డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్.. భారత్ లో మళ్లీ పెరుగుతున్న కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసరనుందా? థర్డ్ వేవ్ రావడం ఖాయమేనా? కొన్ని రోజులుగా ఇదే ఆందోళన జనాల్లో నెలకొంది. థర్డ్ వేవ్ వస్తుందని కొన్ని సంస్థలు హెచ్చరిస్తుండగా.. ఖచ్చితంగా చెప్పలేమని మరికొన్ని సంస్థలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల్లో వెలుగుచూసిన డెల్టా ప్లస్ వేరియంట్ చాలా ప్రమాదకరమని, వేగంగా విస్తరించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఇండియాలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అంతేకాదు దేశంలో గత రెండు రోజులుగా కొత్త పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. దీంతో దేశంలో మళ్లీ మహ్మమారి పంజా విసరనుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

దేశంలో గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,069 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది. ఇందులో 6,27,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం కొత్తగా 68,885 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,90,63,740కి చేరింది. 1,321 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,91,981 చేరుకుంది.

దేశంలో వెలుగు చూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో మొత్తం 40 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో మహారాష్ట్రలో 21 కేసులు, మధ్యప్రదేశ్ 6, కేరళ 3, తమిళనాడు 3, కర్ణాటక 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూలలో ఒక్కొక్క కేసు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా 30.2 కోట్ల(30,16,26,028) వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.61 శాతంగా ఉందని.. మరణాల రేటు 1.30 శాతంగా ఉందని తెలిపింది.