చంద్రబాబు వర్సెస్ లోకేష్!.. స్ఫూర్తిదాయ పోటీ!

posted on: May 2, 2026 11:18AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక అరుదైన, ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన పోటీ నెలకొంది.  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు,  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మధ్య జరుగుతున్న ఈ పోటీ  రాష్ట్ర ప్రగతి,  బాధ్యతల నిర్వహణ  ఒకరిని మించి మరొకరు అన్న చందంగా సాగుతోంది. ఇరువురిలోనూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా క్షేమం, సంక్షేమం కోసం పని చేయాలన్న పట్టుదల అంకిత భావం కనిపిస్తోంది.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు   రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో నిర్వహించిన  పేదల సేవ  సభలో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అధికారులతో ముఖాముఖి నిర్వహించారు. సాధారణంగా సభల్లో రాజకీయ ప్రసంగాలు ఉంటాయి, కానీ చంద్రబాబు మాత్రం అధికారులను వేదికపైనే పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరినీ కించపరచకుండానే, బాధ్యతను గుర్తు చేస్తూ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో ప్రజల ముందే వివరణ కోరారు. ప్రభుత్వ యంత్రాంగం కేవలం ఆదేశాలను పాటించడమే కాకుండా..  ఫలితాలను సాధించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా అధికారుల పనితీరుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు తానతందాన అనే వాళ్లు అవసరం లేదనీ, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే వారే కావాలని కుండబద్దలు కొట్టేశారు.   మరోవైపు నారా లోకేశ్ కూడా తన బాధ్యతల్లో ఏమాత్రం తగ్గడం లేదు. గత ప్రభుత్వం హయాంలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థను సంస్కరించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో సాధించిన ప్రగతి దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

తండ్రి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక అంశాలపై దృష్టి పెడితే, లోకేశ్ ఐటి రంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు గూగుల్-ఏఐ వంటి సంస్థలతో కలిసి పనిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకరిది విజన్ అయితే, మరొకరిది ఎగ్జిక్యూషన్ అన్నట్లుగా వీరిద్దరి మధ్యా సమన్వయంతో కూడిన పోటీ తీవ్రంగా సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ గ్రౌండ్ రియాలిటీని గమనిస్తూ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేశ్ ఇటీవల టిడిపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా సీనియర్ నేతల పట్ల ఆయన చూపిన వినయం, గౌరవం అందరినీ ఆకట్టుకుంది.  అందరినీ ఆకట్టుకుంది.

పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని  తాతా అని సంబోధిస్తూ ఆయన పాదాలకు నమస్కరించడం ద్వారా.. తాను ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటానని లోకేష్ చాటారని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు.   నాయకత్వం అంటే కేవలం ఆజ్ఞలు జారీ చేయడం మాత్రమే కాదు.. అనుభవాన్ని గౌరవిం చడం బాధ్యతాయుతంగా వ్యవహరించడం అని చంద్రబాబు, లోకేష్ నిరూపిస్తున్నారని అంటున్నారు.  వ్యక్తిగత ప్రతిష్టల కంటే ప్రజా సంక్షేమమే పరమావధిగా వీరి మధ్య సాగుతున్న పోటీ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...