తిక‌మ‌క‌ బ‌దిలీలు.. త‌ప్పిదాల‌తో దిద్దుబాట్లు.. సీఎస్‌పై విమ‌ర్శ‌లు!

ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. రాష్ట్రంలోకే అత్యంత సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. బాగా స‌మ‌ర్థ‌వంతుడు, ప‌నిమంతుడినే సీఎస్ ప‌ద‌విలో కూర్చొబెడ‌తారు. కానీ, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ చ‌ర్య‌లు ప‌లుమార్లు విమ‌ర్శ‌ల పాల‌య్యాయి. అసంబ‌ద్ద‌ నిర్ణ‌యాల‌తో ప్ర‌భుత్వానికి త‌ల‌వొంపులు తీసుకొస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే....

లేటెస్ట్‌గా 8మంది సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ జీవో రిలీజ్ చేశారు సీఎస్ సోమేశ్‌కుమార్‌. అందులో, ఐఏఎస్ అనితా రాజేంద్ర‌ను MCR HRDI కి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇక్క‌డే సీఎస్ ప‌ప్పులో కాలేశారు. ఈ ఆర్డ‌ర్‌తో ఆమె కంటే సీనియ‌ర్ అయిన హ‌ర్‌ప్రీత్‌సింగ్‌.. జూనియ‌ర్ అధికారి కింద ప‌ని చేయాల్సి ఉంటుంది. ఇది సివిల్ స‌ర్వెంట్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. ఇంత చిన్న లాజిక్ మ‌రిచిపోయారో.. లేక పొర‌బాటు ప‌డ్డారో గానీ.. సీఎస్ సోమేశ్‌కుమార్ చేసిన బ‌దిలీపై డిపార్ట్‌మెంట్ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

ఆ విష‌యం సీఎస్ దృష్టికి రావ‌డంతో.. ఇచ్చిన‌ జీవోలో స‌వ‌ర‌ణ‌ చేశారు. చేసిన త‌ప్పిదాన్ని స‌రిచేసుకున్నారు. ఈసారి అనితా రాజేంద్ర‌ని.. జాయింట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌, MCR HRDI గా పోస్టింగ్ ఇస్తూ ఆర్డ‌ర్ రిలీజ్ చేశారు. కేవ‌లం 8మంది ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్‌లోనే ఇలా త‌ప్పిదానికి పాల్ప‌డితే ఎలా బిగ్ బాస్ అంటూ ఐఏఎస్‌ల సర్కిల్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్‌పై సెటైర్లు ప‌డుతున్నాయి.  

ఇలా అనేక అంశాల్లో సీఎస్ తీరు విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇచ్చేలా ఉంటోంది. అప్ప‌ట్లో కొవిడ్ సోకినా మాస్కు లేకుండా రివ్యూలు నిర్వ‌హించి.. సీనియ‌ర్ ఉద్యోగుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అప్ప‌ట్లో వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్‌-ఓటీఎస్ స్కీమ్ తీసుకొచ్చింది కూడా సీఎస్ సోమేశ్‌కుమారే అంటారు. ఆ ప‌థ‌కం అట్ట‌ర్‌ఫ్లాప్ అయి.. జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ మెజార్టీకి గండికొట్టగా.. కేసీఆర్ ప‌రువంతా పోయి.. సీఎస్‌కు చివాట్లు పెట్టి మ‌రీ.. ఓటీఎస్‌ను విత్‌డ్రా చేసుకున్నార‌ని అంటారు. అలాంటి సీఎస్‌.. మ‌రోసారి ప్ర‌భుత్వం అబాసుపాల‌య్యే ప‌ని చేశారు. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్‌ల బ‌దిలీల్లో తిక‌మ‌క‌, మ‌క‌తిక జీవోల‌తో.. న‌వ్వుల‌పాల‌య్యారు. 

ఇక‌, ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌) క్యాడర్‌ నిబంధనల మార్పుపై కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య తీవ్ర వివాద‌మే జ‌రుగుతోంది. ఈ విష‌యంలోనూ సీఎస్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఇంత‌కీ ఆ వివాదం ఏంటంటే....

‘ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (క్యాడర్‌) రూల్స్‌-1954’లోని రూల్‌ నంబర్‌ 6 ప్రకారం ఒక ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారిని రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర సర్వీసులు లేదా ఇతర సంస్థలకు డిప్యుటేషన్‌పై పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని ఆసక్తిగా ఉన్న అధికారులను మాత్రమే డిప్యూటేషన్‌పై పంపిస్తుంటారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా నేరుగా తానే కేంద్ర సర్వీసుల్లోకి తీసుకొనేలా నిబంధనలను మార్చనుంది. 

దీనిపై కేంద్ర అంతర్గత వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీవోపీటీ) అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ ఈ నెల 12న లేఖలు రాసింది. ఈ నెల 25లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. ఆ లోగా రాష్ట్రాల‌ నుంచి సమాధానం రాకపోతే కేంద్రం నేరుగా నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ స‌ర్కారు గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తోంది. ఐఏఎస్ కేడ‌ర్‌ నిబంధ‌న‌ల మార్పును అస‌లేమాత్రం ఆమోదించబోమంటూ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎస్ సోమేశ్‌కుమార్ బ‌ల‌మైన వాయిస్ విన‌పిస్తున్నారు. అంత‌బాగా రూల్స్ తెలిసిన ఆయ‌న‌.. ఐఏఎస్‌ల బ‌దిలీల్లో.. సీనియ‌ర్లు-జూనియ‌ర్ల అంశాన్ని ప‌ట్టించుకోకుండా హ‌డావుడిగా బ‌దిలీ జీవోలు ఇష్యూ చేయ‌డం.. ఆ త‌ర్వాత పోర‌బాటు జ‌రిగిందంటూ నాలుక క‌రుచుకొని ఇచ్చిన జీవోలు స‌వ‌రించ‌డం.. ఇదేం ప‌ని తీరు పెద్దాయ‌నా.. అంటూ ఐఏఎస్‌లు అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లాడుతున్నారు.