62 పరుగులకే కివీస్ అలౌట్.. ముంబై టెస్టులో భారత్ కు భారీ లీడ్ 

న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యత సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసిన భారత్.. బౌలింగ్ లో అదరగొట్టింది. సీమర్లు, స్పిన్నట్లు పోటీ పడి మరీ బౌలింగ్ చేశారు. కివీస్ ఆటగాళ్లను ఆటాడుకున్నారు.

పేసర్ సిరాజ్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచాడు.  17 పరుగులకే తొలి మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత స్పిన్నర్లు మిడిలార్డర్ పని పట్టారు. దీంతో కేవలం 28.1 ఓవర్లలో 62 పరుగులకు న్యూజీలాండ్ అలౌట్ అయింది. భారత్ కు తొలి ఇన్నింగ్సులో 263 పరుగుల భారీ లీడ్ లభించింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా సిరాజుద్దీన్ మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు, జయంత్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. 

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్‌ పటేల్‌ (10/119) చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఆనందం కివీస్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్‌ను పేస్‌ బౌలర్‌ సిరాజ్‌ (3/19) బెంబేలెత్తించాడు.  టామ్‌ లేథమ్‌ 10, విల్‌ యంగ్ 4, డారిల్‌ మిచెల్ 8, రాస్‌ టేలర్‌ 1, హెన్రీ నికోల్స్ 7, రచిన్‌ రవీంద్ర 4 పరుగులు చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత జయంత్‌ యాదవ్‌ టెస్టుల్లో వికెట్‌ పడగొట్టారు.