Latest News

నష్టపరిహారంతో పాప పరిహారం అవుతుందా?

posted on: Jun 30, 2014 10:17PM

 

నగరం గ్రామంలో గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారు ఒక్కొకరి కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం, గాయపడ్డ వారికీ రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం గెయిల్ సంస్థ సోమవారం చెల్లించింది. అంతే గాక నగరం గ్రామాన్ని గెయిల్ సంస్థ దత్తత తీసుకొని దానినొక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అంగీకరించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులని భావిస్తున్న ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది.

 

కానీ, గెయిల్ సంస్థ ఇవే చర్యలు మొదటే చేప్పట్టి ఉండి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేదే కాదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. తరచూ పైపుల నుండి గ్యాసు లీకవుతోందని స్థానికులు ఎన్ని పిర్యాదులు చేసినా వాటిని ఏనాడు గెయిల్ అధికారులు పట్టించుకోలేదు. ఎవరినీ సస్పెండ్ చేయలేదు. కానీ ఇప్పుడు 17మంది చనిపోయిన తరువాత అందుకు బాధ్యులని భావిస్తున్న ఇద్దరినీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది. గత రెండు మూడు దశాబ్దాలుగా స్థానికుల జీవితాలను చిద్రం చేస్తున్న గెయిల్ సంస్థ ఏనాడూ కూడా వారి సంక్షేమానికి పైసా విదిలించలేదు. కానీ బుగ్గిపాలయిన నగరం గ్రామాన్ని ఇప్పుడు దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు సిద్దపడుతోంది. తమ వ్యాపార ప్రయోజనాలే తప్ప మనుషుల ఆస్తులకు, ప్రాణాలకు విలువీయని గెయిల్ వంటి సంస్థలు రాష్ట్రంలో దేశంలో కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి మీద ప్రభుత్వాలు ఇప్పుడు ఎటువంటి కటిన చర్యలు తీసుకోవు. అవి కూడా తమ కార్యకలాపాల వలన నష్టపోతున్న స్థానిక ప్రజల సంక్షేమం, భద్రత కోసం ఎటువంటి చర్యలు చేప్పట్టవు. చెప్పట్టాలంటే ఇటువంటి దుర్ఘటనలు జరగాలి. అమాయక ప్రజలు మరణించాలి. వారి ఆస్తులు బుగ్గిపాలవ్వాలి. అప్పుడే ప్రభుత్వాలు, సదరు సంస్థలు మేల్కొని చర్యలు చేపడతాయి. ఎక్స్ గ్రెషియాలు చెల్లిస్తుంటాయి. ప్రమాదాలు జరిగినపుడు వాటి నుండి గునపాటాలు నేర్చుకొని మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు మాత్రం చేయకుండా, ప్రజల ప్రాణాలను వెలకట్టి కేవలం నష్టపరిహారాలు చెల్లించడానికే సంస్థలు ఇష్టపడుతున్నాయి. ఇప్పుడయినా ఇది కేవలం నగరం గ్రామానికే సంబందించిన సమస్యగా చూస్తున్నారు తప్ప అంతకు మించి మన ప్రభుత్వాలు చూడలేకపోతున్నాయి. యదా రాజ తదా ప్రజా అన్నట్లుగా ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యవహరిస్తే ఇటువంటి సంస్థలు కూడా అన్నీ పద్దతిగా పాటిస్తాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...