ఏపీ అసెంబ్లీ టైగర్...విపక్షాల పాలిట సింహస్వప్నం
posted on: Mar 11, 2026 2:10PM
.webp)
ఒక రాజకీయ నాయకుడిలో విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి....మేధస్సు , వీటన్నింటి తోపాటు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన తోడయితే … ఆ నాయకుడు పరిపూర్ణ రాజకీయవేత్తగా అవతరిస్తారు…ఆయనపై విమర్శలు చేయాలన్నా ప్రత్యర్థులకు గుండెళ్లో రైలు పరుగెత్తడమే....అది నిజంగా చాలా అరుదైన కాంబినేషన్. ఇటు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంత మాస్గా ఉంటారో… అటు శాసన సభా,ఆర్థిక వ్యవహారాల్లో అంత క్లాస్గా ఉంటారు. తన వాగ్ధాటితో విపక్షాలను గడ గడ లాడించడం వల్ల ఆయన సహచర ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచే కాదు… రాజకీయ వర్గాలన్నింటి నుంచీ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన ఎవరో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది... ఆయనే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
ఆయన గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదని ఓ ప్రచారం ఉండేది. కాని దానికి భిన్నంగా 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాదించిన నేపథ్యంలో పయ్యావుల కూడా ఉరవకొండ నుంచి గెలుపొందారు. దీంతో పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేశవ్ కు మంత్రివర్గంలో కీలక శాఖలు కేటాయించారు చంద్రబాబు.. పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పయ్యావులపై ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రశంసించారు.ఈ నేపథ్యంలో… వాటీజ్ పయ్యావుల? ఆయన పనితనం ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది.
బడ్జెట్ను ఎవరికైనా చదవడం మామూలే…కానీ ఆ బడ్జెట్ను స్పష్టంగా, గణాంకాలతో, విశ్లేషణతో వివరించగలిగితేనే అసలు ఆర్థిక నిపుణుడని చెప్పాలి. అలా మాట్లాడే నాయకులు అరుదుగానే ఉంటారు. పయ్యావుల కేశవ్ కూడా అలాంటి నాయకుల్లో ఒకరు. ఆర్థిక మంత్రిగా ఆయనకు తొలి అనుభవం మాత్రమే కావచ్చు. కానీ ఆయన చూపిస్తున్న పట్టుదల, డేటాపై ఉన్న అవగాహన… రాజకీయ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఇటీవల అసెంబ్లీలో పయ్యావుల బడ్జెట్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. పయ్యావుల మాట్లాడుతున్నప్పుడు అది ఒక క్లాస్ విన్నట్టుగా ఉంటుందని… ఆయనకు ఉన్న విషయ పరిజ్ఞానం, డేటాపై పట్టు అద్భుతమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.
ఇంతటితో ఆగకుండా… పయ్యావుల తన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక కరపత్రం చూపిస్తూ… అక్కడ జరుగుతున్న పనులను కూడా వివరించారు.పయ్యావుల విషయంలో మాత్రం ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పయ్యావుల కేశవ్ కేవలం పదవి ఉన్నందుకే ఈ పనితనం చూపిస్తున్న నాయకుడు కాదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఆయన పీఏసీ చైర్మన్ గా తన మేధస్సు, విశ్లేషణతో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లోని లోపాలను బయటపెట్టారు. అప్పుడు ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన అంశాల్లో ముఖ్యమైనది సీఎఫ్ఎంఎస్ స్కామ్. దాదాపు 41 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సరైన రికార్డులు లేవని ఆయన ఆధారాలతో వెల్లడించారు. కోడ్లను మార్చి నిధులను పక్కదారి మళ్లించారని… తన ఆడిట్ నివేదికల ఆధారంగా వివరించారు.ఈ అంశంపై ఆయన చేసిన పోరాటం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
బడ్జెట్లో చూపించకుండా, ట్రెజరీ నిబంధనలకు విరుద్ధంగా ఖర్చులు జరిగాయని పయ్యావుల ఆరోపించడంతో… కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు కాగ్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. పయ్యావుల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే… ఆయన టీడీపీలో విశ్వసనీయమైన, మేధావి వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.1994, 2004, 2009, 2019, 2024 ఎన్నికల్లో… అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. మధ్యలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
చంద్రబాబు ఒక పని అప్పగిస్తే… అది పూర్తయ్యే వరకు పయ్యావుల నిద్రపోరని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అంత నిజాయితీగా బాధ్యతను నిర్వహించే నాయకుడిగా ఆయన పేరుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లోని లోపాలను ఆధారాలతో బయటపెట్టి పెద్ద చర్చకు దారితీశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ముఖ్యమంత్రి చంద్రబాబు పయ్యావుల కేశవ్కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేసి… అప్పుల వివరాలను ప్రజల ముందుంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా… సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ… అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం సాధించేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే అది ఒక క్లాస్ విన్నట్టుగా ఉంటుందని… ఆయన డేటాపై పట్టు అద్భుతమని పవన్ పేర్కొన్నారు. ఇలా నమ్మకం, పనితనం రెండింటికీ ప్రతీకగా నిలుస్తున్నారు పయ్యావుల కేశవ్. 2026 ఫిబ్రవరి 14న ఆయన ప్రవేశపెట్టిన ₹3.32 లక్షల కోట్ల బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం సాధించిందని విశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా… ఆయన పనితీరుకు అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఐదు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా అనుభవం ఉన్న పయ్యావుల… ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో సంఖ్యా బలంలో అధికంగా ఉన్న వైసిపీ పక్షానికి చెమటలు పట్టించారు. బడ్జెట్ పై విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏవో పేపర్లు చూపిస్తూ కాగ్ నివేదకలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాట్లాడారు. దానికి పయ్యావుల ఆ పేపర్లు పంపితే చూసి సమాధానం చెబుతానని పట్టు పట్టారు.
చివరకు ఆ పేపర్లు కాగ్ నివేదిక కాదని జగన్ పత్రికలో వచ్చిన కథనాలని తేల్చి వైసీపీ డొల్ల తనాన్ని ఎండగట్టారు. అలాగే కల్తీ నెయ్యి విషయంలోని విపక్ష ఆరోపణలను బలంగా తిప్పి కొట్టారు. ఏవిషయంపైనైనా సరే పూర్తి సమాచారంతోనే మీడియా ముందుకు రావడం ఆయన ప్రత్యేకత..ఇప్పుడు మంత్రిగా కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే… అటు తన నియోజకవర్గ అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.చాలా కాలం తర్వాత… ఒక మంచి ఆర్థిక అవగాహన ఉన్న నాయకుడు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు.


.webp)



