అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టి ఐపీఎల్ పై

posted on: Mar 28, 2026 2:13PM

భారతదేశంలో క్రికెట్  ఒక మతం. దేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. భారీ వ్యాపార సామ్రాజ్యం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిన తరువాత క్రికెట్ రూపు రేకలు పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ఏటికేడు కోట్లాది రూపాయలు పెరుగుతూ వస్తుంది. తాజాగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్ల కొనుగోలుకు జరిగిన భారీ డీల్స్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలపై ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్  స్పందించారు.  వచ్చే పదేళ్లలో పదేళ్లలో ఐపీఎల్ జట్ల విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతుందన్నారు. ఆ జట్ల విలువ పెరుగుదల ఊహకు కూడా అందనంత భారీగా ఉంటుందని చెప్పారు. 

ఇటీవలి డీల్స్ మేరకు , ఆర్సీబీ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సార్టియం  దాదాపు  16,700 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇక  రాజస్థాన్ రాయల్స్ జట్టును అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియం  15,300 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.  ఈ భారీ ధరలు చూస్తుంటే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ స్థాయి, స్టామినా ఏంటో ఇట్టే అవగతమౌతుంది.

ఈ నేపథ్యంలోనే పార్థ్ జిందాల్ .. తాను 2019లో ఐపీఎల్‌లోకి ప్రవేశించినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతం వాటా కోసం తన తండ్రిని రూ.550 కోట్లు పెట్టమని ఒప్పించాల్సివచ్చిందన్నారు. అప్పడు ఢిల్లీ క్యాపిటల్స్ లో వాటా దారుగా ఉండాలన్న తన నిర్ణయం ఇప్పుడు అత్యంత ఉత్తమం, విలువ అయిన నిర్ణయంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.  ఐపీఎల్ మీడియా హక్కులు రూ.50 వేల కోట్లు దాటినప్పుడే ఈ లీగ్ కొత్త చరిత్రకు నాంది పలికిందన్న పార్ధ్ జిందాల్  ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, వచ్చే దశాబ్ద కాలంలో ఒక్కో ఐపీఎల్ జట్టు విలువ  నాలుగైదు బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నారు.  అంటే భారత కరెన్సీలో ఒక్కో జట్టు విలువ  37 వేల కోట్ల నుంచి  47 వేల కోట్ల రూపాయలకు చేరు అవకాశం ఉందని పార్థ్ జిందాల్ అంచనా వేశారు.

  ఐపీఎల్ అశేష క్రీడాభిమానులను అలరిస్తోందనీ, ఈ ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోందనీ, అందుకు ఈ లీగ్ సాధిస్తున్న వ్యూయర్ షిప్పే నిదర్శనమని చెప్పుకొచ్చారు.  ఏ   బ్రాండ్ అయినా భారత మార్కెట్లో రాణించాలంటే ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్ అనివార్యంగా మారిందనిన్న పార్థ్ జిందాల్  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా మారిన ఐపీఎల్ పట్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్లు కూడా ఆసక్తి చూపుతున్నారనీ, ఐపీఎల్ జట్లను సొంతం చేసుకోవడానికి తహతహలాడుతున్నారనీ పేర్కొన్నారు.  మున్ముందు ఐపీఎల్   ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే క్రీడా వ్యాపారంగా అవతరిస్తుందని ఆయన అంచనా వేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...