అందరికి ఓటు.. ఈసీ టార్గెట్!

posted on: Oct 31, 2025 11:18AM

మన దేశంలో ఓటరు జాబితా సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా.. డూప్లికేట్ ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు, వలస వెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించేందుకే.. ఎన్నికల సంఘం..  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు.. ఓటర్ లిస్టులో ఉండేలా చూస్తోంది. కోట్లాది మంది యువ ఓటర్ల చేరిక వల్ల.. ఓటర్ లిస్టులు కూడా అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది.  కొన్ని రాజకీయ పార్టీలు ఈ రివిజన్‌కు మద్దతిస్తుండగా.. మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రక్రియ పట్ల తీవ్ర అభ్యంతరాలు చెబుతూ, ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయ్. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచు కొని.. ఈ రివిజన్ చేస్తున్నారని.. ఇది ఓటరు జాబితాలను తారుమారు చేసే ప్రయత్నమని ఆరోపి స్తున్నారు. అధికార పార్టీ.. తమకు అనుకూలంగా లేని వర్గాలు, మోనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, మహిళలు, పేద వర్గాల ఓటర్ల పేర్లను.. వ్యూహాత్మకంగా జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో.. ఓటర్లు తమ అర్హతని నిరూపించుకునేందుకు బర్త్ సర్టిఫికెట్ల లాంటి పత్రాలను సమర్పించాల్సి రావడం నిరక్ష్యరాస్యులు, పేదలు, వలస కార్మికులకు కష్టమని వాదిస్తున్నారు. బీహార్‌లో జరిగిన ఫస్ట్ ఫేజ్ రివిజన్ తర్వాత.. లక్షలాది మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ముఖ్యంగా, ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉన్నవారి పేర్లు.. ఎక్కువగా తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో.. ఎస్ఐఆర్‌పై కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లందరూ జాబితాలో ఉండేలా చూడటమే ఎస్ఐఆర్ లక్షఅయం. వన్ మ్యాన్ వన్ ఓట్ అనే సిద్ధాంతాన్ని బలోపేతం చేసే ఉద్దేశం కూడా ఉంది. అనేక రాజకీయ పార్టీలు గతంలో ఓటర్ లిస్ట్‌లపై ఆందోళన వ్యక్తం చేశాయి. వాటన్నింటిని పరిష్కరించేందుకు కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు.. ఈ రివిజన్ వెనుక రాజకీయ కారణాలున్నాయని.. నకిలీ ఓట్ల తొలగింపు పేరుతో.. తమ మద్దతుదారులను టార్గెట్‌గా చేసుకొని.. ఓటు హక్కును దోచుకునే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం.. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ అని, ఎన్నికల సంస్కరణల్లో భాగమని చెబుతోంది. ఎస్ఐఆర్‌లో భాగంగా.. ఓటర్ జాబితాలోని ఓటర్లందరికీ.. బూత్ లెవెల్ ఆఫీసర్లు.. ప్రత్యేక ఎన్యుమరేషన్ ఫామ్స్ అందిస్తారు. అందులో.. సమగ్రమైన ఓటర్ జాబితాకు కావాల్సిన అన్ని వివరాలు ఉంటాయి. బీఎల్‌వోలు.. ప్రతి ఇంటికీ మూడు సార్లు వెళ్తారు. వలస వచ్చిన ఓటర్ల సమస్యని కూడా పరిష్కరిస్తారు. అంతేకాదు.. ఓటర్లు కూడా తమ ఎన్యుమరేషన్ ఫామ్స్‌ని ఆన్‌లైన్‌లోనూ సమర్పించొచ్చు. బీఎల్‌వోలు.. ఫామ్స్ పంపిణీ చేయడం ప్రారంభించాక.. ఓటర్ల తమ వివరాలను పాత ఓటర్ లిస్టుతో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

2003 ఓటర్ లిస్టులో.. తమ పేరు ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. వారి పేర్లు గానీ వారి తల్లిదండ్రుల పేర్లు గానీ 2003 నాటి ఓటర్ లిస్టులో కనిపిస్తే.. వారు ఎలాంటి అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 నుంచి 2004 కాలం నాటి ఓటర్ లిస్టులను.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు.. తమ చేరికను నేరుగా ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరించుకునే అవకాశం కల్పించారు. 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకతని కాపాడేందుకు.. అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులను కలిసి.. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి వివరించనున్నారు. ఎందుకంటే.. అనేక సార్లు రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టుల గురించి ఆందోళనలు లేవనెత్తాయ్. అందువల్ల.. ఓటర్ లిస్టులో కచ్చితత్వం, పారదర్శకతని నిర్ధారించేందుకు.. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని నిర్ణయించింది. ఈ రివిజన్‌లో భాగంగా.. ప్రతి బూత్ లెవెల్ అధికారికి.. దాదాపు వెయ్యి మంది ఓటర్ల బాధ్యత అప్పగిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని.. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మానిటర్ చేస్తారు. బీహార్ మోడల్‌లా.. ఈ ప్రక్రియని విజయవంతం చేయడమే లక్ష్యమని చెబుతోంది ఈసీ. అదే విధంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఎలాంటి దోషాలు లేని సమగ్రమైన ఓటర్ లిస్టులను ప్రకటించడమే.. రెండో దశ ఎస్ఐర్ లక్ష్యమని ఎన్నికల సంఘం గట్టిగా చెబుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...