హాథ్రాస్‌‌ ఘటనలో ఊహించని కోణం.. ఆ రైతు పాలిట శాపం

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్‌ లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యువతి మరణానికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించి తమకి న్యాయం చేయాలని బాధిత యువతి కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మూలంగా ఓ రైతు కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది. తన పంట నాశనం అయిందని, రూ.50వేలు నష్ట పరిహారం చెల్లించాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

 

హాథ్రాస్‌లో బాధిత యువతిని పొలాల్లోకి తీసుకెళ్లిన నిందితులు ఓ పంట పొలంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీబీఐ అధికారులు పంట పొలంలో క్రైం సీన్‌ను పరిశీలించారు. ఆ సమయంలో క్రైం సీన్‌ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. క్రైం సీన్‌లో సాక్ష్యాధారాలను సేకరించి భద్రపరిచే వరకూ పొలానికి నీళ్లు పెట్టవద్దని, కోత కోయవద్దని అధికార యంత్రాంగం ఆదేశించింది. సకాలంలో నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో రెండున్నర ఎకరాలలో ఉన్న పంట నాశనం అయిపోయింది. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయిందని రైతు వాపోయాడు. ఐదుగురు కుటుంబ సభ్యులతో కూడిన తన కుటుంబం పొలాన్ని నమ్ముకునే బతుకుతోందని, పెట్టుబడి నిమిత్తం లక్షా అరవై వేలు లోన్ తీసుకున్నానని, ఇప్పుడు తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు డిమాండ్ చేశాడు.