.  అలాగే  అభ్యర్ధులు ఎవరన్న విషయంలోనూ, ఉహాగానాలే కానీ, క్లారిటీ లేదు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు కొదవలేదు. ఇంచుమించుగా డజను మందికి పైగానే పోటీ పడుతున్నారు. అయితే, మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా, ప్రతిసారీ  ‘సారీ’ తోనే సరిపెట్టుకుంటున్న అద్దంకి దయాకర్ కు ఈసారయినా అవకాశం దక్కుతుందా? చట్ట సభలో కాలు పెట్టాలనే ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందా? అన్న భేతాళ ప్రశ్న ఇప్పడు రాజకీయ వర్గాల్లో సమాధానం చిక్కని ప్రశ్నగా చక్కర్లు కొడుతోంది.   నిజానికి, తెలంగాణ రాజకీయాల్లో పరచయం అవసరం లేని కొద్దిమంది నాయకుల్లో,అద్దంకి దయాకర్ ఒకరు. ఏ టీవీ ఆన్ చేసినా, ఏ యూట్యూబ్ చూసినా,  హాయ్ ..అంటూ పలకరించే పోలిటిషియన్  అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఏ మూలాన  ఉన్నా, కొండకచో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నా, మీడియాకు అందుబాటులో ఉండే కొద్ది మంది సీనియర్  రాజకీయ నాయకుల్లో దయాకర్  ఒకరు. అలాగే, విషయం ఏదైనా, విషయ పరిజ్ఞానంతో  స్పందించగలిగిన  కాంగ్రెస్ నాయకుల్లో అద్దంకి దయాకర్  ముందు వరసలో ఉంటారు.    అలాగే, అద్దంకి దయాకర్ ను కండువా అవసరం లేని కాంగ్రెస్ నాయకుడుగా పేర్కొంటారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు గాంధీలతో మంచి సాన్నిహిత్యం ఉన్న నేతల్లోనూ దయాకర్ ముందు వరసలోనే ఉంటారు. మాలమహానాడు, తెలంగాణ జెఏసీ ఉద్యమాల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన దయాకర్, కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసిన  కొద్ది మంది ఉద్యమ నాయకుల్లో ఒకరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే క్రమంలో, ఆ తర్వాత  అద్దంకి దయాకర్  మీడియాలో ఓ వెలుగు వెలిగారు. రేవంత్ రెడ్డి  కోటరీలో కీలక నేతగా నిలిచారు.  ఒకటి రెండు సందర్భాలలో, రేవంత్ రెడ్డి కోసం, ‘ఉంటే ఉండు లేదంటే ...’ వంటి  వివాదస్పద వాఖ్యలు చేసి, సమస్యల్లో చిక్కుకున్నా  రేవంత్ రెడ్డి చేయి వదలలేదు. రేవంత్ రెడ్డికి మాటల కవచంగా నిలిచారు. నీడల ఆయన వెంట నడిచారు. అంతే కాదు, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ, గాంధీ  కుటుంబంతో ముఖ్యంగా రాహుల్ గాంధీతో సన్నిహిత సంబందాలున్నాయి. అలాగే, ఒకటి రెండు సందర్భాలలో దయాకర్ వలన తనకు  సమస్యలు వచ్చినా  రేవంత్ రెడ్డి కూడా ఆయన చేయి వదల లేదు. అయితే, అదేమిటో కానీ, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో  శని అన్నట్లు, చట్టసభలో కలుపెట్టాలనే ఆయన కోరిక మాత్రం, ఇంత వరకు తీరలేదు. ఒకటికి, రెండుసార్లు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మూడవసారి, 2024లో పార్టీ టికెట్ నోటిదాకా వచ్చి, చే ... జారిపోయింది.  అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, వడ్డించే వాడు మన వాడు అయినప్పుడు, ఏ పంక్తిలో కూర్చుంటే ఏమిటి అన్నట్లు, ఎమ్మెల్ల్యే కాకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు తగిన పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అయితే, దయాకర్ ఒకటి నేను ఒకటీనా,  (ఇద్దరం ఒకటే అని భావం) ఆయనకు మంచి పదవి  ఇస్తానని  బహిరంగంగానే ప్రకటించారు. అయితే అదేమిటో కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 14 నెలలు పూర్తయినా, ఇంతవరకు దయాకర్  కు ఏ పదవీ దక్క లేదు. అంతే కాదు,  వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు, ఎమ్మెల్సీ, రాజ్యసభ టికెట్ సహా’ అనేక అవకాశాలు అందినట్లే అంది చేజారి పోయాయి.   ఈ నేపధ్యంలోనే, ఈ సారి అయినా అద్దంకి దయాకర్ ఆశ నెరవేరుతుందా? చట్ట సభలో కాలు పెట్టాలన్న ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందా? అనేది, ఆసక్తికరంగా మారింది. అయితే, ఎప్పటిలానే ఇప్పడు కూడా, అద్దంకికి ఈ సారి టికెట్ పక్కా అనే ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతోంది. ఈ సారి కాకుంటే ఇక ఎప్పటికీ ‘సారీ’నే అనే మాట కూడా కాంగెస్ వర్గాల్లో వినవస్తోంది.   మరో వంక దయాకర్  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కాకుండా, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు, జానా రెడ్డి, కోమటి రెడ్డి ఇతర నాయకులను వ్యక్తిగతంగా కలిసి .. ప్లీజ్ .. ఈ ఒక్క సారికీ అడ్డురావద్దని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే , అంతిమంగా ఏమి జరుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి, ఇంకా భేతాళ ప్రశ్నగానే వుంది. ఊహకు అందడం లేదు. అందుకే, ఆయన సన్నిహితులు సైతం టికెట్ వచ్చి నామినేషన్ వేసే వరకు సస్పెన్సు కొనసాగుతుందని,భేతాళ ప్రశ్నకు సమాధానం చిక్కదని అంటున్నారు.
ఈ సారి అయినా అద్దంకికి దక్కేనా ? Publish Date: Mar 4, 2025 3:28PM

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీపై పేటెంట్ ఎవరిది?

  ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. రిజల్ట్స్‌లో ట్విస్ట్ ఏటంటే టీడీపీ, జనసేనలు మద్దతిచ్చిన అభ్యర్ధి ఓటమి పాలైతే.. బీజేపీ అనుబంధ ఉపాధ్య సంఘం మద్దతిచ్చిన కేండెట్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతిస్తానన్నా ఎవరూ తీసుకోలేదు. అయినా సీన్‌లోకి వచ్చిన వైసీపీ నేతలు విజేతను తమ అభ్యర్ధిగా క్లెయిమ్ చేసుకుంటున్నారు.. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు తమ అభ్యర్ధే గెలిచారని చెపుతుండటం ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెల్లడైంది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో ఫలితం తేలకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్లతో పీఆర్టీయూ అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. అక్కడ  కూట‌మి తర‌ఫున  ర‌ఘువ‌ర్మకు మ‌ద్దతు ఇస్తున్నట్టు ప‌దిహేను రోజుల ముందుగానే సీఎం చంద్రబాబు ప్రక‌ట‌న చేశారు. ఏ ఎన్నికకు సంబంధించి ప్రత్యేకంగా జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కుల‌తో కూడిన ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వంటివారు కూడా క్షేత్ర స్థాయిలో ప‌ర్యటించారు. కానీ, జ‌నసేన నుంచి ఒక‌రు కూడా ఈ ప్రచారంలో పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో కూట‌మి తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా.. బీజేపీ అడుగులు వేసింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి అస‌లు ఉత్తరాంధ్ర టీచ‌ర్ ఎమ్మెల్సీ పోరును ప‌ట్టించుకో లేదు. పైగా.. స్థానిక నేత‌లు యాంటీ లైన్ తీసుకున్నార‌ని.. ర‌ఘువ‌ర్మకు ప్రత్యర్థిగా ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ నేత లు మ‌ద్దతు ప్రక‌టించార‌ని తెలిసి కూడా.. పురందేశ్వరి మౌనం పాటించారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కూట‌మిలో కేవ‌లం టీడీపీ నాయ‌కులు మాత్రమే ర‌ఘువ‌ర్మకు మ‌ద్దతు ప్రక‌టించ‌గా, జ‌న‌సేన ప‌ట్టించుకోక‌పోవ‌డం, పై నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో నాయ‌కులు గాదెకు మ‌ద్దతు ప్రక‌టించ‌డం వంటివి.. కూట‌మిలో లోపాల‌ను  ఫోకస్ చేశాయి. ఇక‌ క్షేత్రస్థాయి క‌మ‌ల నాథులు కూడా.. గాదెకు మ‌ద్దతుగా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లే చేశారు. ఈ ప‌రిణామాలు కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసిన ర‌ఘువ‌ర్మకు శాపంగా మారాయి. అయితే కేంద్ర, రాష్ట్ర మంత్రులు త‌న‌ వెంటే ఉన్నార‌ని.. ప్రభుత్వం ఉపాధ్యాయుల‌కు మేలు చేస్తోంద‌ని ఆయ‌న చెప్పిన‌ప్పటికీ ఫ‌లితం క‌నిపించ‌లేదు.  ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ఫ‌లితం త‌ర్వాత‌,  కూట‌మి నాయ‌కులు మిత్రధర్మంపై చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతు న్నది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వైసీపీ మ‌ద్దతు ఇస్తామ‌న్నా.. గాదె శ్రీనివాసులు తిర‌స్కరించారు. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు నేనే అడుగుతా! అంటూ.. ఆయ‌న తిర‌స్కరించ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ వైసీపీ మ‌ద్దతు క‌నుక తీసుకుని ఉంటే తమ కొంప మునిగేదని గాదె వ‌ర్గీయులు అంటుండటం గమనార్హం. వారు అంత స్పష్టంగా చెపుతున్నా వైసీపీ నేతలు విజేతను తమ అభ్యర్ధిగా ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ అనుబంధ సంస్థ మద్దతుతో గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు కూటమి అభ్యర్ధే అని టీడీపీ నేతలు అంటుండటం విశేషం.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీపై పేటెంట్ ఎవరిది? Publish Date: Mar 4, 2025 3:25PM

పిఠాపురంలో వైసీపీ ఖాళీ?

పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది ఇప్పటి నుంచే కాదు.. గత ఏడాది ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ ఖరారైనప్పటి నుంచే ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందది. సరే ఆ ఎన్నికలలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడే ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం గురించి ఏ వార్త అయినా రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అటువంటి నియోజకవర్గంలో వైసీపీ క్రమంగా ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే పలువురు ఆ పార్టీని వీడి జనసేన గూటికి చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.  పెండెం దొరబాటు 2014 నుంచీ వైసీపీతోనే నడిచారు. 2019 ఎన్నికలలో ఆయన పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో జగన్ పెండెం దొరబాబుకు టికెట్ నిరాకరించారు. వంగా గీతకు ఇక్కడ టికెట్ ఇచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను వంగా గీత అయితేనే దీటుగా ఎదుర్కోగలరని జగన్ భావించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పెండెం దొరబాబు వైసీపీ మార్కు బుజ్జగింపుల కారణంగా పార్టీలోనే కొనసాగారు. అయితే 2024 ఎన్నికలలో వంగా గీతపై పవన్ కల్యాణ్ 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  సరే అది పక్కన పెడితే జగన్ పెండెం దొరబాబు గత ఎన్నికలలో తనను పక్కన పెట్టిన దానికి ఇప్పుడు అదును చూసి దెబ్బ కొట్టారు. వైసీపీని వీడి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ గూటికి చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన గూటికి చేరడంతో పిఠాపురంలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయినట్లే. వంగా గీత ఉన్నప్పటికీ ఆమెకు పార్టీ క్యాడర్ లో పెద్దగా పలుకుబడి లేదు. ఆమెకు నియోజకవర్గంలో కార్యకర్తల మద్దతు కూడా పెద్దగా లేదు. పెండెం దొరబాబు చేరికతో పిఠాపురంలో జనసేన బలో పేతం కావడమే కాదు.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ పరిస్థితి మరింత దిగజారింది.  
పిఠాపురంలో వైసీపీ ఖాళీ? Publish Date: Mar 4, 2025 2:41PM