ఏపీ అసెంబ్లీలో తమాషా సంఘటన!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమాషా సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళు లేచి నిల్చోండి అన్నారు. దాంతో పవన్ కళ్యాణ్‌తో సహా మెజారిటీ సభ్యులు లేచి నిల్చున్నారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వీళ్ళని లోపల వేయాలని కేసులు పెట్టింది. కానీ ప్రజలు వీళ్ళని అసెంబ్లీకి పంపించారు అని అన్నారు. ఆ తర్వాత కేసులేవీ లేని వాళ్ళు లేచి నిల్చోండి అని అడిగారు. అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే లేచి నిల్చున్నారు. ‘మీరు అదృష్టవంతులు’ అని చంద్రబాబు ఈ సందర్భంగా చమత్కరించారు.