ఆయుత్థాయ బౌద్ధ పర్యాటకుల్ని బుద్ధవనానికి రప్పించాలి!

బుద్ధవనం కన్సల్టెంట్‌ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

థాయ్‌లాండ్‌ పూర్వరాజధాని ఆయుత్థాయలోని బౌద్ధారామ శిథిలాలు ప్రపంచ బౌద్ధుల్ని ఆకట్టుకొంటున్నాయని, నాగార్జున సాగర్‌లో పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనం, బుద్ధిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కన్సెల్టెంట్‌, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఫసిఫిక్‌ ఏసియా ట్రావెల్‌ అసోసియేషన్‌ 50వ సదస్సులో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన ఆయన స్థానిక బౌద్ధ పర్యాటక స్థావరాల సందర్శనలో భాగంగా, శుక్రవారం (ఆగస్టు 30)నాడు ఆయుత్థాయలోని ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించబడిన వాట్‌ ప్రసిసంపేట్‌, వాట్‌, మహాతట్‌, విహాన్‌ ప్రయంగ్‌ ఖాన్‌, మహా పరినార్వణ బుద్ధ, వాట్‌ రచబురణ, వాట్‌ ఛైవత్థానారాం, బౌద్ధారామాల శిథిలాలు, శిల్పాలను సందర్శించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

సియా రాజ్య రెండో రాజధానిగా, చక్కటి పట్టణ ప్రణాళిక, అరుదైన నీటి సరఫరా వ్యవస్థ, సువిశాల రాజప్రసాదం, ఆకాశాన్నంటే శిఖరాలతో నున్న బౌద్ధ చైత్యాలయాలు, వందలాది శిథిల బౌద్ధ శిల్పాలు, ప్రార్థనా మందిరాలు, స్థూపాలతో క్రీ.శ.1350లో స్థాపించబడిన ఆయుత్థాయ, క్రీ.శ.1767లో జరిగిన బర్మియుల దాడిలో గత వైభవాన్ని కోల్పోయిందన్నారు. 

క్రీ.శ.17వ శతాబ్దిలో, జపాన్‌, చైనా, ఇండియా, పర్షియా, ఐరోపా, వాస్తు శిల్పాల మేళవింపుతో, రత్న కోశిని కళా సంస్కృతికి చిహ్నంగా, ఒక సార్వజనీన నగరంగా, గొప్ప బౌద్ధ కేంద్రంగా, ఆయుత్థాయ గుర్తింపు పొందిందన్నారు.
వాట్‌ మహాతట్‌ బౌద్ధారామంలోని రావి చెట్టు కాండంలో ఇరుక్కు పోయిన బుద్ధని తల శిల్పం, వాట్‌ ప్రసిసంపేట్‌లోని ముగ్గురు రాజుల ధాతువులపై నిర్మించిన మూడు పగోదాలు, బుద్ధుని 100 అడుగుల మహా పరినిర్మాణ శిల్పం ఇక్కడి ప్రత్యేకతలనీ, శిథిలాలైనా, బుద్ధుని ధర్మ పరమణాలను వెదజల్లుతున్నాయనీ, ఇక్కడి పర్యాటకులు, బుద్ధవనం సందర్శించేలా చేయాలని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేసారు.