నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలెప్పటి నుంచంటే?

posted on: Mar 30, 2026 6:34AM

దేశ రాజధాని ప్రాంతం నేషనల్ క్యాపిటన్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో విమానయాన రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ప్రతిష్ఠాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ   ఈ భారీ ప్రాజెక్టును శనివారం (మార్చి 28) లాంఛనంగా ప్రారంభించారు.   సామాన్య ప్రయాణికులకు ఈ విమానాశ్రయం మరో రెండు నెలలలోగా అందుబాటులోకి రానుంది.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్ నాయుడు ఈ విషయం వెల్లడించారు. రానున్న నెలన్నర రెండు నెలల్లోగా నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కమర్షియల్ విమాన కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమౌతాయన్నారు.  జెవార్ ప్రాంతంలో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. 

ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' ఈ విమానాశ్రయం నుంచి తన సేవలను మొదలుపెట్టేందుకు ముందుకు వచ్చింది.  తొలి దశలో ఏటా సుమారు 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా ఈ విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించడం ద్వారా ఏడాదికి 7 కోట్ల మంది ప్రయాణించే స్థాయికి దీని సామర్థ్యాన్ని పెంచనున్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తొలి దశ అభివృద్ధి కోసం ప్రభుత్వం దాదాపు రూ.11,200 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అత్యాధునిక సాంకేతికతతో, పర్యావరణ హితంగా తీర్చిదిద్దన ఈ ఎయిర్ పోర్టు..  దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది.  ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంత అభివృద్ధిలో నొయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు  కీలక పాత్ర పోషించనుంది.

ఈ ప్రాజెక్టు వల్ల కేవలం రవాణా సౌకర్యాలే కాకుండా, స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం జోరందుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.  ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ కోసం మెట్రో మరియు ఇతర రహదారి మార్గాలను కూడా ప్రభుత్వం వేగంగా సిద్ధం చేస్తోంది. వచ్చే రెండు నెలల్లో అన్ని రకాల భద్రతా అనుమతులు,  ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో విమానరాకపోకలకు నొయిడా విమానాశ్రయం సిద్ధం అవుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...