వైసీపీ మారలేదు.. మారదు.. చంద్రబాబుపై దుష్ప్రచారంపై లోకేష్ ఫైర్

posted on: Apr 25, 2026 9:40AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియోను ఉద్దేశపూర్వకంగా మార్పింగ్ చేసి..  ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుందని ఈ ఘటన నిరూపిస్తోందని ఫైర్ అయ్యారు.  

  విషయం ఏమిటంటే.. గత మార్చి 30న చంద్రబాబు నాయుడు నాయుడుపేట పర్యటనలో భాగంగా అంబిక అనే లబ్ధిదారురాలి నివాసాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమె భర్త ఆటో డ్రైవర్ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి, అతనికి ఉపాధి మెరుగుపరచడం కోసం బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే.. అదే పర్యటనలో మరో సందర్భంలో ఒక మహిళ తన విద్యావంతుడైన కుమారుడికి ఉద్యోగం కావాలని చంద్రబాబును అభ్యర్థించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. ఉద్యోగం అడిగిన యువకుడికి  చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ..  బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.  

ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవాలను ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం  స్పష్టం చేసినప్పటికీ, మళ్ళీ అదే పాత అబద్ధాన్ని కొత్తగా ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఒక పక్క అభివృద్ధి పనులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే..  మరోపక్క ఇటువంటి తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించాలని చూడటం సమంజసం కాదని లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని  హెచ్చరించారు.

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లేదా వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని పరిశీలకులు సైతం అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎడిటెడ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాటిపై అప్పట్లో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.   బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని లోకేష్ అన్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...