ఇరాన్ దూకుడును ఖండించిన ఈయూ, జపాన్

posted on: Mar 28, 2026 9:57AM

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంపై యూరోపియన్ దేశాలు, జపాన్ సంయుక్తంగా చర్యలకు దిగాయి. అంతర్జాతీయ నౌకాయాన భద్రత కోసం ఈ దేశాలు చేతులు కలిపాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత కారణంగా హర్మూజ్ జలసంధి గుండా  వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో  బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌ సహా జపాన్   ఉమ్మడి వేదికపైకి వచ్చి సముద్రమార్గాల్లో   స్వేచ్ఛాయుత రవాణా పునరుద్ధరణకు నడుంబిగించాయి.  

ఇరాన్ అనుసరిస్తున్న దూకుడు చర్యలను ఈ దేశాలు సంయుక్తంగా ఖండించాయి.  అమెరికా, ఇజ్రాయెల్  దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్న ఆ దేశాలు..  సముద్ర గర్భంలో మైన్లు అమర్చడం,  డ్రోన్లు,  క్షిపణులతో వాణిజ్య నౌకలు లక్ష్యంగా దాడులకు పాల్పడడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు  బ్రిటన్ ప్రధాని కార్యాలయం ద్వారా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇరాన్ చర్యలు ప్రపంచ శాంతికి, ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించాయి. 

గత 20 రోజులుగా హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ 20 రోజులలో  కనీసం 23 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఇరాన్ దాడులకు పాల్పడిన వాణిజ్య నౌకలలో 10 చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఈ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడటంతో ఈ దేశాలు స్పందించాయి.  ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని సంయుక్తంగా ప్రకటించాయి.

అదలా ఉంటే.. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు,  నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో   సభ్య దేశాల సాయాన్నికోరగా అందుకు నాటో దేశాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా సైనిక చర్యకు దిగడానికి ఐరోపా దేశాలు నిరాకరించాయి.  దాడుల కంటే దౌత్యపరమైన చర్చలు, పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే ఉత్తమమని స్పష్టం చేశాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...