కలానికి రక్షణ కరువు

న్యూస్ పేపర్లో ప్రచురితమైన వార్త ప్రభుత్వాలను కదిలిస్తుంది..టీవీలో కనిపించే దృశ్యం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రేడియోలో వినిపించే ఒక స్వరం ప్రజలను చైతన్యపరుస్తుంది. పాత్రికేయానికి ఉన్న పవర్ అలాంటిది..తమ కలంతో సామాన్యుల గళాలను వినిపిస్తూ సమాజసేవలో తమ వంతు పాత్ర పోషించే జర్నలిస్టులకు మనదేశంలో రక్షణ కరువైంది. సిరా చుక్కల స్థానంలో నెత్తురు చుక్కలు దర్శనమిస్తున్నాయి. ఎదిరించి ప్రశ్నించి వార్తలు రాసిన పాపానికి ప్రాణాలను బలి పెట్టాల్సి వస్తుంది.

 

బెంగళూరుకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురికావడంతో దేశంలో జర్నలిస్టుల పరిస్థితి మరోసారి చర్చకు వచ్చింది. భారతదేశంలో పాత్రికేయులు అత్యంత విషమ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని న్యూయార్క్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. అంతేకాకుండా జర్నలిస్టులకు రక్షణ లేని దేశాల్లో భారత్‌కు మూడో స్థానం కట్టబెట్టిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2015లో 110 మంది జర్నలిస్టులు హత్యగావింపబడ్డారు..వీరిలో న్యూస్‌ కవర్ చేయడానికి వెళ్లి 69 మంది చనిపోగా..43 మంది అసలు ఎందుకు చనిపోయారో కూడా కారణం తెలియదు. ఇదే సమయంలో భారత్‌లో 28 మంది పాత్రికేయులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రధానంగా అయిల్ మాఫియా, అక్రమ మైనింగ్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో విభేదాలు వంటి పలు కారణాలతో జర్నలిస్టులు హత్యగావింపబడ్డారు. 

 

* ప్రస్తుతం అత్యాచారం, హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీం‌కు వ్యతిరేకంగా కథనాలు రాసిన విలేకరి..రామచంద్ర చత్రపతిని అతని కార్యాలయంలోకి చొరబడి తుపాకీతో కాల్చి చంపారు.

* మిడ్‌ డే ప్రతికకు చెందిన క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయి డేను అండర్ వరల్డ్ మాఫియా 2011లో హత్య చేసింది.

* మహారాష్ట్రకు చెందిన సంపాదకుడు నరేంద్ర దబోల్కర్‌ను 2013లో ఆగస్టులో ఒక ఆలయం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

* హిందీ దైనిక్ దీనబంధు’ విలేకరి సాయి రెడ్డి.. ఛత్తీస్‌ఘడ్‌లోని నక్సల్ ప్రభావిత జిల్లా బీజాపూర్‌లో అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు.

* 2014 మే 27న ఒడిశా‌లోని స్థానిక టీవీ ఛానల్ స్ట్రింగర్ తరుణ్‌కుమార్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు.

* 2014లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ఎంవీఎన్ శంకర్ హత్యకు గురయ్యారు. ఎంవీఎన్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆయిల్ మాఫియాపై పలు కథనాలు అందించారు.

* 2013లో యూపీలోని ముజఫ్పర్‌నగర్‌లో ‘నెట్‌వర్క్ 18’కు చెందిన విలేకరి రాజేష్ వర్మను తుపాకీతో కాల్చి చంపేశారు.

* ఫేస్‌బుక్‌లో మంత్రిగారికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడనే అక్కసుతో ఉత్తరప్రదేశ్‌లో‌ని షాజహాన్‌పూర్‌‌కు చెందిన విలేకరి జోగేంద్ర సిన్హాను సజీవ దహనం చేశారు.

* 2015 జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో విలేకరి సందీప్‌ కొఠారీని సజీవ దహనం చేశారు.

* వ్యాపం కుంభకోణంపై పరిశోధన చేస్తున్న ఆజ్‌తక్ రిపోర్టర్ అక్షయ్ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. ఆయన మరణానికి కారణాలు నేటి వరకు తెలియదు.

*  2016 మే 13న బీహార్‌లోని హిందీ దైనిక్ హిందుస్థాన్‌కు చెందిన జర్నలిస్టు రాజ్‌దేవ్‌ రంజన్‌ను తుపాకీతో కాల్చి చంపారు.


బయటి ప్రపంచానికి తెలిసినవి వాటిలో ఇవి కొన్ని మాత్రమే..ఇంకా ఆచూకీ గల్లంతైన వారు..అనుమానాస్పదంగా మరణించినవారికి లెక్కే లేదు. ఇలాంటి వాటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహా అనేక జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా చర్యలు మాత్రం శూన్యం.