మాజీ మంత్రి రోజా.. రాజకీయ వైరాగ్యమేనా?

posted on: Apr 8, 2026 5:43PM

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా ఉరుములేని పిడుగులా రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు. రాజకీయాల వల్ల తన ఆరోగ్యం పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఉండటం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి.. తద్వారా ఆనారోగ్యం తప్ప తనకు ఒరిగిందేమీ లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ గా మారాయి.

  రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా..  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.

 నియోజకవర్గ సమస్యలు, పార్టీ బాధ్యతలు మరియు ప్రజల అంచనాల మధ్య వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు సమయమే చిక్కలేదన్నారు. గత ఎన్నికలలో ఓటమితో ఒత్తడి నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఆమె రాజకీయాలకు ఒకింత దూరంగా ఉంటున్నారు. అడపాదడపా తప్ప రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయాలు, తన వ్యక్తిగత ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...