ఎంపీ న్యూడ్ వీడియోకాల్ పై లోక్ సభ స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
posted on Aug 11, 2022 4:05PM
వైసీపీ ఎంపీ న్యూడ్ కాల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు అందింది.
ఒక కాంగ్రెస్ ఎంపీ ఈ ఫిర్యాదు చేశారు. పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్లకు కూడా ఫిర్యాదు చేశారు,
గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో వ్యవహారం పార్లమెంటుకు మాయని మచ్చగా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోపై తక్షణమే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య మూల స్తంభమైన పార్లమెంటులో ఇటువంటి వ్యక్తులు అడుగుపెట్టడానికి అనర్హులని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాల్ వ్యవహారంలో ఎలాంటి తాత్సారానికీ తావు లేకుండా సత్వరమే విచారణ చేసి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ కోరారు.