Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవారి పవిత్రతను కాపాడడమే ప్రథమ లక్ష్యం : సీఎం చంద్రబాబు
posted on: Mar 21, 2026 7:52PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. భక్తుల విశ్వాసాన్ని చూరగొనేలా, సాంకేతికతను జోడించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.
లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక టీటీడీ ద్వారా పేదలకు అందిస్తున్న సేవలకు చెందిన వివిధ కార్యక్రమాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఇక టీటీడీ చేపట్టే ధర్మ ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.
ఆధునిక ల్యాబ్ ఏర్పాటుతో కల్తీకి చెక్
ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. తాను స్వయంగా భక్తులను కలిసినప్పుడు వారు ప్రసాదం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారని, ఆ నమ్మకాన్ని నిరంతరం కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఇక క్యూలైన్లలో సామాన్య భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు.
టెక్నాలజీ సాయంతో రద్దీని క్రమబద్ధీకరించి, వేచి ఉండే సమయాన్ని తగ్గించి, సామాన్య భక్తుడికి సులభంగా స్వామివారి దర్శనం కల్పించాలన్నారు. టీటీడీ అనుబంధ వైద్య సంస్థలైన SVIMS, BIRRD, SPCHCలలో అందుతున్న వైద్య సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. SVIMS, BIRRD, SPCHCలలో చికిత్స పొందే అరుదైన కేసుల కోసం టీటీడీ బడ్జెట్లో నెలకు మరో రూ. 1 కోటి నిధులను ప్రాణదానం ట్రస్ట్ ద్వారా సమకూర్చుతున్నామని టీటీడీ ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
భక్తులకు అన్నప్రసాద విస్తరణ - శ్రీవారి సేవకుల సేవల వినియోగం
టీటీడీ సహా దాని పరిధిలోని 57 దేవాలయాల్లో అన్న ప్రసాదం జరుగుతోందని, మరో 4 దేవాలయాల్లో త్వరలోనే అన్నదానాన్ని ప్రారంభించోతున్నామని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఎన్టీఆర్ హయాంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైందని... దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. టీటీడీ దేవాలయాల్లోనే కాకుండా... రాష్ట్రంలోని వివిధ ప్రముఖ దేవస్థానాల్లో కూడా అన్న ప్రసాద వితరణ జరిగేలా చూస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు 17.12 లక్షల మంది సేవకులు తమ సేవలను అందించారని, సాధారణ రోజుల్లో 3000 మంది, రద్దీ రోజుల్లో 4000 మంది వరకు సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారని అధికారులు చెప్పారు. వీరు అన్నదానం, క్యూలైన్ల నిర్వహణలో భాగస్వాములవుతున్నారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
అలాగే ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్లతో 5,000 నూతన ఆలయాల నిర్మాణం చేపడుతున్న ప్రణాళికలపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో అధికారులకు కొన్ని సూచనలు చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఉండేలా నిర్మాణ ప్రతిపాదనలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.






