కలెక్టర్ కాదు టీఆర్ఎస్ వర్కర్! కేసు పెడతామని ఈటల వార్నింగ్

మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్  భూములను జమునా హ్యాచరీస్ కబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించడం దుమారం రేపుతోంది. కలెక్టర్ ప్రకటనపై ఈటల రాజేందర్ సతీమణి, జమునా హెచరీస్ ఎండీ జమునా రెడ్డి తీవ్రంగా స్పందించారు. 70 ఎకరాలు ఆక్రమించుకున్నామంటోన్న కలెక్టర్‌పై ఖచ్చితంగా కేసులు పెడతామని జమున హెచ్చరించారు. కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.  తాము కొన్నదే ఏడు ఎకరాలు అయితే 70 ఎకరాలు అని కలెక్టర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు.

దరణి వెబ్ సైట్ లో ఉన్న భూములనే తాము కొన్నామని, దరణి వెబ్ సైట్ తప్పులు చూపిస్తుందా అని జమునా రెడ్డి నిలదీశారు. ‘‘మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పిన్లటు అధికారులే చెప్తున్నారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా?. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. బయటకొచ్చినాక మరొకలా వ్యవహరిస్తున్నారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి? ’’ అని జమున ప్రశ్నించారు. 

మహిళా సాధికారిత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించటం ఎంతవరకు సబబు అని జమునా రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారని జమున ఆరోపించారు. 33 జిల్లాల్లో ఈటల రాజేందర్ పర్యటిస్తారని, ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను అమ్ముకున్నామని చెప్పారు. తమ గెలుపును ఓర్వలేక ఈటల రాజేందర్‌ను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని జమున మండిపడ్డారు