కర్నూల్ కు వక్ఫ్ ట్రిబ్యునల్.. స్టే ఉన్నా ఆగని కార్యాలయాల తరలింపు..
posted on Dec 7, 2021 3:06PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం గందరగోళం కొనసాగిస్తోంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టుకు ఆ విషయాన్ని చెప్పింది. అయినా తెర వెనుక మాత్రం చేయాల్సిందంతా చేసేస్తోంది. కార్యాలయాల తరలింపును మాత్రం ఆపడం లేదు జగన్ సర్కార్. తాజాగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గెజిట్ జారీ చేసింది.
వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించి న్యాయపరమైన అంశాలను వక్ఫ్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంది. ఇప్పటి వరకూ ఈ ట్రిబ్యునల్ హైదరాబాద్లో ఉంది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు స్టే ఉంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈ స్టేను ఎత్తి వేయలేదు. అమరావతిలో అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న ఉత్తర్వులు మాత్రం హైకోర్టు ఎత్తివేసింది. కార్యాలయాల తరలింపుపై స్టే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ను తరలించడం లేదని.. ఏర్పాటు చేయడమే కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది.
ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్లో ఉంది. అలాగే లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఈ తరహాలోనే వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్నూ కర్నూలులో ఏర్పాటు చేశారు. న్యాయరాజధానిగా చేస్తున్నామని వైసీపీ చెప్పుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.