కొండెక్కిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీకి ఆధారాలు దొరకలేదట.. 

అనుకున్నట్లే జరిగింది. అనుమానాలే నిజమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్  కేసు నీరుగారి పోయింది. దోషులెవరో తెలకుండానే విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో డ్రగ్స్ దిగుమతి, నిధుల మళ్లింపు వంటి వాటిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులో సరైన ఆధారాలు లభించకపోవడంతో ఇప్పుడీ కేసుకు మంగళం పాడాలని ఈడీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో తెలుగు చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పట్లో కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో పలువురు ప్రముఖ నటీనటులను విచారించారు. వీరిలో కొందరి నుంచి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపారు. కొందరు సాక్షులను కూడా విచారించారు. ఇన్నిచేసినా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కేసును ముగించింది. 

ఆబ్కారీ దర్యాప్తు ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టులో ఈడీ అధికారులు కొత్తగా మళ్లీ కేసు నమోదు చేయడంతో మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజ, రానా, చార్మి, రకుల్‌ప్రీత్ సింగ్ తదితర 12 మందిని విచారించారు.  ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరికి కేసును మూసేయాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.