అసెంబ్లీ ద్వారం కూల్చివేత కేసు పురోగతి

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్వారం కూల్చివేత కేసులో పురోగతి వచ్చింది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశ ద్వారాన్ని ఒక వ్యక్తి కూల్చివేశాడు. ఆ కూల్చివేతతో అసెంబ్లీ ఆవరణలో సంచలనం రేగింది. ప్రవేశ ద్వారాన్ని కూల్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన స్థలాన్ని డీజీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటన దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ద్వారాన్ని కూల్చిన వ్యక్తిని వరంగల్ జిల్లాకి చెందిన అశోక్‌రెడ్డి అని పోలీసుల విచారణలో తేలింది. అశోక్‌రెడ్డి అసెంబ్లీ ఒకటో గేటును దూకి లోపలకి వచ్చాడని, అతని మానసిక పరిస్థితి మీద అనుమానాలున్నాయని పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశద్వారాన్ని కూల్చడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి, వారికి సంబంధించిన ఆస్తులకు, అంశాలకు రక్షణ కరవైందన్న ఆరోపణలు వినవస్తున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఈ అంశంలో కేంద్రం మరింత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తోంది.