కాంగ్రెస్ కు జ్ఞానోదయం?!

హర్యానా ఫలితాలతో కాంగ్రెస్ కు జ్ణానోదయం అయినట్లుంది. అతి విశ్వాసంతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న రాష్ట్రాన్ని చేజార్చుకున్న హస్తం పార్టీ ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముందు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల కు ముందు నుంచీ కూడా సర్వేలన్నీ, చివరాఖరుకు బీజేపీ అనుకూల మీడియా సంస్థలు కూడా హస్తం జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఉద్ఘాటించాయి. పోలింగ్ పూర్తయిన తరువాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ విజయానికి తిరుగులేదనే చెప్పాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తల్లకిందులయ్యాయి. దరిమిలా ఈసీ కూడా సర్వేలకూ, ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదని చెప్పేసింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలకూ కూడా కాశ్మీర్, హర్యానాలతో పాటే ఎన్నికలు జరగాల్సి ఉంది. కారణాలేమైతేనేం.. భద్రత కారణాలు చూపుతూ ఎన్నికల సంఘం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు నవంబర్ లో ముహూర్తం నిర్ణయించింది. జార్ఖండ్ లో రెండు విడతలలో నవంబర్ 13, 20 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. మహారాష్టరలో ఒకే విడతలో నంబంర్ 20న పోలింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ నవంబర్ 23న వెలువడతాయి. నవంబర్ 20 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అదీ సంగతి. జార్ఖండ్, మహారాష్ట్ర లలో వివిధ సర్వేలు కూడా ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉంటాయనే చెప్పాయి. పీపుల్స్ మూడ్ బీజేపీకి అనుకూలంగా లేదని తమ సర్వేలలో తేలిందని పేర్కొన్నాయి.  అయితే ఈ సారి కాంగ్రెస్ ఆ సర్వేల ఫలితాల ప్రవాహంలో కొట్టుకుపోవడానికి రెడీగా లేదు. అందుకే రెండు రాష్ట్రాలకూ ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. జార్ఖండ్ కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను, మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలట్ లను, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానికి తెలంగాణ మంత్రి సీతక్క, సయ్యద్ నసీర్ హుస్సేన్ లు పరిశీలకులుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు గంటల ముందు వీరి నియామకాలను ప్రకటించింది. హర్యానా ఎన్నికలలోలా గెలుపు ముంగిట బోర్లా పడకుండా ఈ పరిశీలకులు ఏ మేరకు కాంగ్రెస్ ను కాపాడుతారో చూడాల్సిందే.  
Publish Date: Oct 16, 2024 5:52PM

సీఈసీకి తప్పిన ప్రమాదం

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తృటిలొ  పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతి కూల వాతావరణంలో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ పిథోర్ గఢ్ జిల్లాలో బుధవారం (అక్టోబర్ 16) జరిగింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఉత్తరాఖండ్ అదనపు సీఈవోతో కలిసి ఆయన ఉత్తరాఖండ్ లోనిమున్సియారీకి వెడుతున్నారు. మార్గ మధ్యంలో పర్వత ప్రాంతాలలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో  చిక్కుకుంది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. వాతావరణం పరిస్థితులు మెరుగుపడిన తరవాత సీఈసీ యథావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించి మున్సియారీకి వెళ్లారు.  
Publish Date: Oct 16, 2024 4:32PM

కొండాసురేఖకు బిగ్ షాక్... గురువారం  ఢిల్లీకి అసమ్మతి వర్గం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , మంత్రి కొండాసురేఖ మధ్య జరిగిన  వివాదం  చిలికి చిలికి గాలి వానగా మారింది. బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటోలు లేకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొట్టుకునే వరకు వెళ్లడంతో కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదంలో మంత్రి తల దూర్చడమే కాకుండా ఇన్ స్పెక్టర్ కుర్చీలో కూర్చొని పోలీస్ కమిషనర్ , సిఐలను దూషించడం వివాదాస్పదమైంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత దీపా దాస్ మున్షీకి ఫిర్యాదు చేసిన  వరంగల్ కాంగ్రెస్ నేతలు రేపు ( అక్టోబర్ 17) న ఢిల్లీ వెళ్లి  ఎఐసిసి నేత కెసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వేములవాడలో మంత్రి రాక సందర్బంగా స్వామి వారికి సమర్పించే నైవేద్యం ఆలస్యం చేయడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని వారు అన్నారు. సినీ హీరో నాగార్జున కుటుంబ సభ్యుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే క్రిమినల్ కోర్టులో రెండు వేర్వేరు పరవు నష్టం దావాలను మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. ఒకటి నాగార్జున , మరోటి కెటీఆర్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. సమంతకు క్షమాపణ చెప్పినప్పటికీ  ఈ వివాదం సద్దుమణగలేదు. పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గొడవ సద్దుమణిగినది అని చెప్పినప్పటికీ వరంగల్ కాంగ్రెస్ నేతలు తాడో పేడో తేల్చుకుంటామని అధిష్టానం దగ్గరికి బయలు దేరనున్నారు. అధిష్టానం సీరియస్ గా తీసుకుంటే కొండా సురేఖ మంత్రి పదవి ఊడే అవకాశం ఉంది. 
Publish Date: Oct 16, 2024 4:12PM

నడ్డాకు ఉద్వాసన? బీజేపీ కొత్త సారథి ఎవరంటే..?

బీజేపీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైందా అంటే ఆ పార్టీ సీనియర్ల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో అనుకున్న ఫలితాలు సాధించడంలో విఫలమైన నాటి నుంచీ బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి నడ్డాను తప్పించాలన్న చర్చ మొదలైంది. పనిలో పనిగా జాతీయ అధ్యక్షుడితో పాటుగా పార్టీ పదవులలో కూడా సమూల మార్పులు చేయాలని హైకమాండ్ భావిస్తోంది.  ముచ్చటగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరినా, అనుకున్న స్థాయిలో స్థానాలను గెలుచు కోవడంలో బీజేపీ వైఫల్యం నడ్డా మెడకు చుట్టుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే అంటే 2025 జన వరి లేదా ఫిబ్రవరిలో పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టు అవకాశాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల పట్ల తీవ్ర నిరుత్సాహంతో ఉన్న బీజేపీ హైకమాండ్.. నడ్డా మెతకతనం వల్లే ఫలితాలు అనుకున్న విధంగా రాలేదని భావిస్తున్నది. అందుకు పార్టీని ముందుండి నడిపించగలిగిన బలమైన నేత కోసం గాలిస్తోంది. వాస్తవానికి బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం గత జూన్ తోనే ముగిసింది. అయితే మోడీ, షాలకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నడ్డా స్థానంలో మరొకరిని తీసుకువచ్చే యోచన బీజేపీ హైకమాండ్ చేయలేదు. అందుకే బీజేపీ మూల సిద్ధాంతానికి విరుద్ధమే అయినా నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా జోడు పదవులలో కొనసాగిస్తూ వచ్చింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత, తాజాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఇక నడ్డాకు ఉద్వాసన పలకక తప్పదన్న నిర్ణయానికి కమలం పెద్దలు వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టగలిగే నేత ఎవరన్న దానిపై అధిష్ఠానంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. పరిశీలనలో  మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్, అలాగే రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత వసుంధరా రాజెపేర్లు ప్రముఖంగా వినిపి స్తున్నాయి. అయితే వీరంతా కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన నేతలు కావడంతో  మోడీ, షాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ అయితే నితిన్ గడ్కరీని సిఫారసు చేస్తోందని అంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల నాటికి ఎవరి పేరు ఖరారౌతుందన్నది వేచి చూడాల్సిందే. 
Publish Date: Oct 16, 2024 4:05PM

ఐఏఎస్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ పునర్విభజనలో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లను కేంద్రం ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఈనెల 9న డివోపిటీ ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీచేసింది.అయితే, తాము తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, సృజనలు క్యాట్‌ను ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఊరట దక్కలేదు. డివోపిటీ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.  దీంతో  వీరంతా బుధవారం (అక్టోబర్ 16) హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ తీర్పు పై స్టే ఇవ్వాలని, తెలంగాణలోనే తమను కొనసాగించే విధంగా చూడాలని ఐఏఎస్ అధికారులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.  అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఐఏఎస్‌లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు క్యాట్ ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పస్టం చేసింది. డీపీవోటి ఆదేశాల మేరకు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. 
Publish Date: Oct 16, 2024 3:43PM