Top Stories

ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి

అజ్ఞాతంలో ఏపీ లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ సినీ ఇండస్ట్రీపై మోజుతో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి దందాలు వరుసగా బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్‌ కసిరెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను నెలకొల్పి, కార్తికేయ-2 ఫేమ్‌ నిఖిల్‌ సిద్ధార్థ్‌  హీరోగా  స్పై అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మించారు.  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్‌ 29న ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజ్‌ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్‌లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యం వెనకున్న రహస్యాన్ని స్పృశిస్తూ, ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థకు ఉప్పలపాటి చరణ్‌తేజ్‌ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈవోగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకూ అడ్వాన్సులిచ్చారు. ఆ మధ్య కాలంలో మిడ్‌ రేంజ్, కొత్త హీరోలతో హిట్‌ సినిమాలు తీసిన నలుగురైదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కుమ్మరించినట్లు సమాచారం.  ఈ లోగా ఎన్నికలు ముంచుకొచ్చేయడం, ఏపీలో జగన్‌ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో.. ఆ కొత్త ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రాజ్ కసిరెడ్డి.   స్పై సినిమాను ఎంత బడ్జెట్‌లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? ఈ సినిమాకు జరిగిన వ్యాపారమెంత?  తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్‌ సేకరించింది. ఇంకా ఏయే సినిమాలు నిర్మాణానికి పైప్‌లైన్‌లో పెట్టారు? వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు? ఇందుకు మనీ రూటింగ్‌ ఎలా చేశారు? అనే దానిపై సిట్‌ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు.. 2020 డిసెంబరు 12న ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను నెలకొల్పిన రాజ్‌ కసిరెడ్డి.. ఆ వెంటనే  స్పై చిత్రం నిర్మాణం చేపట్టారు. దానికి నిర్మాతగా తన పేరు అధికారికంగానే వేసుకున్నారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ బృందాలు ఇటీవల ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రిజిస్టర్‌ చిరునామా అయిన హైదరాబాద్‌ మణికొండ ప్రశాంతి హిల్స్‌లోని ప్లాట్లలో తనిఖీలు జరిపాయి. అక్కడ ప్రస్తుతం ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని గుర్తించాయి. ఇదే చిరునామాలో రీసోర్స్‌ వన్‌ ఐటీ సొల్యూషన్స్‌ అనే ఐటీ కంపెనీ ఉంది. దీనికి రాజ్‌ కసిరెడ్డి సతీమణి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శినిరెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మధ్య లావాదేవీలు ఏమైనా సాగాయా అన్నదానిపై కూడా సిట్‌ బృందాలు ఆరా తీస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. సిట్ గత నెల 28, 29 తేదీలలో ఇచ్చిన నోటీసులు ఇవ్వగా విచారణకు గైర్హాజరైన రాజ్ కసిరెడ్డి   తనకు సిట్ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే కసిరెడ్డి రాజ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ నోటీసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సిట్ ఆయనకు ఈ నెల 5న మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. అయితే కసిరెడ్డి రాజ్ ఈ సారీ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్ ఉంది. దీంతో కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న సిట్  అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి Publish Date: Apr 16, 2025 12:43PM

అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం, తాజాగా వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఉంటూ స్వీయబహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి ట్రంప్‌ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. అలాంటివారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  ప్రస్తుతం దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్నవారిపై ఇమిగ్రేషన్‌ అధికారులు దృష్టిసారించారన్నారు. అయితే, చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయబహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలా వెళ్లాలనుకునేవారికి తాము విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ప్రకటించారు. వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడం పైనా ట్రంప్‌ మాట్లాడారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన ఈసందర్భంగా స్పష్టంచేశారు. అయితే.. సముచితమని భావిస్తే వారు చట్టపద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెన్ట్స్‌కు  రోజుకు 998 డాలర్లు జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. స్వతహాగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం వెళ్లాలనేకునే వారికి సాయం అందిస్తామని చెప్పారు. తమ దేశాలకు వెళ్లే క్రమంలో చార్జీలను భరించలేకపోతే.. సబ్సిడీ విమాన సర్వీసుకు కూడా అర్హులవుతారని అధికారులు పేర్కొన్నారు.
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ Publish Date: Apr 16, 2025 11:09AM

సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. లక్ష్యం ఏమిటో తెలుసా?

  రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షిండమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు రెడీ అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 16) రాత్రి ఆయన జపాన్ పర్య టనకు బయలుదేరనున్నారు.    సీఎం రేవంత్ రెడ్డి  ఈ నెల 22 వరకు అంటే ఆరు రోజుల పాటు రేవంత్ జపాన్ లో పర్యటిం చనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట   మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా ఉంటుంది.   ఈ పర్యటనలో భాగంగా ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అభివృద్ధిపై జపాన్ పర్యటనలో రేవంత్ బృందం అధ్యయనం చేయనుంది.  అలాగే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతికతను అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పారిశ్రామికవేత్తలను, సంస్థలను ఆహ్వానించనున్నారు.  
సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. లక్ష్యం ఏమిటో తెలుసా? Publish Date: Apr 16, 2025 11:02AM

లిక్కర్ స్కాం.. రెండు రోజుల ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం (ఏప్రిల్ 16) సిట్ విచారణకు హాజరయ్యారు.  లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 18న హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన రెండు రోజుల ముందుగానే విచారణకు హాజరుకానున్నట్లు ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఇందుకు సిట్ అంగీకరించింది. దీంతో ఆయన బుధవారం (ఏప్రిల్ 16)న   సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సీపీ కార్యాలయంలో సిట్ అధికారులు విజయసాయిని విచారిస్తున్నారు. ఇదే మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసుల విచారణకు  హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు.  హైదరాబాద్ లోని కసిరెడ్డి నివాసం, కార్యాలయాలలో సిట్ బృందం ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఈ కేసులో విజయసాయిరెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కర్త, క్రియ, కర్మ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని ఆరోపించిన సంగతి తెలిసిందే. అవసరమైన సమయంలో అందుకు సంబంధించిన విషయాలన్నీ వెల్లడిస్తానని కూడా విజయసాయిరెడ్డి అప్పట్లోనే చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విజయసాయి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారుతుందని సిట్ బృందం భావిస్తోంది.  
లిక్కర్ స్కాం..  రెండు రోజుల ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి Publish Date: Apr 16, 2025 10:47AM

పవన్ కల్యాణ్ కు ఏమైంది?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 15)న జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సెక్రటేరియెట్ వరకూ వచ్చారు. అయితే సమావేశానికి హాజరు కాకుండా  ఆయన   తన క్యాంప్ ఆఫీస్ కువెళ్లిపోయారు. ఆయన కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడానికి బ్యాక్ పెయిన్ కారణంగా చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట కూడా ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్ తో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని  సూచించారు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ ఒక్క  ఉపముఖ్యమంత్రే కాదు. ఆయన అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కూడా. కీలక శాఖల మంత్రిగా ఆయన తరచూ విస్తృత పర్యటనలు చేయడంతో ఆయన వెన్నునొప్పి తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి పవన్  కల్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్న సమ యంలో సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయ పడ్డాడు. దీంతో ఆయన అడవితల్లి బాట కార్యక్రమం ముగిసిన వెంటనే హుటాహుటిన సింగపూర్ బయ లు దేరి వెళ్లారు. ఆ తరువాత  తన కుమారుడు మార్క్ శంకర్ ను ఎత్తుకుని విమానాశ్రయంలో కనిపించారు. అదే చివరి సారి ఆయన బహిరంగంగా కనిపించడం. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్లారు. అక్కడ తలనీలాలు సమర్పించి, కుమారుడి పేరుమీద అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వెళ్లలేదు. అందుకు కారణం కూడా ఆయన బ్యాక్ పెయినే అని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన మంత్రివర్గ సమావేశానికి కూడా రాకపోవడంతో వెన్ననొప్ప తీవ్రంగా ఉందని భావించాల్సి వస్తున్నది.   
పవన్ కల్యాణ్ కు ఏమైంది? Publish Date: Apr 16, 2025 10:23AM

ఏపిలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్

 విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ 22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయి రెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంలో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (ఏప్రిల్ 15) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల, 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు  తుది గడువు మే 2. పోలింగ్ మే  9న జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.   కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి జరగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం లాంఛనమే. అయితే కూటమి పార్టీలలో ఏ పార్టీ ఈ ఎన్నికలో పోటీకి నిలబడు తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ  అయిన రాజ్యసభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.  వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఆ పార్టీ తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేకపోవడంతో  రాజ్యసభ ఉప ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థి ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది.  
ఏపిలో  రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్  Publish Date: Apr 16, 2025 10:02AM

ఆడవాళ్ల మాట వినడమంటే చిన్నతనమా? మీకు తెలియని నిజాలు ఇవి..!

  గత కొన్ని సంవత్సరాల నుండి గమనిస్తే ఆడవాళ్లు వంటింటి కుందేళ్ల స్థానం నుండి మల్టీ టాస్కర్లు గా ఎదిగారు.  ఇంటి పని,  వంటి పని, ఉద్యోగంతో పాటు ఆర్థిక విషయాలు కూడా చూసుకుంటున్నారు. అయినా సరే పెళ్లి తర్వాత ఆడవాళ్ల పాత్ర చాలా వరకు తగ్గించాలని చూస్తారు మగవారు. ఇంటి విషయాలలో మగవారు తమ మాటే నెగ్గాలని అనుకుంటూ ఆడవారి మాటను లెక్కచేయరు. కానీ మహిళల గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను అధ్యయనాలు బయటపెట్టాయి. ఆడవారికి ఏమీ తెలియదు.. వారికి ఏమీ చెప్పక్కర్లేదు అనుకోవడం మాత్రమే కాదు.. ఆడవారి మాట వినకుండా విస్మిరించే మగవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఒక అధ్యయనం వెలువరించిన వివరాల ప్రకారం.. మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందట.  మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడుతుందని,  తప్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే పురుషులు స్త్రీల మాట వినాలని అంటారు. మహిళల విషయానికి వస్తే.. మహిళలు  చాలా కోణాలను   పరిగణలోకి తీసుకుంటారు, సహకారాన్ని ఇష్టపడతారు . మహిళల ఆలోచనలు  పురుషుల కంటే సమతుల్య దృక్పథాన్ని అందిస్తాయి, ఇది ఎక్కువ  విజయావకాశాలకు దారితీస్తుంది. వారి ఆలోచనా విధానం పురుషుల ఆలోచనా విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వారు అంచనా వేయగలరు. పురుషులు ఇంట్లో,  కార్యాలయంలో మరింత సవాలుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు.  ఇంట్లో,  కార్యాలయంలో మహిళల దృక్పథం  ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. తన సలహా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక విజయమే కాకుండా, మానసిక ఆరోగ్యం,  ఇరువురి మధ్య  ఆనందం కూడా మెరుగవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే వారి ముందు భార్యాభర్తలు  ఒక జట్టులా ఉంటారు. తరచుగా పిల్లల ముందు పురుషులు తమ భార్యలను తిడతారు.  ఇది వారి ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది. అయితే  సమస్యలను ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలి.  భార్య గృహిణి అయినప్పటికీ, ఆర్థిక నిర్ణయాల కోసం  ఎల్లప్పుడూ ఆమె దగ్గరికి వెళ్లాలి. అది పొదుపు అయినా లేదా పెట్టుబడుల గురించి అయినా. ఆమె దాని సాంకేతిక అంశాలలోకి వెళ్ళలేకపోయినా, దానిని ఎలా చేయాలో,  మీరిద్దరూ కుటుంబంగా ప్రతి నెలా ఎంత ఆదా చేయాలో ఆమె మీకు చెప్పగలదు. పిల్లల ముందు ఒక జట్టుగా ఉండాలంటే, అది కిరాణా సామాను కొనడం లాంటి చిన్నదైనా లేదా కారు కొనడం లాంటి పెద్దదైనా  కలిసి మాట్లాడుకోవాలి.  ప్రతిదానిపైనా ఆమె అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. దీని వలన    జీవితంలోని ప్రతి అంశంలోనూ తాను కూడా ఉన్నానని భార్య భావిస్తుంది. ఇది ఆడవారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం.                                            *రూపశ్రీ.
ఆడవాళ్ల మాట వినడమంటే చిన్నతనమా? మీకు తెలియని నిజాలు ఇవి..! Publish Date: Apr 16, 2025 9:30AM

నాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..!

  శరీరం,  మెదడు తో పాటు మిగిలిన భాగాలకు నిద్ర అవసరమని చాలా మందికి తెలుసు. కానీ నిద్ర  బరువును, ఆలోచనా శక్తి, రోగనిరోధక శక్తితో పాటు  అనేక రకాల హార్మోన్లు మొదలైన వాటిని కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు.  తక్కువ నిద్రపోతే లేదా నాణ్యత లేని నిద్ర వస్తే, అది  మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో మధుమేహం, ఊబకాయం, నిరాశ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు ఆటంకం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుని అధిగమిస్తే.. నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది. టీ, కాఫీలు తాగే సమయం.. భారతదేశంలో ప్రతి వీధిలో టీ ప్రియులు, కాఫీ ప్రియులు బోలెడు కనిపిస్తారు. ఇంట్లో కూడా రోజుకు కప్పుల కొద్ది కాఫీ, టీ తాగే వారు ఉంటారు.  కానీ ఈ రెండు పానీయాల వినియోగ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాఫీ, సాయంత్రం 5 గంటల తర్వాత టీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది నిద్ర మీద చాలా దారుణ ప్రభావం చూపిస్తుందట. మద్యం.. మద్యం తాగడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగడం వల్ల బాగా నిద్రపడుతుందని  చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం తాగడం వల్ల త్వరగా నిద్ర వదిలిపోతుందట. నిద్ర నాణ్యత తగ్గిపోతుందట.  నిద్ర.. తరచుగా ఉదయం చాలా త్వరగా నిద్రలేవడం వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో నిద్ర పోవడం కొందరి అలవాటు.  దీని కారణంగా చాలా మంది 1 లేదా 1.5 గంటలు నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి మద్యాహ్నం పడుకుంటే కేవలం అరగంట లోపే ఈ సమయాన్ని పరిమితం చేయాలట. 7-9 గంటల నిద్ర.. నిద్ర అవసరం వయస్సు మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి 7-9 గంటలు నిద్రపోవడం మంచిదట.  6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే అది చిరాకును పెంచుతుందని అంటున్నారు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..! Publish Date: Apr 16, 2025 9:30AM

చాహల్ స్పిన్ మ్యాజిక్.. కోల్ కతా నైట్ రైడర్స్ గింగిరాలు

16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15) పంజాబ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చాహల్ స్పిన్ తో మ్యాజిక్ చేశాడు. దాంతో కోల్ కతా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్ అంటేనే బంతిపై బ్యాట్ ఆధిపత్యం.. పరుగుల వరద పారుతుంది. కానీ మంగళవారం ( ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఈ మ్యాచ్ లో బంతిదే ఆధిపత్యం. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఫలితంగా తక్కువ స్కోర్లే నమోదయ్యాయి.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111పరుగులకే కుప్పకూలింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా రాణించాడు. మూడు ఓవర్లు వేసిన హర్షిత్ రాణా కేవలం పాతిక పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అనిరిచ్ లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30 పరుగులు, ప్రియాన్స్ ఆర్యా 22 పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో కోల్ కతా ముందు 112 పరుగుల స్వల్ప విజయలక్ష్యం ఉంది. అందరూ కూడా కోల్ కతా నైట్ రైడర్స్ విజయం లాంఛనమే అని భావించారు. అయితే పంజాబ్ బౌలర్లు అందరి అంచనాలనూ తల్ల కిందులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ ను వంద పరుగులలోపే కట్టడి చేశారు. ఐపీఎల్ చరిత్రలోఇంత తక్కువ స్కోరును కాపాడుకుని గెలవడం ఇదే ప్రథమం. ఆ విషయంలో పంజాబ్ కొత్త రికార్డు సృష్టించింది. ఇక పంజాబ్ బౌలర్లలో యుజువేంద్ర చాహల్ మాయ చేశాడు. తన స్పిన్ మాయా జాలంతో కోల్ కతా బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహల్ 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చాహల్ తను వేసిన చివరి ఓవర్లో రస్సెల్ రెండు సిక్స్ లు ఓ ఫోర్ బాదడంతో ఆ దశలో కోల్ కతాకు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే జాన్సన ఆ ఆశలను చిదిమేశాడు. 3.1 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యి 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చాహల్ ను వరించింది. 
చాహల్ స్పిన్ మ్యాజిక్.. కోల్ కతా నైట్ రైడర్స్ గింగిరాలు Publish Date: Apr 15, 2025 12:37AM

టీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రచ్చ

జానా X రాజగోపాల్... ప్రేమ్‌సాగర్ X వివేక్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ .. అదిగో, ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులాంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సామాజిక వర్గాల వారీగా నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. అయితే విస్తరణ జాప్యం అవుతుండటంతో ఆశావహుల్లో అసంతృప్తి బయటపడుతోంది. తమకు పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నదట. అలాంటి వారి జాబితాలో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేరారు.  ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అడ్డుపడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్‌సాగర్‌రావ్ కూడా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో  అని అనుమానపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా  ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన నేత అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాల సభలో చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? కష్టకాలంలో పదేళ్ళు పార్టీని కాపాడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.  తన అభిమానులు కార్యకర్తలు పార్టీ మారి వచ్చిన వారికి మంత్రి పదవి వస్తుంది అనే వార్తలతో డిప్రెషన్ లో ఉన్నారని, కష్ట కాలంలో పార్టీ తో ఉన్న తమ పరిస్థితి ఏంటని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ఈ కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టినట్లు అయ్యిదంట. పార్టీ కోసం పని చేసిన ప్రేమ్‌సాగర్ రావు ఎన్నికల ప్రచార సమయంలో ఇంద్రవెల్లి సభ మొదలు, మంచిర్యాలలో ఖర్గే సభలు విజయవంతం చేశారన్న గుడ్‌విల్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రేమ్ సాగర్‌రావ్‌కి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ పోతుందోనని  కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందంట. జిల్లా నుంచి ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు కేబినెట్‌ బెర్త్ ఖరారైందన్న  ఉహగానాల నేపథ్యంలో ప్రేమ్‌సాగర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది. వివేక్‌ టార్గెట్‌ గానే ప్రేమ్‌ సాగర్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ జిల్లాలో నడుస్తుందట. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారని పరోక్షంగా వివేక్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారంటున్నారు.  ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ జనాభాకు అనుగుణంగా పదవులు దక్కలేదని ...ఈసారైనా మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ఈ ఈక్వేషన్‌లను దృష్టిలో ఉంచుకుని వివేక్‌కు ఈసారి కేబినెట్ బెర్త్‌ ఖాయం అనే ప్రచారం జరగుతోంది. ఈ సందర్భంలో వివేక్‌ టార్గెట్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కామెంట్స్ చేశారంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యం నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే బాహాటంగా ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే విమర్శించే స్థాయికి రావడంతో నేతల మధ్య గ్యాప్‌ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.
టీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రచ్చ Publish Date: Apr 15, 2025 11:37PM

వైసీపీలో సజ్జలకే మళ్లీ అందలం

 పీఏసీ కన్వీనర్‌గా మాజీ సలహాదారు వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు కనిపించిన జగన్ మళ్లీ ఆయననే అందలమెక్కిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యత సజ్జల భుజాలపై పెట్టారు  మాజీ సీఎం జగన్ తాజాగా నియమించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా సజ్జలను నియమించడంతో పార్టీలో ఆయన  ప్రాధాన్యతను మరింత పెరిగినట్లైంది. పార్టీలో మళ్లీ సజ్జల పెత్తనమే కొనసాగనుండటంతో కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారంట.  మరోవైపు సదరు కమిటీలో ముద్రగడ పద్మనాభంకు స్థానం కల్పించడం, దానికి ఆయన సంబరపడిపోతూ ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.  వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించారు. మొత్తం 33 మంది సభ్యులతో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా ఈ పీఏసీని ప్రకటించారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ రాజకీయ సలహాల కమిటీకి ఇప్పటికే పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా నియమించారు.  దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించినట్లైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అన్నీ తానై జగన్‌ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌లపై వైసీపీ నేతలు చెలరేగిపోయేవారు. ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో తన ప్రెస్‌మీట్‌లను వైరల్ చేసేవారని  పోసాని కృష్ణమురళి స్వయంగా పోలీసు విచారణలో వెల్లడించారు. అంటే ప్రత్యర్ధులపై దాడుల నుంచి పార్టీ వ్యవహారాలన్నీ ఎలా డీల్ చేయాలనే విషయం వరకు అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డే స్వయంగా చూసుకునేవారన్నమాట. వైసీపీని వీడిన కోటంరెడ్డి, విజయసాయిరెడ్డి నుండి మొన్న పోసాని వరకూ అందరూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు శల్య సారథ్యం చేస్తూ జగన్‌ను ముంచేస్తున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతుంటాయి. గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ సమయంలో కూడా పలువురు నేతలు జగన్ కోటరీ అంటూ సజ్జలను టార్గెట్ చేశారు. అయితే వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా జగన్‌ మేల్కొలేదన్న అభిప్రాయం  వ్యక్తమవుతోంది.  ఓటమి తర్వాత జగన్ సజ్జలని పక్కన పెట్టినట్లు కనిపించారు. అయితే విజయసాయిరెడ్డి వంటి ముఖ్యనేత పార్టీని వీడి వెళ్ళిపోవడం సజ్జలకు బాగా కలిసి వచ్చిందంటున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ రూ. లక్షల చొప్పున ప్రభుత్వ సొమ్ము జీతభత్యాలుగా చెల్లిస్తూ 50 మందికిపైగా సలహాదారులని నియమించుకున్నారు. ఇప్పుడంత సీన్ లేకపోవడంతో 33 మంది సీనియర్ నేతలతో ఓ రాజకీయ సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నారంట. దానికి సజ్జల రామకృష్ణా రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. అంటే పార్టీలో ఇప్పటికే స్టేట్ కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల పెత్తనం మళ్లీ మొదలైనట్లే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మెజారిటీ నేతలు భావిస్తున్నారట..   సకల శాఖల మంత్రి పాత్ర పోషిస్తూ సజ్జలే చాలా సందర్భాల్లో సీఎంలా వ్యవహరించరన్న టాక్ ఉంది.. విజయసాయిరెడ్డి కూడా పదేపదే కోటరీ అని విమర్శలు చేయడానికి అదే కారణమంటారు. ఓడిపోయిన తర్వాత సజ్జలను, కోటరీని పక్కన పెట్టినట్లు కనిపించిన జగన్ మళ్లీ ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడం వైసీపీ సీనియర్లకు మింగుడుపడటం లేదంట.  జగన్ తాజా నిర్ణయంతో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందంట. జగన్ లో మార్పు వచ్చింది కోటరీని దూరం పెడుతున్నారని భావించే లోపే ... మళ్లీ పాత బ్యాచ్ అందరికీ పగ్గాలు అప్పగిస్తుండడంతో, నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పార్టీలో ఉండడం కంటే ఆపార్టీని వీడడమే మేలని మెజార్టీ నేతలు భావిస్తున్నారంట. 
వైసీపీలో సజ్జలకే మళ్లీ అందలం Publish Date: Apr 15, 2025 11:20PM

17 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సకుటుంబ సమేతంగా ఈ నెల 16న ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబు  అక్కడ నుంచి విదేశీ పర్యటనకు వెడతారు. ఈ నెల 20న  ద్రబాబు 75వ జన్మదినం. తన వజ్రోత్సవ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలలో జరుపుకుంటారు.   మోదీ అమరావతి పర్యటన మే 2న ఖరారైన సంగతి విదితమే. మోడీ ఏపీ పర్యటనకు ముందే చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చేస్తారు. కాగా చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది కావడంతో వివరాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు.  
17 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన Publish Date: Apr 15, 2025 11:18PM

సొంత వైద్యం వంటబట్టదు అంటే ఇదేనా?

స్వరాష్ట్రంలో  పని చేయని పీకే వ్యూహాలు! ప్రశాంత్ కిషోర్, పీకే.. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది.ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది. అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు.  జన సురాజ్  పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.   అవును గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకు ఎందరో నాయకులకు, ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్  ఇప్పడు స్వయంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. వ్యూహాత్మకంగా పావులు  కదుపుతున్నారు.అయితే  అదేదో సామెత చెప్పినట్లు  అందరికీ వర్కౌట్ ఆయన  వ్యూహలు, సొంతానికి వచ్చేసరికి అతంగా పనిచేస్తున్నట్లు లేదని అంటున్నారు.   ఔను పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.. సొంత వైద్యం వంటబట్టదు అని పెద్దలు ఊరికే అన్నారా? ఇప్పడు తాను స్వయంగా రాజకీయవేత్తగా మారిన పీకేకు ఆయన వ్యూహాలు ఆయన సోంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.. ఫలించడం లేదు.   నిజానికి నాలుగేళ్ళ కిందట (2021)పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి పని చేసిన పీకే  ఇక పై  ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. అలాగే  క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదనీ అన్నారు. అంతే కాదు,  నేను రాజకీయాలకు పనికిరాను  అని తనకు తానే   సెల్ఫ్  సర్టిఫికేట్  ఇచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే  ఆ ఒట్టు తీసి గట్టున పెట్టారు. కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు,  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు  ప్రయత్నాలు సాగించారు. కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగారు. శరద్ పవార్ మొదలు కేసీఆర్  వరకు ప్రముఖ నేతలు అందరినీ కలిశారు. అందరినీ కలిపారు. మరోవంక కాంగ్రెస్ పునర్జీవనానికి ఉడతా భక్తిగా   ఉచిత  సలహాలు కూడా ఇచ్చా రు. చివరకు  తాతకు దగ్గులు నేర్పినట్లు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి) సభ్యులను కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. ఇలా దేశ రాజకీయాల్లో  తన కంటూ ఒక స్థానం సంపాదిం చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.  సరే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా పని చేయలేదు. మధ్యలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటి అధికార పార్టీలతో డీల్  కుదుర్చుకున్నారు. అయితే  అక్కడా కథ అడ్డం తిరిగింది. ఉభయ రాష్ట్రాల్లో ఆయన వ్యూహాలు ఉడక లేదు.ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ బండ్లు బోల్తా కొట్టాయి. అక్కడ ఏపీలో  జగన్ రెడ్డి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరి కిద్దరు చిత్తుగా ఓడి పోయారు. జగన్ రెడ్డి పరిస్థితి అయితే మరీ ఘోరం, పదకొండు పరుగులకే ఔటై పోయారు. ఇక చివరి ప్రయత్నంగా స్వరాష్ట్రం బీహార్ లో సొంత జెండా ఎగరేశారు. జన సురాజ్  పార్టీని స్థాపించారు. సంవత్సరం పైగా రాష్ట్రంలో పాద యాత్ర చేస్తున్నారు. అయితే  అదేమిటో కానీ, శకునం చెప్పే బల్లి  కుడితిలో పడింది అన్నట్లుగా.. యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఏపీ ఇలా ఎక్కడెక్కడో, ఎవరెవరినో గెలిపించిన  ప్రశాంత్ కిషోర్ వ్యూహం  స్వరాష్టంలో,  పని చేస్తున్నట్లు లేదని అంటున్నారు.  ఇటీవల బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేఎస్పీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది.అయితే  నలుగు స్థానాలకు ఒంటరిగా పోటీ చేసిన జేఎస్పీకి  ఒక్క సీటు దక్కలేదు. కానీ  జేఎస్పీ ఖాతాలో పది శాతం ఓట్లు అయితే పడ్డాయి. అలా జేఎస్పీ చీల్చిన ఓట్లు ప్రతిపక్ష కూటమిని దెబ్బతీశాయి. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటుగా మొత్తం నాలుగు స్థానాలలో ఆర్జేడీ సారధ్యంలోని మహా ఘటబంధన్ ఓడిపోయింది. రెండు నియోజక వర్గాల్లో అయితే  అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ కంటే జేఎస్పీకి వచ్చిన ఓట్లు ఎక్కువని లెక్క తేలింది. దీంతో  పీకే అసలు రంగు బయట పడిందని బీహార్ ప్రజలు పీకే పార్టీని, బీజేపీ బీ  టీమ్ గా భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో జేఎస్పీ ఓటు షేర్  ఏకంగా  పది నుంచి మూడు శాతానికి పడి పోయిది. దీంతో కింగ్ ఆర్ కింగ్ మేకర్ కావాలనే పీకే   కల కలగానే మిగిలి పోతుందని అంటున్నారు. అలాగే ఇటీవల పాట్నాలో జేఎస్పీనిర్వహించిన తొలి భారీ బహిరంగ సభకు లక్షల్లో జనం వస్తారని  భావించి ఏర్పాట్లు చేస్తే వేలల్లో కూడా జనం రాలేదు. అందుకే పీకే పట్టుమని పది నిముషాలు అయినా మాట్లాడకుండానే తట్టా బుట్టా సర్దేశారు. సో .. బీహార్ ఎన్నికల్లో పీకే పాత్ర ఏమిటన్నది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. అలాగే, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వ్యూహకర్త చేసిన వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు.
సొంత వైద్యం వంటబట్టదు అంటే ఇదేనా? Publish Date: Apr 15, 2025 5:53PM

వైజాగ్ టు అమరావతి వయా హైదరాబాద్!

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రద్దుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నంల మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల తనకు ఎదురైన ఇబ్బందిని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ పట్నం నుంచి విజయవాడ వెళ్లాలంటే ముందు హైదరాబాద్ చేరుకోవలసి వస్తోందని, అక్కడ నుంచి మళ్లీ మరో ఫ్లైట్ ఎక్కి విజయవాడకు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు విశాఖపట్నం టు అమరావతి వయా హైదరాబద్ లా పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  విశాఖ-విజయవాడ నగరాల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు, ఇతర ప్రయాణికులకు ఎదురైన అనుభవాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే తెలంగాణ మీదుగా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.  "ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి   ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి వెళ్లాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి రావడం బాధాకరమని గంటా ఆపోస్టులో పేర్కొన్నారు. మంగళవారం (ఏప్రిల్ 15) ఉదయం తాను విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు విమానంలో చేరుకుని, అక్కడ నుంచి విజయవాడ విమానం అందుకుని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యిందని చెప్పారు.  ఈ మేరకు తాను ప్రయాణం చేసిన విమానం టికెట్లను కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తనలాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారని వివరించారు. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతోనే  ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 వైజాగ్ టు అమరావతి వయా హైదరాబాద్! Publish Date: Apr 15, 2025 5:23PM

నెల్లూరు జిల్లాలో నాటకీయ పరిణామాలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై రాజకీయ వైరంతో ప్రత్యర్థి పెట్టించిన 17 కేసులకు సర్వేపల్లి శాసన సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించి కోర్టుకు హాజరౌతుంటే.. వీటికి కారణంగా చెబుతున్న ఆయన ప్రత్యర్థి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఇచ్చి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.  సోమిరెడ్డి నేడు కూడా ఆనందయ్య కరోనా కేసు విచారణకు హాజరయ్యారు.  కాకాణి పరారీపై సోమిరెడ్డి మంగళవారం (ఏప్రిల్ 15) ఆక్షేపణలు తెలిపారు. గతంలో కాకాణి వాడిన భాషపైనా, తిట్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే పోలీసు నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కావాలని సవాల్ చేశారు.  కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.   
నెల్లూరు జిల్లాలో నాటకీయ పరిణామాలు Publish Date: Apr 15, 2025 5:10PM

ఏపీ లిక్కర్ స్కాం.. విజయసాయికి సిట్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగం పెంచింది. ఓ వైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజా కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే, హైదరాబాద్ లోని ఆయన నివాసం కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నది. మరో వైపు ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా మాజీ ఎంపీ, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 18న విజయవాడలోని సీపీ కార్యాలయంలో హాజరు కవాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది.  ఇప్పటికే విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని మీడియా ముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో విజయసాయి గతంలో సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజశేఖరరెడ్డే ఈ కుంభకోణానికి కర్త, కర్మ క్రియ అని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. 
ఏపీ లిక్కర్ స్కాం.. విజయసాయికి సిట్ నోటీసులు Publish Date: Apr 15, 2025 5:02PM

వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. కాగా వంశీకి బెయిలు ఇవ్వవద్దంటూ పటమట పోలీసలు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో వాదనలు వినడం కోసం వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఎల్లుండికి అంటే గురువారం (ఏప్రిల్ 17)కు వాయిదా వేసింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  
 వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌  విచారణ వాయిదా  Publish Date: Apr 15, 2025 4:29PM

ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు.  7.5 కోట్ల రూపాయల విలువైన గుర్గావ్ ల్యాండ్ స్కామ్  వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ నెల 8న విచారణకు హాజరుకావాల్సి ఉండగా వాద్రా గైర్హాజరయ్యారు.  దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసి ఈ రోజు హాజరు కావాలని పేర్కొంది. దీంతో రాబర్ట్ వాద్రా మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  బీజేపీ రాజకీయ ప్రతికారంలో భాగంగానే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆ సందర్భంగా రాబర్ట్ వాద్రా ఆరోపించారు.  తాను ప్రజల తరఫున గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ బబీపీ అణచివేయడానికి ప్రయత్నిస్తోందని వాద్రా అన్నారు.  అన్నారు.
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా Publish Date: Apr 15, 2025 4:09PM

ప్రధాని మోడీతో కరణం మల్లీశ్వరి భేటీ

ఒలింపిక్స్‌ పతకం విజేత, ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. హర్యానాలోని యమునానగర్ లో ఈ భేటీ జరిగింది. కరణం మల్లీశ్వరితో భేటీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.   క్రీడాకారిణిగా కరణం మల్లీశ్వరి సాధించిన విజయాలు దేశానికి  గర్వకారణమని పేర్కొన్న మోడీ  క్రీడల్లో ఆమె ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రీడా రంగంలో వ్యక్తిగత విజయాలతో పాటు, భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కరణం మల్లీశ్వరి చేస్తున్న కృషిని ప్రశంసించారు క్రీడాకారిణిగా, మార్గదర్శిగా ఆమె సేవలు దేశానికి ఎంతో విలువైవని మోడీ ఆ పోస్టులో పేర్కొన్నారు. 
ప్రధాని మోడీతో కరణం మల్లీశ్వరి భేటీ Publish Date: Apr 15, 2025 3:58PM

ఎన్డీయేకు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ గుడ్ బై

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయూ కూటమికి బీహార్ లో షాక్ తగిలింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగింది.  ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి  పశుపతి కుమార్ పరాస్  అధికారికంగా ధృవీకరించారు. గత పదేళ్లుగా ఎన్డీయే కూటమిలో ఉంటున్న రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ.. సరిగ్గా బీహార్ ఎన్నికల ముందు కూటమి నుంచి వైదొలగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దళిత వ్యతిరేక వైఖరికి నిరసనగా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు పశుపతి కుమార్ పరాస్   ఓ ప్రకటనలో తెలిపారు.  ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు.  
ఎన్డీయేకు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ గుడ్ బై Publish Date: Apr 15, 2025 3:53PM

ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటేన ఖరారైంది. వచ్చే నెల 2న ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ శంకుస్థాపనకు ఆయన హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం (ఏప్రిల్ 15)న ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని పర్యటన గురించి చెప్పారు. మూడేళ్లలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులకు శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అలాగే రహదారులు కూడా పూర్తి కావాలన్నారు. ఇన్ చార్జ్ మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు మూడు పార్టీల నేతల భాగస్వామ్యం తప్పని సరిగా ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక రెవెన్యూ సంబంధిత అంశాలను సత్వరమే పరిష్కరించాలని, సూర్యఘర్ పథకం అమలును వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.   ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు   రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.  ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం,  అన్ని చర్యలూ తీసుకుంటోంది.  
ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారు Publish Date: Apr 15, 2025 3:49PM

పవన్ నివాసానికి అల్లు అర్జున్.. విషయమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వెళ్లారు. గత కొంత కాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలవడం ఇటు రాజకీయవర్గాలలోనూ, అటు సినీ పరిశ్రమ వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తించింది.   ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు.. అదే రోజు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు.  ఈ విషయాలేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మెగా  కుటుంబం నుంచి ఎవరూ బన్నీ బర్త్ డేకి విషెస్ తెలపలేదంటూ కామెంట్లు చేశారు. అలాగే  పవన్ కల్యాణ్ కుమారుడు గాయపడితే బన్నీ కనీసం స్పందించలేదంటూ ట్వీట్లు గుప్పించారు.   సింగపూర్ లో చికిత్స తరువాత తన కుమారుడు మార్క్ శంకర్ ను పవన్ కల్యాణ్ దంపతులు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే  అల్లు అర్జున్ సోమవారం (ఏప్రిల్ 14) పవన్ కల్యాణ్ నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా పవన్ నివాసంలోనే ఉన్నారు. దీంతో అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ అన్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది.  
పవన్ నివాసానికి అల్లు అర్జున్.. విషయమేంటంటే? Publish Date: Apr 15, 2025 2:54PM

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన ఏపీ విద్యార్థిని

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినులు గాయపడ్డారు. వారిలో ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన దీప్తి వంగవోలు, ఆమె స్నేహితురాలు గాయపడ్డారు. గుర్తు తెలయని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వారిని ఢీ కొట్టిన వాహనం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పారిపోయాడు. ఈ ప్రమాదంలో దీప్తి తలకు బలమైన గాయం తగిలింది. ఆమెకు శస్త్ర చికిత్స జరుగుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో  విద్యార్థిని క్షేమంగా ఉంది.  డెంటన్‌ పోలీసులు ఈ హిట్‌ అండ్‌ రన్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించాల్సి ఉంది. 
 అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన ఏపీ విద్యార్థిని Publish Date: Apr 15, 2025 2:43PM

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కి సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పుట్టినరోజు  సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.    తెలంగాణ సీఎంవో అఫీషియల్ ఎక్స్  అకౌంట్ ద్వారా రేవంత్ రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అనుక్షణం ప్రజాసేవలో నిమగ్న మవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు రాజాసింగ్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని  రేవంత్ ఆకాంక్షించారు.   బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్  హిందువులు, గోవుల రక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతూ అనేక కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల కాలంలో రాజాసింగ్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నారు.  ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే   అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాజాసింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కి  సీఎం రేవంత్ బర్త్ డే విషెస్ Publish Date: Apr 15, 2025 2:25PM

భూమనపై చర్యలకు టీటీడీ సమాయత్తం.. అసత్య ఆరోపణలపై ఎస్పీకి ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్  భూమన కరుణాకరరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అయ్యింది,  ఈ మేరకు ఆయనపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఎస్పీ  ఎస్పీ హర్షవర్ధనరావుకు ఫిర్యాదు చేశారు. గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.   నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు.  ఎస్వీ గోశాలలో 100గోవులు మరణించాయని కరుణాకరరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన ఆరోపణలను టీటీడీ ఖండించింది. కాగా భూమనపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన భాను ప్రకాష్ రెడ్డి గతంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామనీ, ఇప్పుడు మాత్రం భూమన అసత్య అబద్ధపు ప్రచారం చేస్తున్నారనీ విమర్శలు గుప్పించారు. నోరు ఉంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడారని దుయ్యబట్టారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ చట్టం 356 కింద కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాననీ, ఆయన హయాంలో ఎస్వీగోశాల గోవులకు పురుగులు పట్టిన ఆహారాన్ని పెట్టారనీ, లాలూ ప్రసాద్ యాదవ్  మాదిరిగా పశువుల దాణలో కోటి రూపాయల అవినీతికి భూమన పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గోవిందుడు, గోవులతో ఆటలొద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నానని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలపైనా చర్యలు తీసుకుంటామని చెప్పిన భాను ప్రకాశ్ రెడ్డి, భూమన మాత్రమే కాదు తానూ లోకలేనన్నారు.  టిటిడి పై ఎలాంటి ఆధారాల లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే  ఏ స్దాయి వ్యక్తి అయినా కఠినమైన చర్యలు తీసుకుంటాం‌మని హెచ్చరించారు.  
భూమనపై చర్యలకు టీటీడీ సమాయత్తం.. అసత్య ఆరోపణలపై ఎస్పీకి ఫిర్యాదు Publish Date: Apr 15, 2025 1:38PM

ఏక్ దిన్ కా సెలబ్రిటీ.. దో దిన్ మే దివాళా

కుమారి ఆంటీ నుంచి అఘోరీ మాత వ‌ర‌కూ రాత్రికి రాత్రి ఫేమ‌స్.. త‌ర్వాత అంతా తుస్ గ‌తంలో ప్ర‌ముఖులు అంటే వారికంటూ ఒక సుదీర్ఘ కాల అనుభ‌వం ఫ‌లానా రంగంలో ఉండేది. వారు వ్యాపారంలోగానీ, క్రీడ‌లు, క‌ళ‌ల్లో విశేషంగా రాణించ‌డం వ‌ల్ల వారికా పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చేవి. ప‌ది మందికీ ఆద‌ర్శ‌వంత‌గా మారేవారు. ప‌దికాలాల పాటు వారి వ్యాపార వ్య‌వ‌హారాలు మ‌రింత సుర‌క్షితంగా సుభిక్షంగా న‌డిచేవి.  అదే ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ అంటూ ఏవీ లేవు. ఎవ‌రైతే వాళ్లు.. ఎలా ప‌డితే అలా.. ఫేమ‌స్ అయిపోతున్నారు. ఎందుకు ఫేమ‌స్ అవుతారో.. ఎందుకు వైర‌ల్ అవుతారో.. ఒక లెక్కా ప‌త్రం ఉండ‌టం లేదు. మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చేస‌రికి.. స‌డెన్ స్టార్ లా రాత్రికి రాత్రి వైర‌ల్ అవుతారు. అదంతా నిజ‌మ‌ని న‌మ్మే లోపు.. అథఃపాతాళానికి ప‌డిపోతుంటారు.  దీన్ని ఏమ‌నాలి? ఇలా ఎందుకు జ‌రుగుతోంది? కారణాలు ఏమై ఉంటాయ‌ని చూస్తే.. మీకు మాస్ మీడియంలో ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచేది పేప‌ర్. వార్తా ప‌త్రిక‌. వార్తా  ప‌త్రిక‌లో అన్ని వార్త‌ల‌కూ ఒక చోటు ఉంటుంది. కాకుంటే వెన‌కా ముందు. అదే ఎలెక్ట్రానిక్ మీడియా వ‌చ్చాక.. వార్త వాల్యూ అన్న‌ది తారు మారు అవుతూ వ‌చ్చింది.  విజువ‌ల్ బాగుంటే అది అంత ప్రాధాన్య‌త లేనిదైనా కూడా దానికంటూ టీవీ న్యూస్ లో ఒక చోటు ప్ర‌ధానంగా ల‌భించేది. ఎంద‌రికో సంబంధించిన విషయాల్లో ఎన్నో వార్త‌లు వ‌స్తుంటాయి. కానీ చూడ్డానికి ఇంపుగా ఉండేవారి వార్త‌లు మాత్రం ప‌దే ప‌దే ప్లే చేస్తుంటారు. దీంతో వారికి అంత విలువ లేక పోయినా.. వారికున్న విజువ‌ల్ బ్యూటీ అన్న ఒక కార‌ణం చేత వారిని ఫేమ‌స్ చేసేది ఎలెక్ట్రానిక్ మీడియా. ఇక సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చేస‌రికి.. దీని డెప్త్ డెన్సిటీ మ‌రింత పెరిగింది. కుమారీ ఆంటీనే తీసుకోండి. రాత్రికి రాత్రి ఆమె ఒక సెల‌బ్రిటీ అయిపోయింది. ఒక స‌మ‌యంలో రోడ్డు మీద ఫుడ్డు బిజినెస్ చేసే ఆమె గురించి సీఎంలు ఆరా తీసేవారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోండి. అంత‌గా ఆమె మోస్ట్ పాపులర్ అయిపోయారు.  ఆమె అమ్మే ఆహారంలో నాణ్య‌త నుంచి, ఆమె వ‌సూలు చేసే ధ‌ర వ‌ర‌కూ అంతా డిస్క‌ష‌నే. అంత‌గా ఆమె పాపుల‌ర్ అయిపోయారు. త‌ర్వాత చూస్తే ఆమె ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు కుమారీ ఆంటీ షాపే క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.  బ‌ర్రెల‌క్క సంగ‌తే తీసుకోండి. కొంప‌దీసి.. ఆమెగానీ ఎమ్మెల్యేగా గెలిచిపోతుందా అనుకున్నారు. క‌ట్ చేస్తే బ‌ర్రెల‌క్క‌కు ల‌క్ష‌ల్లో వ‌స్తాయ‌నుకున్న ఓట్లు కాస్తా వేల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి. ఆ నియోజ‌వ‌ర్గంలో ఆమె గురించి ఎవరికీ తెలీద‌ట‌. క‌నీసం ప‌క్కింటి వాళ్లు కూడా గుర్తు ప‌ట్ట‌లేరని అంటారు. కానీ.. కొన్నాళ్ల గ్యాప్ లో ప్ర‌పంచ‌మంతా తెలిసిపోయారామె. అప్ప‌ట్లో ఆమెకు చందాలే కొన్ని ల‌క్ష‌ల్లో వ‌చ్చాయ‌ని అంటారు.  ఇపుడామె ఊసేదో.. గోసేదో.. ఎవ‌రికీ తెలీడం లేదు.  ఇక పూస‌ల‌మ్మే మోనాలిసా. క‌ళ్ల‌లో ఒక ర‌క‌మైన కైపును క‌లిగి ఉన్న ఈమె మొహం కుంభ‌మేళా టైంలో ఒక సంచ‌ల‌నం. ఆమెను   వైర‌ల్ చేయ‌డంతో.. ఆమె మోస్ట్ పాపుల‌ర్ సెల‌బ్రిటీ ఆఫ్ కుంభ‌మేళాగా అవ‌త‌రించారు. జాతీయ స్థాయిలోనే కాదు అంత‌ర్జాతీయ స్థాయిలోనూ పేరొచ్చేసింది. ఈమెతో ఒక సినిమా చేస్తాన‌ని ఒక ద‌ర్శ‌కుడు ముందుకొస్తే అత‌డు కాస్తా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. క‌ట్ చేస్తే ఏ సినిమా లేదు. మిగిలిన‌దంతా ఒక సోష‌ల్ మీడియా డ్రామా త‌ప్ప‌!!! తాగి వాగిన రాకేష్ మాస్ట‌ర్ ని కూడా ఇలాగే ఫేమ‌స్  చేసిందీ సోష‌ల్ మీడియా స‌మాజం. నిజంగానే తాను తాగి వాగితే అంత గొప్ప‌గా ఉంటుందా? అన్న మాయ‌లో ప‌డ్డ రాకేష్ మాస్ట‌ర్ త‌న తాగుడ్ని విప‌రీతంగా పెంచేశాడు.  అప్పుడో ఇప్పుడో తాగాల్సిన వాడు కాస్తా.. తాగ‌డం అన్న‌దొక దిన‌చ‌ర్య‌గా మార్చుకున్నాడు.. ఆయ‌న తాగి వాగే వ్య‌వ‌హారాలు మాంచి కిక్ ఇస్తాయ‌ని తెలిసిన కొంద‌రు.. వెబ్ సీరీస్ ప్లాన్ చేశారు. అక్క‌డ మందు మ‌రింత ఫ్రీగా దొరికే స‌రికి.. పూటుగా తాగి బీర్ బాటిల్ త‌న్నేశాడు. అదేమంటే అత‌డు తాగిన బీరులోనే తేడా ఉంద‌న్న టాకొచ్చింది. ఏమైతేనేం.. అతడొక బీరు బ‌లిగా పేరు సాధించాడు. ఏకంగా ఈ లోకంలోనే లేకుండా పోయాడు. కిరాక్ ఆర్పీ చెప్పిన‌ట్టు ప‌బ్బుల్లో ఏ చీక‌ట్లో ఏ సెల‌బ్రిటీల ర‌హ‌స్యాలు వింటాడో ఏమో వేణుస్వామి.. అత‌డేదైనా అంటే అది కొన్నాళ్ల‌లో జ‌రిగి కూర్చునేది. ఇత‌డి మాట‌ల మ‌హ‌త్యం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే, ఊళ్ల‌ల్లో అమ్మ‌ల‌క్క‌లు కూడా వేణు స్వామి ఈ సారి మ‌ళ్లీ  ఈ ప్ర‌భుత్వమే వ‌స్తుంద‌ని అన్నాడే.. మ‌రి వ‌చ్చేస్తుందేమో అంటూ వాళ్లు నోళ్లు నొక్కుకుని మాట్లాడుకునే వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. ఎప్పుడైతే ఆయ‌న చెప్పిన జోస్యం ఏపీ ఎన్నిక‌ల  ఫ‌లితాల్లో తేడా కొట్టి బోల్తా ప‌డిందో.. త‌ర్వాత ఈ ఫ్లూటు స్వామి కాస్తా ఫాల్తు స్వామి కింద త‌యార‌య్యాడు. ఇప్పుడాయ‌న చెప్పేవి ఎంత జ‌రిగినా స‌రే అత‌నొక వేస్ట్ ఫెలో కింద ముద్ర ప‌డిపోయారు.  అలేఖ్య చిట్టీ ప‌చ్చ‌ళ్ల వ్య‌వ‌హార‌మే తీసుకోండి.. ఇదే సోష‌ల్ మీడియా స‌మాజం వారిని అంద‌నంత ఎత్తుల‌కు తీసుకు వెళ్లింది. అక్క‌డ ఒక చిన్న క‌స్ట‌మ‌ర్ తో వారు అసభ్యంగా మాట్లాడిన చిన్న ఆడియో క్లిప్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక వైర‌ల్. క‌ట్ చేస్తే వారికి సంబంధించిన ఎన్నో బాగోతాలు బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో.. ఇప్పుడా ప‌చ్చ‌ళ్ల దందానే లేకుండా పోయింది. ఈ ముగ్గురాడ పిల్ల‌లు రోడ్డున ప‌డ్డ సిట్యువేష‌న్. దానికి తోడు ప్ర‌పంచ మాన‌వ చ‌రిత్ర‌లోనే ఒక మ‌గాడి ఉసురు త‌గిలి ఆడ‌వారు దివాళా తీసార‌న్న టాకు.. బీభ‌త్సంగా సౌండ్ చేస్తోంది.  అటు ఇటు కాని అఘోరీ వ్య‌వ‌హారం. అనూహ్యంగా సెల‌బ్రిటీ అయ్యాడు శ్రీనివాస్ అనే ఈ తేడా మాయగాడు. అత‌డు దిస మొల‌తో దిగిన వీడియోలు సైతం వైర‌లే. ఆమెగా మారిన అత‌డికి పీరియ‌డ్స్ వ‌స్తాయా రావా? అన్న‌ది కూడా ఒక డిబేట‌బుల్ పాయింటే. ఈ తేడాను న‌మ్మి వ‌ర్షిణీ అనే మంగ‌ళ‌గిరి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం. ఇప్పుడ‌దో సెన్సేష‌న్. మెయిన్ స్ట్రీమ్ మీడియాకెక్కి లైవుల్లో ఆమె ప్రేక్ష‌కుల మ‌నోభావాల‌తో చెడుగుడు ఆడేసుకునేంత ప్ర‌యారిటీ సొంతం చేసుకుంది. తీరా ఈ అఘోరీ వ్య‌వ‌హారం కేసులు, అరెస్టులు, ఆంక్ష‌లు.  ఇలా ర‌క‌ర‌కాల బాగోతాలు. ఈ అఘోరీ  మాత ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుంది స‌రే, ఆ అమ్మాయితో కాపురం ఎలా సాగుతుంద‌నే కొత్త‌ చ‌ర్చ‌. త‌ర్వాత ఏ పోలీసులొచ్చి.. అరెస్టు చేసి.. ఈ తేడా అఘోరీని ఏ జైల్లో పెడ‌తారో తెలియ‌దు.      సోష‌ల్ మీడియా జ‌మానాలో పేరు సాధించ‌డం సో ఈజీ. కానీ త‌ర్వాత సిట్యువేష‌నే టూ బ్యాడ్ టూ వ‌రెస్టుగా త‌యార‌వుతోంది. కుమారి ఆంటీ  నుంచి అలేఖ్చ చిట్టీ వ‌ర‌కూ అంద‌రిదీ ఇదే బాప‌తు. ఇలా ఫేమ‌స్ అవుతున్నారు.. అలా వారి వ్యాపారం, వ్య‌వ‌హార‌మంతా తుస్సు మంటోంది. ఆ టైంలో వారిని ట్రోల్ చేసి ఎంజాయ్ చేస్తున్న నెటిజ‌న్లు కూడా త‌ర్వాత వారి ఊసే ప‌ట్టించుకోవ‌డం మానేస్తున్నారు.
ఏక్ దిన్ కా సెలబ్రిటీ.. దో దిన్ మే దివాళా Publish Date: Apr 15, 2025 1:04PM

సికిందరాబాద్ స్టేషన్ మూసివేత?.. కారణమేంటో తెలుసా?

సికింద్రాబాద్ రైల్వే‌స్టేషన్  ఆధునీకరణ పనుల కారణంగా వంద రోజుల పాటు స్టేషన్ లోని ఆరు ప్లాట్ ఫారమ్ లను క్లోజ్ చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా సికిందరాబాద్ నుంచి దాదాపు 120 రేళ్లు సికిందరాబాద్ కు రావు. వీటిని చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లిస్తారు.  సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లను నిర్మించనున్నారు. తొలుత 3 నుంచి 5 నంబర్ ప్లాట్ ఫారమ్ ల పనులను చేపడతారు. ఈ పనులు దాదాపు 50 రోజుల పాటు సాగుతాయని అంచనా, ఈ పనులు పూర్తి అయిన తరువాత  పదో నంబర్ ప్లాట్ ఫామ్ వైపు పనులను చేపడతారు. ఆధునీకరణ పూర్తియన తరువాత సికిందరాబాద్ రైల్వే స్టేషన్ రూపురేకలు మారిపోతాయనీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి దీటుగా ఈ రైల్వే స్టేషన్ ఉంటుందనీ అధికారులు చెబుతున్నారు. ఆధునీకరణ పనుల నేపథ్యంలో ప్రయాణీకులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్న అధికారులు వంద రోజుల పాటు ప్రయాణీకులు రైళ్ల కోసం చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు వెళ్లాలని కోరారు.  
సికిందరాబాద్ స్టేషన్ మూసివేత?.. కారణమేంటో తెలుసా? Publish Date: Apr 15, 2025 12:53PM

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం (ఏప్రిల్ 15) సమావేశమైంది. వెలగపూడి సచివాలయంలో  జరుగుతున్నఈ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా సీఆర్డీయే అథారిటీ ఆమోదించిన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీయే కమిషనర్ కు అనుమతి ఇవ్వడం సహా, అసెంబ్లీ , హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లకు పచ్చ జెండా ఊపనుంది.   అలాగే ఎన్ఐపిబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులపై కేబినెట్ ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా రూ.30,667 కోట్ల పెట్టుబడుల  ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్, విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో పాటు పలు కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అదే విధంగా ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు, కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, నెల్లూరులో ఏపీఐఐసీ, విజయనగరంలో గ్రేహౌండ్స, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు భూముల కేటాయింపు విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  అలాగే ఈ కేబినెట్ భేటీ ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉ:దంటున్నారు.  అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ  కా ర్యక్రమానికి  ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.  
 ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ Publish Date: Apr 15, 2025 10:56AM

జగన్ బంధువు నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బంధువు నివాసాలు కార్యాలయాలలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోదాలు నిర్వహించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. సిట్ గత నెల 28, 29 తేదీలలో ఇచ్చిన నోటీసులు ఇవ్వగా విచారణకు గైర్హాజరైన రాజ్ కసిరెడ్డి   తనకు సిట్ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే కసిరెడ్డి రాజ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ నోటీసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సిట్ ఆయనకు ఈ నెల 5న మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. అయితే కసిరెడ్డి రాజ్ ఈ సారీ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్ ఉంది. దీంతో కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న సిట్  అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఏపీ మద్యం కుంభోకోణం దర్యాప్తునకు కసిరెడ్డి రాజ్ ను విచారించి సమాచారం రాబట్టడం అత్యంత కీలకంగా సిట్ భావిస్తోంది. అతడి వద్ద నుంచి విలువైన సమాచారం రాబట్టి కుంభకోణం కేసుకు లాజికల్ ముంగింపు ఇవ్వాలని సిట్ భావిస్తోంది. ఇప్పటికే సిట్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులను విచారించి విలువైన సమాచారాన్ని సేకరించింది.   
జగన్ బంధువు నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు! Publish Date: Apr 15, 2025 10:30AM