Top Stories

అయోధ్య ఆలయపూజారి పార్థివదేహం.. సరయు నదిలో జల సమాధి..

అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్యసత్యేంద్ర దాస్ భౌతిక కాయాన్ని సరయు నదిలో జలసమాధి చేశారు. ఆయన రెండు రోజుల కిందట అంటే బుధవారం (ఫిబ్రవరి 13)న శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. అయోధ్య ఆలయ నిర్మాణంలో మొదటి ఇటుకను పేర్చిన ఆచార్య సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయసులో పరమపదించారు. అంతకు ముందు వారం రోజుల కిందటే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చికిత్స పొందుతూ బుధవారం (ఫిబ్రవరి 13) కన్ను మూశారు.  ఆయన భౌతిక కాయాన్ని అయోధ్యలోని  సరయూ నదిలో జల సమాధి చేశారు. పడవలో సత్యేంద్ర దాస్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లి  నదిలో వేశారు. 
Publish Date: Feb 15, 2025 3:07PM

తెలంగాణ బీజేపీలో మరోసారి భగ్గుమన్న అసంతృప్తి!

తెలంగాణలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలో కూనారిల్లుతోంది. ఆ పార్టీకి రాష్ట్రంలో బలం ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష ఆ పార్టీ హైకమాండ్ కు మెండుగా ఉంది. అందుకే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది.  గత అసెంబ్లీ ఎన్నికలక ముందు కూడా ఆ పార్టీలో ఇక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే తరువాయి అన్నంత ధీమా వ్యక్తం అయ్యింది. అయితే ఎన్నికల సమయానికి పార్టీ చతికిల పడింది. కనీసం డబుల్ డిజిట్ స్థానాలు కూడా సాధించలేక చతికిల పడింది. అదే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మళ్లీ బలంగా పుంజుకున్నట్లు కనిపించింది. లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో సమానంగా స్దానాలను సాధించింది. ఇక అప్పటి నుంచీ 2028 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేయడం మొదలెట్టింది. అయితే తెలంగాణలో బీజపీ పరిస్థితి బలపడినట్లు బలపడి ఒక్కసారిగా జావగారిపోవడంలా తయారైంది. ఈ పరిస్థితికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు అసలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్న తెలంగాణ బీజేపీకి కొత్త సమస్య వచ్చి పడింది. ఆ పార్టీ జిల్లాల అధ్యక్షుల నియామకం చేపట్టీపట్టగానే పార్టీలో అసంతృప్తి ఒక్క సారిగా భగ్గు మంది. 23 జిల్లాలకు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను నియమించింది.   వాటిలో గోల్కొండ గోషామహల్ నియోజకవర్గ అధ్యక్షుడి ఎంపిక విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం  వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినాయకత్వంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంలో స్థానిక ఎమ్మెల్యే మాటకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీ నాయకత్వం తనను అవమానించిందన్నారు. అంతే కాకుండా జిల్లాల అధ్యక్షుల ఎంపికలో పార్టీ హైకమాండ్ పారదర్శకత పాటించలేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి.. తన గుడ్ లుక్స్ లో ఉన్న ఒకరిద్దరి సలహాల మేరకు హైకమాండ్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోల్కొండ, ఘోషామహల్ జిల్లా పార్టీ ఇన్ చార్జిగా ఉమామహేంద్ర నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజా సింగ్ అయితే బయటపడి బాహాటంగా విమర్శలు గుప్పించారు. కానీ ఇంకా పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలలో జిల్లాల అధ్యక్షుల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, మొదటినుండి పార్టీ కోసమే కష్టపడినవారిని విస్మరించి, మధ్యలో వచ్చిన వారిని పార్టీ హైకమాండ్ అందలం అందిస్తోందని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గోల్కొండజిల్లా ఇన్ చార్జిగా బీజేపీ హైకమాండ్ నియమించిన ఉమామహేంద్రకు ఎంఐఎం నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయన్నది రాజాసింగ్ ఆరోపణ. తాను మొదటి నుంచీ ఏంఐఎంపై పోరాటం చేస్తున్నాననీ, ఇప్పటి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ ఎంఐఎం నేతలకు సన్నిహితుడిగా మెలుగుతున్న వ్యక్తిని నియమించడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు.   దాదాపు ఇలాంటి ఫీలింగే పలు జిల్లాల అధ్యక్షుల విషయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఉంది. అయితే వారు బహిరంగంగా చెప్పడం లేదంతే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ ఒక్క విషయంలోనే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యమే. అలాగే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు అందరికీ తెలిసిన విషయమే.  ఎంపీలు, ఎంఎల్ఏల సిఫారసుల ప్రకారం కాకుండా తన మద్దతుదారులే జిల్లాల అధ్యక్షులుగా ఉండాలన్న కిషన్ ఆలోచన కారణంగానే చాలాచోట్ల వివాదాలు రేగుతున్నాయని పార్టీ వర్గాలే అంటున్నాయి.  
Publish Date: Feb 15, 2025 2:32PM

ఎనిమిది నెలల్లో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు ప్రారంభించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి త్వరలో అమరావతిలో కూడా ఏర్పాటు కాబోతోంది. క్యాన్సర్ బాధితుల కోసం నందమూరి తారకరామారావు హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తదననంతరం ఆ ఆస్పత్రి బాధ్యతలను చేపట్టిన ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆ ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. ఆస్పత్రిలో ఒక్కో విభాగాన్నీ విస్తరిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో పేదలకు క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.   అందులో భాగంగానే శనివారం (ఫిబ్రవరి 15) బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్‌ వార్డు, పీడియాట్రిక్‌ ఐసీయూను బాలకృష్ణ ప్రారంభించారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటారని అన్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యం అని ప్రకటించిన బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎనిమిది నెలలోనే అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు.  అమరావతిలోని తుళ్లూరులో  బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.  తొలి దశలో తుళ్లూరులో 300 పడకలతో  బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ ను తుళ్లూరులో నిర్మించనున్నారు.  
Publish Date: Feb 15, 2025 2:05PM

అలిపిరి నడకమార్గంలో పెరిగిన చిరుతల సంచారం.. భక్తుల భద్రతకు టీటీడీడ చర్యలు

అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమల దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఆంక్షలు విధించింది. గతంలోలా కాకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు మాత్రమే యథావిథిగా అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత నుంచి గుంపులు గుంపులుగా మాత్రమే భక్తులను అనుమతిస్తారు. అంటే కనీసం వంద మందిని బృందంగా మాత్రమే అలిపిరి నడక మార్గం ద్వారా అనుమతిస్తారు. ఇక చిన్న పిల్లలను అంటే 12 ఏళ్ల లోపు వారిని మధ్యాహ్నం రెండు గంటల తరువాత అలిపిరి నడకమార్గంలో అనుమతించరు. భక్తుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచా రం పెరగడంతో భక్తుల భద్రతను, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. ఇక రాత్రి తొమ్మిదిన్నర గంటల తరువాత అలిపిరి నడకమార్గాన్ని పూర్తిగా మూసేస్తారు.  ఇప్పటికే నడక మార్గంలో విజిలెన్స్ గస్తీని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.  ఇటీవల తరచుగా అలిపిరి మార్గంలో చిరుతల సంచారాన్ని గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. గురవారం (ఫిబ్రవరి 13) అలిపిరి మార్గంలోని ముగ్గుబావి వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు.   ఈ నేపథ్యంలోనే అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తలకు ఈ ఆంక్షలు విధించారు. 
Publish Date: Feb 15, 2025 1:35PM

హైదరాబాద్ లో  వంశీ ఇంట్లో పోలీసుల సోదాలు

గన్నవరం మాజీ  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఎపి పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ రాయదుర్గంలోని ఆయన ఇంట్లో  వంశీ సెల్ ఫోన్ కోసం సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సెల్ ఫోన్  దొరికితే అనేక విషయాలు వెలుగు చూడనున్నాయి. ఇప్పటికే ఈ కేసులో వంశీ అసిస్టెంట్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.  వంశీ కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ లో కూడా ఆయన వాడే సెల్ ఫోన్  ప్రస్తావన ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ  ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఈ కేసులో వంశీ అరెస్టయ్యాడు.  హైద్రాబాద్ లో వంశీని అరెస్ట్ చేసే సమయంలో కూడా ఈ సెల్ ఫోన్ దొరకలేదు. కేసు దర్యాప్తులో  ఈ సెల్ ఫోన్ కీలకం కానుంది. 
Publish Date: Feb 15, 2025 1:03PM