Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ది లీడర్.. ది లెజండరీ, ది స్టేట్స్ మన్.. ఒకే ఒక్కడు నారా చంద్రబాబు
posted on: Sep 1, 2025 10:48AM

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ భారత దేశానికి కూడా సెప్టెంబర్ 1 ఒక ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట.. ఇదే రోజు ఒక దార్శనికుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఆయన పాలన, పాలనలో తీసుకువచ్చిన దార్శనికత, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆయన సాగించిన ప్రయాణం ఒక చరిత్ర. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా మారిన చరిత. ఆయనే నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు నాలుగుదశాబ్దాల రాజకీయ ప్రస్థానంలొ.. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట తొలి సారిగా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నంచి ఆయన ప్రతి అడుగూ ఒక చరిత్రే. విజయం, పరాజయం వంటి వాటితో సంబంధం లేకుండా, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన వేసిన ప్రతి అడుగూ ఒక చరిత్రే.
తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 30 ఏళ్ల కిందట 1995, సెప్టెబంర్ 1 న తొలి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రెండు సార్లు విభజిత ఏపీ సీఎంగా. వాస్తవానికి ఆయన రాజకీయ ప్రవేశం నుంచీ ఆయన ప్రస్తానంలో ప్రతి మలుపూ ఒక సంచలనంగా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏడుపదుల వయస్సు పైబడినా ఆయనలో ఎక్కడా వార్ధక్య ఛాయలే కనిపించవు. చంద్రబాబు నాయుడు నడకలో, నడతలో, ఆలోచనలలో అంతా నూతనత్వమే.
1995 సెప్టెంబర్ 1న తొలి సారిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తన విధానాలతో, తన దార్శనికతతో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డు ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.
దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలను రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు.
ఇక యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్సభ స్పీకర్గా చేశారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి నిరహారదీక్ష చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్లో ఆరు రోజులపాటు నిరశన దీక్ష చేసి తెలుగు వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా 7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచారు.
చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే చంద్రబాబు ... కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా సుస్థిర స్థానం సంపాదిం చుకున్నారు. ఇప్పడు నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నారు.






