Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ్ కోసం డీఎంకేతో కటిఫ్.. కాంగ్రెస్ కు మైనసేనా?
posted on: May 9, 2026 12:38PM

తమిళనాడు రాజకీయ యవనికపై సంభవించిన పరిణామాలు, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారనున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన, ప్రమాదకరమైన అడుగు వేసిందంటున్నారు. దశాబ్దాలుగా విశ్వాసపాత్రమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేతో బంధాన్ని తెంచుకుని.. విజయ్కు హస్తం పార్టీ అండగా నిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా.. రానున్న సార్వత్రిక సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఇండియా కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం డీఎంకే అధినాయకత్వానికి మింగుడుపడలేదు. ఫలితంగా కాంగ్రెస్తో ఇకపై ఎలాంటి పొత్తు ఉండదని డీఎంకే స్పష్టం చేయడమే కాకుండా.. పార్లమెంటులో కూడా ఆ పార్టీ ఎంపీల పక్కన కూర్చునేందుకు నిరాకరిస్తుండటం రాజకీయ వేడిని పెంచుతోంది.
ఈ పరిణామం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని గణనీయంగా తగ్గించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం లోక్సభలో డీఎంకేకు 22 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు కలిగిన మూడో పెద్ద పార్టీ డీఎంకే కావడం గమనార్హం. ఇప్పుడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి నుంచి వైదొలగడంతో.. ఇండియా కూటమి బలం ఒక్కసారిగా 232 నుండి 210కి పడిపోయింది. కేవలం 100 మంది ఎంపీలు మాత్రమే ఉన్న కాంగ్రెస్.. ఇలాంటి సమయంలో కీలకమైన మిత్రపక్షాన్ని దూరం చేసుకోవడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల పరంగా చూస్తే తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారనుంది. గత ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు కారణంగా కాంగ్రెస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ డీఎంకే సహకారం లేకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు అన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించినా, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటర్ల మొగ్గు ఎలా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి.
మరోవైపు విజయ్కు మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు లోక్సభలో నామమాత్రపు బలం మాత్రమే ఉంది. ఈ చిన్న పార్టీల మద్దతుతో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పదిలపరుచుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ శక్తిని దూరం చేసుకోవడం వల్ల ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చడం వినా మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. డీఎంకేను కాదని విజయ్ కు కాంగ్రెస్ మద్దతు పలకడాన్ని కాంగ్రెస్ పెద్ద తప్పిదమంటున్నారు.





